అయిజ, అక్టోబర్ 1 : అక్టోబర్ 2 అంటే అందరికీ జాతిపిత మహాత్మాగాంధీ జయంతి గుర్తుకొస్తుంది. కానీ ఆ రోజంటే నడిగడ్డ ప్రజ ల్లో వణుకుపుడుతుంది. రోజులు తరబడి గ్రా మాలు, పట్టణ ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. జీవితాలే అతలాకుతలమైన సంఘటన మాయని గాయంలా ఉన్నది. పన్నెండేండ్ల కిందట ప్రకృతి ప్రకోపానికీ, కృష్ణా, తుంగభద్ర జీవ నదుల ఉగ్రరూపానికి నడిగడ్డ అతలాకుతలమైంది. అలంపూర్, అయిజ, వడ్డేపల్లి, మానవపా డు, గద్వాల మండలాల్లో వరద బీభత్సం సృష్టించి వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. ఆ సంఘటనలు ఇంకా నడిగడ్డ ప్రజల కండ్ల ముందే కదలాడుతున్నాయి. అయిజ మండలంలో ప్రవహించిన తుం గభద్ర నది వరద ఉగ్రరూపానికి గ్రామాలకు గ్రామాలే అతలాకుతలమయ్యాయి. 2009 అక్టోబర్ 2న సంభవించిన వరద ప్రభావానికి వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేల ఎకరాల్లో చేతికొచ్చిన పంట నీట మునిగింది. వరద ప్రభావానికి కుటుకనూరు గ్రామం పూర్తిగా మునిగిపోగా, రాజాపురం, పులికల్, కేశవరం, వేణిసోంపురం, కిసాన్నగర్ గ్రామాలకు చెందిన వేలాది ఎకరాల భూములు కోతకు గురయ్యాయి.
ఏటి కష్టాలకు చెక్ పెట్టేలా చర్యలు..
తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాల ప్రజలకు త్వరలో ఏటి కష్టాలు తప్పనున్నాయి. తెలంగాణ సరిహద్దులో 2.09 ఎకరాల భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.18.40 లక్షల నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భూ సేకరణ పూర్తి చేశారు. దీంతో నాగల్దిన్నె వంతెన పనులు పరుగులు పెట్టనున్నాయి. నాగల్దిన్నె వంతెన నేలమట్టమై పన్నెండేండ్లు అయినప్పటికీ వంతెన పునర్నిర్మాణం జరగకపోవడంతో మూడు రాష్ర్టాల ప్రయాణికులకు కష్టాలు తప్పడంలేదు. అటు వంతెన నిర్మాణం పూర్తికాక, ఇటు పుట్టి ప్రయాణాలకు అనుమతుల్లేక ప్రజలు నది దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అసంపూర్తిగా నిర్మించిన వంతెనపైకి నిచ్చెనల సాయంతో ఎక్కి నాగల్దిన్నె వరకు నడక ప్రయాణం సాగిస్తున్నారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు నిచ్చెన ఎక్కేందుకు ఇక్కట్లు పడుతున్నారు.
తుంగభద్ర నదిపై వంతెన..
తెలంగాణ, ఏపీలోని రాయలసీమ జిల్లాలను అనుసంధానం చేస్తూ జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్, ఏపీలోని కర్నూల్ జిల్లా నందవరం మండలం నాగల్దిన్నె గ్రామాల మధ్య తుంగభద్ర నదిపై రాకపోకలకు అనువుగా అప్పట్లో వంతెన నిర్మాణానికి 1993లో శంకుస్థాపన చేశారు. 1992లో తుంగభద్ర నదికి వరదలు రావడంతో వంతెన ఆవశ్యకత ఏర్పడింది. 1993లో పనులు మొదలైనా.. అధికారికంగా 2003లో పనులు చేపట్టారు. అప్పటి నుంచి 2009 అక్టోబర్ 2 వరకు తెలంగాణ, ఏపీలోని రాయలసీమ, కర్ణాటకలోని బళ్లారికి రాకపోకలు జరిగాయి. 2009 అక్టోబర్ 2న తుంగభద్ర నదికి వచ్చిన జలప్రళయానికి నాగల్దిన్నె వంతెన పూర్తిగా నేల మట్టమైంది. మూడేండ్ల అనంతరం 2012లో వంతెన పునర్నిర్మాణానికి రూ.42 కోట్లతో మళ్లీ టెండర్లు పిలిచి.. 2013లో పనులు ప్రారంభించారు. 2016 డిసెంబర్లోగా పూర్తి చేయాలని గుత్తేదారుకు గడువిచ్చారు. పనులు మొదలై పన్నెండేండ్లు అయినా ఇప్పటివరకు 80 శాతం కూడా పూర్తికాలేదు.
ఎమ్మెల్యే అబ్రహం ప్రత్యేక చొరవ..
2018 డిసెంబర్లో అలంపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ వీఎం.అబ్రహం నాగల్దిన్నె వంతెన పనులు పూర్తి చేసేందుకు చొరవ తీసుకున్నారు. కర్నూల్ కలెక్టర్, ఆర్అండ్బీ అధికారులతోపాటు మంత్రులు, ఎంపీలను కలిసి వంతెన పనులు పూర్తి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ను ప్రత్యేకంగా కలిసి వంతెన పూర్తి చేసేందుకు కావాల్సిన భూ సేకరణకు నిధులు విడుదల చేయాలని కోరారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని సైతం కలిసి వంతెన ఆవశ్యకతను వివరించారు. దీంతో తెలంగాణ, ఏపీ సీఎస్లు నిధుల విడుదలకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అయిజ మండలం పులికల్, రాజాపూర్ గ్రామాల రైతులకు చెందిన 2.09 ఎకరాల భూ సేకరణకు రూ.18.40 లక్షల నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. దీంతో కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవో ప్రత్యేక చర్యలు తీసుకుని 18 మంది రైతులతో పలు దఫాలుగా చర్చించి భూసేకరణ పూర్తి చేశారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర పరిధిలోని భూమిని ఏపీ రోడ్లు, భవనాల శాఖకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం వంతెన పరిస్థితి..
నాగల్దిన్నె వంతెనను 27 పిల్లర్లతో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు పిల్లర్ల నిర్మాణం పూర్తి చేశారు. వాటిపై ఫ్లాట్ ఫారంగా 84 పీఎస్సీ (ఫ్రీజ్ స్ట్రక్చర్ కాంక్రీట్) స్లాబ్లను వేశారు. తెలంగాణ ప్రాంతంలో భూ సేకరణ సమస్య పరిష్కారమైతే అప్రోచ్ రోడ్డు నిర్మిస్తే.. వంతెన నిర్మాణం సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది.
భూ సేకరణ పూర్తి చేసేలా చర్యలు..
అయిజ మండలంలోని పులికల్ గ్రామ సమీపంలో తుంగభ ద్ర నదిపై నిర్మిస్తున్న వంతెన భూ సేకరణ కు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీం తో భూసేకరణ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ముంపునకు గురైన 18 మంది రైతులకు బ్యాంక్ అకౌంట్లలో నిధులు జమ చేసే ప్రక్రియ పూర్తి చేశాం. నేడో, రేపో రైతుల అకౌంట్లలో నగదు జమయ్యే అవకాశం ఉన్నది. సేకరించిన భూమిని ఏపీ అధికారులకు అప్పగిస్తే పనులు ముమ్మరంగా జరగనున్నాయి.