గద్వాల, సెప్టెంబర్26: పల్లె ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం పల్లెల్లో, పట్టణాల్లో ప్రకృతివనాలు ఏర్పాటు చేసింది. పల్లెల్లో ప్రకృతివనాల పెంపకం వల్ల గ్రామాల్లో నూతన శోభ సంతరించుకున్నది. వీటి ఏర్పాటుతో ప్రస్తుతం పల్లెజనాలు, ఉద్యోగులు సెలవు దినాల్లో ప్రకృతివనాల్లో సరదాగా గడిపేందుకు అవకాశం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పల్లె, మండల ప్రజలకు మరింత ప్రశాంతత చేకూర్చి వారికి ఆహ్లాదాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం ప్రతి మండలానికి మెగా(బృహత్)పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
12 మండలాల్లో ప్రకృతివనాలు
జోగుళాంబ గద్వాల జిల్లాలోని 12మండలాలు 255 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి మండలంలో బృహత్ పల్లె ప్రకృతివనాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో ప్రతి బృహత్ పల్లె ప్రకృతివనంలో వివిధ రకాల 31వేల మొక్కలు నాటనున్నారు. 12మండలాల్లో ప్రకృతివనాల ఏర్పాటుకు ప్రభుత్వం 112ఎకరాలు సేకరించింది. మొత్తం 12 బృహత్ పల్లె ప్రకృతివనాల్లో 3,24,000 మొక్కలు నాటాలని లక్ష్యం నిర్ణయించుకున్నారు. గద్వాల మండలం వీరాపురంలో 10ఎకరాల్లో, ధరూర్ మండలం వామన్పల్లిలో 10 ఎకరాలు, గట్టులో 10ఎకరాలు, కేటీదొడ్డి రైతువేదిక సమీపంలో 10ఎకరాలు, మల్దకల్ మండలం కుర్తిరావుల చెరువు గ్రామంలో 10ఎకరాల్లో బృహత్ ప్రకృతివనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. అలంపూర్ నియోజకవర్గంలో క్యాతూరు, అయిజ మండలం సంకాపురం, ఉండవెల్లి మండలం పుల్లూరులో 10ఎకరాల్లో, ఇటిక్యాల మండలం మునగాల, మానవపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో, రాజోళి మండలం పెద్ద ధన్వాడ, వడ్డేపల్లి మండలం రామపురంలో 8ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వనాల్లో లక్షకుపైగా మొక్కలు నాటారు. మిగతా వాటిలో మొక్కలు నాటే కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతున్నది.
మొక్కల పెంపకం ఇలా..
జిల్లాలో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో ఒక్కో వనంలో 31వేల మొక్కలు పెంచనున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో భూమి చదును చేసి మొక్కలు నాటారు. ఈ వనాల్లో చిట్టడివిని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభు త్వం ముందుకు సాగుతున్నది. ఈ బృహత్ ప్రకృ తివనాల్లో ఒకే రకం మొక్కలు కాకుండా వివిధ రకాల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. నీడనిచ్చే పూలు, పండ్ల మొక్కలతోపాటు ఔషధ మొక్కలు నాటుతున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల చెట్లు ఉండేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పార్కుల్లో వెలగ, గంధం, కుంకుడు, పారిజాతం, సీతాఫలం, చింత, వేప, జామ, దానిమ్మ, కరివేపాకు, టేకు, నేరేడు, ఉసిరి, నిమ్మ, వెదురు, పనస, తంగెడు, జమ్మి, తిప్పతీగ, ఈత, తాటి, చీమచింత తదితర మొక్కలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. వీటితో ప్రజలు వాకింగ్ చేయడానికి వాకింగ్ ట్రాక్తో పాటు మధ్యలో చిన్నారులు ఆడుకోవడానికి స్థలం వదిలి అక్కడ ఆట వస్తువులు ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆహ్లాదం కోసం ఈ వనాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. మొక్కల సంరక్షణపై గ్రామస్తుల్లో బాధ్యత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.