మహబూబ్నగర్, జూలై25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు జల కళ వచ్చింది. ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు కృష్ణానదికి వరద పోటెత్తుతున్నది. ఆదివారం నాడు శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వచ్చింది. ఆల్మట్టికి 2,34,935 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా… అక్కడి నుంచి నారాయణపూర్కు 3,50,408 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదైంది. నారాయణపూర్ కు 3,14,574 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా… అవుట్ ఫ్లో 3,33,827క్యూసెక్కులుగా ఉంది. ఇక జూరాల ప్రాజెక్టుకు ఆదివారం సాయంత్రం 6 గంటలకు 4,04,230 క్యూసెక్కుల భారీ వరద రాగా… 44 గేట్లు తెరిచి శ్రీశైలానికి 4,06,643 క్యూసెక్కులను విడుదల చేశారు. భారీ వరద కారణంగా సాంకేతిక కారణాలతో విద్యుత్ ఉత్పత్తి చేసే పరిస్థితి లేకుండా పోయిందని అధికారులు తెలిపారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు ఆదివారం సాయంత్రం నాటికి 3,69,054 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా..తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ద్వారా 25,426 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు తుంగభద్ర ప్రాజెక్టుకు సైతం భారీ వరద కొనసాగుతున్న తరుణంలో ఆదివారం తొలిసారిగా ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. ప్రాజెక్టుకు 1,79,025 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 20గేట్లు ఎత్తి 46,206 క్యూసెక్కుల వరదను దిగువనకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 100.855 టీఎంసీలు కాగా.. ఆదివారం నాటికి 89.013 టీఎంసీలకు చేరుకున్నది. ఎగువన తుంగ, భద్ర నదులకు భారీగా వరద ఉన్నందున తుంగభద్ర ప్రాజెక్టు నుంచి దిగువనకు మరింత వరద వచ్చే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఓ వైపు కృష్ణానది నుంచి 4లక్షలకు పైగా వరద వస్తుండగా, మరోవైపు తుంగభద్ర నుంచి సైతం వరద ప్రారంభం కావడంతో కేవలం నాలుగు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండి గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కర్ణాటక, మహారాష్ట్రలో వరద ప్రభావం
ఆల్మట్టికి ఎగువన మహారాష్ట్రలోని కొల్హాపూర్, కర్ణాటకలోని బెలగావి జిల్లాల పరిధిలో ఇంకా భారీ వరద ఉధృతి కొనసాగుతున్నది. ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో తీవ్రమైన వరద హెచ్చరికను జారీ చేసింది. ఎగువన పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణానదితో పాటు ఉపనదులైన పంచగంగ, కోయ్నా, వెన్నా తదితర ఉపనదులకు భారీ వరద వస్తున్నది. దీని ప్రభావం వల్ల ఆల్మట్టికి వరద భారీగా కొనసాగుతున్నది. మరోవైపు ఆల్మట్టి, నారాణపూర్, జూరాల ప్రాజెక్టుల పరిధిలోని నదీతీర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తున్నది. దీనివల్ల వాగులు, వంకల ద్వారా వచ్చే వరద కూడా భారీగా ఉంటుంది. దీంతో ఆదివారం జూరాలకు స్థిరంగా 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా… ఆదివారం సాయంత్రానికి 121 టీఎంసీలకు చేరుకుంది. జూరాల నుంచి విడుదల చేసిన వరద 4 లక్షల క్యూసెక్కులు ఉండగా… తుంగభద్ర నుంచి కూడా అవుట్ ఫ్లో ఉన్న తరుణంలో కేవలం 3 రోజుల్లో శ్రీశైలం పూర్తి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. ఇదే ఉధృతి కొనసాగితే త్వరలోనే శ్రీశైలం గేట్లు ఎత్తనున్నారు.
విద్యుదుత్పత్తి
విద్యుత్ ఉత్పత్తి కోసమే నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే ఏపీ రాజకీయాలు చేస్తూ వచ్చింది. అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం ఆపలేదు. అయితే ప్రస్తుతం వస్తున్న వరద చూస్తుంటే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ కేవలం రాజకీయం మాత్రమే చేసిందని ఎవరికైనా అర్థమవుతుందని తెలంగాణ సాగునీటి నిపుణులు అంటున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదను అంచనా వేసే టీఎస్ జెన్ కో విద్యుదుత్పత్తి చేస్తూ వస్తున్నది. ఆదివారం సాయంత్రం విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 25,426 క్యూసెక్కుల వరదను సాగర్ దిశగా వదులుతున్నారు.