జడ్చర్ల, జూలై4: పల్లెలు పచ్చగా, పరిశుభ్రంగా ఉండాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్ల మండలంలోని లింగంపేట, గైరాన్తండా, లక్ష్మణ్నాయక్ తండా, కుర్వపల్లి గ్రామపంచాయతీల్లో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. లింగంపేట గ్రామంలో పర్యటించారు. ఈసందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే గ్రామంలో అవసరమైన ప్రాంతాల్లో సీసీరోడ్లు, మురుగు కాలువలు నిర్మించాలని అధికారులకు సూచించారు. ఆరోగ్య ఉపకేంద్రం మరమ్మతుల కోసం రూ.5లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
అనంతరం రూ.14లక్షలతో నిర్మించిన సీసీరోడ్లను, ప్రధాన రహదారి డివైడర్, హైమాస్ట్ లైట్లు, రూ.6లక్షలతో నిర్మించిన ఈద్గాను ప్రారంభించారు. గైరాన్ తండాలో మిషన్భగీరథ వాటర్ ట్యాంక్, కుర్వపల్లిలో పల్లెప్రకృతివనం, మిషన్భగీరథ వాటర్ ట్యాంక్, లక్ష్మణ్నాయక్ తండాలో క్రిమిటోరియం, డంపింగ్యార్డులను ప్రారంభించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందనున్నదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీతనాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, పీఏసీసీఎస్ చైర్మన్ సుదర్శన్గౌడ్, మాజీవైస్ ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, సర్పంచులు హైమావతివెంకట్రెడ్డి, కుర్వపల్లి శ్రీనివాసులు, జెడ్పీ సీఈవో జ్యోతి, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో స్వరూప, డీఈఈ హీర్యానాయక్, ఏఈ జవహార్బాబు, రాములునాయక్, ఎంపీవో జగదీశ్, ఉపసర్పంచ్ అరుణ, కోఆప్షన్ సభ్యులు ఎనుముల జంగారెడ్డి, ఇమ్మూ, వెంకట్రెడ్డి, పాండునాయక్, గోపాల్, నాగిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.
పట్టణ ప్రగతిలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల మున్సిపాలిటీలోని సరస్వతీనగర్లో నిర్వహించిన పట్టణ ప్రగతి పాల్గొని మొక్కలు నాటారు. 25వ వార్డులో రూ.కోటితో నిర్మాణం చేసే సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. హరితహారంలో భాగంగా ప్రతి ఇంటికీ 6మొక్కలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జడ్చర్లలో శ్రీసాయి మల్టిస్పెషాలిటీ దవాఖానను ప్రారంభించారు. కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ కాట్రపల్లి లక్ష్మయ్య, పీఏసీసీఎస్ అధ్యక్షుడు సుదర్శన్గౌడ్, చైర్పర్సన్ లక్ష్మి, వైస్ చైర్పర్సన్ సారిక, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్రెడ్డి, జ్యోతి, సతీశ్, రమేశ్, చైతన్య, నాయకులు మురళి, దోరేపల్లి రవీందర్ ఉన్నారు.