తిమ్మాజిపేట, ఆగస్టు 1: మండలంలో హరితహారం లక్ష్యాన్ని చేరుకోవడంపై అధికారులు దృష్టి పెట్టారు. మండలంలో ఈనెల 10వ తేదీ వరకు నిర్దేశించిన మేరకు మొక్కలు నాటేందుకు గ్రామాల వారీగా ప్రణాళికలు రూపొందించారు. మండలంలో హరితహారం కింద ఈ ఏడాది 2.53లక్షల మొక్కలు నాటాల్సి ఉండగా, 1.30లక్షలకు పైగా మొక్కలు నాటారు. హోంసీడ్లో భాగంగా మండలంలోని 66వేలకుపైగా మొక్కలు పంపిణీ చేశారు. కాగా తీసుకున్న అన్ని మొక్కలు నాటకపోవడంతో వాటిని ఇంటింటికీ తిరిగి నాటించాలని అధికారులు ఆదేశించారు. మండలంలో ఈ నెల పదవ తేదీ వరకు సుమారు 1.20లక్షల మొక్కలు నాటాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా పంచాయతీ రహదారుల్లో రెండు వరుసల్లో, ఆర్అండ్బీ రహదారుల్లో మూడు వరుసల్లో మొక్కలు నాటాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సర్పంచ్, కార్యదర్శి ప్రతి ఇంటికో మామిడి మొక్క ఇచ్చి స్వయంగా వెళ్లి నాటించాలని స్పష్టం చేయడంతో మామిడి మొక్కల కొనుగోలు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే మరికల్, మారెపల్లి, తిమ్మాజిపేట, నేరళ్లపల్లి, గుమ్మకొండ గ్రామాలు మొక్కలు కొనుగోలు చేసి నాటుతున్నారు. నాటిని ప్రతిమొక్కనూ సంరక్షించేందుకు ట్రీగార్డులు సమకూర్చుకోవాలని ఆధికారులు సూచించారు. దీంతో ఈ హరితహారంలో నాటిన మొక్కలను బతికించుకునేందుకు గ్రామ పంచాయతీలు నడుం బిగించాయి.