మనం అమాయకులం, కొండలు నిశ్చలం
కదలవనుకున్నాం, అవి కదిలినప్పుడు ముందుగా
కరిగి కొట్టుకుపోయేది మనమూ మన విశ్వాసాలే
హిమాలయం మంచును మాత్రమే కరగించలేదు
మనిషి నిర్లక్ష్యాన్ని కూడా నదులుగా మార్చింది
నదులు తమ తీరాల్ని తామే దాటలేదు
మనమే వాటి తీరాలను
కాంక్రీటుతో, స్వార్థంతో, లోభంతో కుదించేశాం
ఆ రాత్రి నీరు మనుషుల తలుపు తట్టలేదు
వారి తనువులనే ఎగరేసుకుపోయింది
ఓ తల్లి పిలిచిన బిడ్డ పేరు వరదలో కలిసిపోయింది
ఇండ్లు కూరుకుపోయాయి, చిరునామాలు అంతమయ్యాయి
ఇది ప్రకృతి తీసుకున్న ప్రతీకారం కాదు
ప్రకృతి దయామయి, మనం దానికి చేసిన గాయాలను
ఇలా ఒకరోజు మన ముందు పరిచింది
చెట్లను నరికిన మన గొడ్డలి
చివరికి మన ఇంటి పైకప్పును తాకింది
పర్వతాలను చీల్చిన యంత్రం
మన గుండెల్లోకి తోసుకొచ్చింది
నదులను బంధించిన గోడలు
ఒకరోజు మన పేర్లనే వరదలో ముంచేశాయి
నేపాల్ వరద అంటే
హిమాలయం నుంచి దిగివచ్చిన నీరు మాత్రమే కాదు
ప్రకృతి పట్ల మన అజ్ఞానం,
వ్యవస్థల నిర్లక్ష్యం, అభివృద్ధి పేరుతో చేసిన విధ్వంసం
అన్నీ కలిసి రాసిన ఒక విషాద వాక్యం
ఈ రోజు నేపాల్..
రేపు మనమో, మన ఊరో, ఏ నగరమో
హిమాలయం ఇంకా నిలిచే ఉన్నది
దాని మంచులో మన భవిష్యత్తుకు
ఓ చీలిక కనిపిస్తున్నది, వణుకు వినిపిస్తున్నది
ఆ చీలికను ఇప్పుడే పూడ్చకపోతే
రేపటి వరద మట్టి నీటితో రాదు
మన నిర్లక్ష్యానికి మనమే సాక్షులమై వస్తాం
– వారాల ఆనంద్ 9440501281