తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వాన్ని చర్చిస్తున్న సందర్భంలో ప్రాంతీయ సాహిత్యాన్ని కూడా చర్చించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సాహిత్య ప్రక్రియలన్నీ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచాయి. వాటిలో గతవారం ప్రాంతీయ సాహిత్యంలో కవిత్వాన్ని గురించి చర్చించాం. ఈ వారం కథ, నవల, పాట గురించి తెలుసుకుందాం.
తెలంగాణ ప్రాంతీయవాదం – కథ :
ప్రాంతీయవాద దృక్పథంతో కథలు రాసిన కథారచయితలెందరో ఉన్నారు. బి.ఎస్.రాములు, అల్లం రాజయ్య, పెద్దింటి అశోక్కుమార్, పులుగు శ్రీనివా స్, జూకంటి జగన్నాథం, గీతాంజలి, ముదిగంటి సుజాతారెడ్డి మొదలైనవారు. వీరు తెలంగాణ ప్రజ ల జీవన విధానాన్ని తమ కథల్లో వాస్తవికంగా చిత్రీకరించారు. కాలువ మల్లయ్య, సదానంద శారద, చంద్ర సంపాదకత్వంతో తెలంగాణ కథలు అనే సంకలనాన్ని విశాలాంధ్ర ప్రచురించింది. దీనిలో 90 కథలు చోటు చేసుకున్నాయి. ‘ప్రాంతీయ సా మాజిక వర్ణ, వర్గమూలాలను అర్థం చేసుకున్నప్పుడే సమగ్రమైన తెలంగాణతనం చూడగలం’ అస్తిత్వ పోరాట పార్శం చూడగలం అని ఈ పుస్తకానికి ముందుమాట రాసిన ఏటుకూరి ప్రసాద్ అన్నారు.
కర్ర ఎల్లారెడ్డి సంపాదకత్వంలో ‘తెలంగాణ కథ’ పేరుతో 2003 నుంచి సంకలనాలు ప్రచురించడం ఆరంభమైంది. ఈ సంకలనాల వలన ఏటా తెలంగాణ కథా పరిణామాన్ని, మంచిచెడులను బేరీజు వేసుకునే అవకాశం కలిగింది. పత్రికల్లో వచ్చిన తెలంగాణ కథలను విశ్లేషించే పనిగూడ జరుగుతున్నది. అంపశయ్య నవీన్, ముదిగంటి సుజాతారెడ్డి ఈ కథా సమీక్షలు చేశారు. తెలంగాణ కథా వికాసానికి సంబంధించి ఇది మంచి పరిణామంగా గుర్తించవచ్చు. తెలంగాణ సాహిత్యకారులు తమ మూలాలను వెతుక్కుని వారసత్వాన్ని చాటుకునే ప్రయత్నాలు కూడా చేశారు. మరుగున పడ్డ గూడూరు సీతారాం, జీ.రాములు కథలను మానేరు రచయితల సంఘం ప్రచురించింది. బి.ఎస్.రాములు సంపాదకత్వంలో ‘కరీంనగర్ జిల్లా కథలు’ సంకలనాలుగా వచ్చాయి.
ముదిగంటి సుజాతారెడ్డి తెలంగాణ
‘తొలితరం కథలు’ సంకలనాన్ని 2002 లోనూ ‘తొలినాటి కథలు’ సంకలనాన్ని 2005 లోనూ, వట్టికోట ఆళ్వారుస్వామి ‘జైలులోపల’ కథల సంపుటిని విమర్శనాత్మకమైన ముందుమాటతో 2009 లోనూ, అమృతలత సంపాదకత్వంలో ‘వెతలే కతలై’ కథలసంపుటిని 2011 లోనూ ప్రచురించారు. తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘నూరేం డ్ల తెలుగు కథలు’ (20 11)కు సంపాదకత్వం కూడా వహించారు.
ప్రాంతీయవాదం – నవల :
తెలంగాణ ప్రాంతీయతను చిత్రీకరించిన నవలల్లో ముదిగంటి సుజాతారెడ్డి నవల ’మలుపుతిరిగిన రథ చక్రాలు’ (1994) ప్రముఖమైనది. కాలువ మల్లయ్య రాసిన ‘సాంబయ్య చదువు’ (1995) భూస్వాముల ఆగడాల ను, అన్యాయాలను ఇతివృత్తంగా తీసుకుని రాసినది. మరో నవల ‘మాట్లాడే బొమ్మ లు’ (1999) ఎమర్జెన్సీ రోజుల నుంచి 1999 వరకు నెలకొన్న తెలంగాణ సామాజిక జీవనాన్ని చిత్రించింది. అంపశయ్య నవీన్ రాసిన ‘కాలరేఖలు’ (2002) ప్రజల ఆర్థిక, సాంఘిక, రాజకీయ జీవితాల్లో వచ్చిన మా ర్పుల్ని వర్ణించిన నవల.‘చెదరిన స్వప్నాలు’ (200 3) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన పోరాటాలను, సంఘటనలను వివరించిన నవల. ఎం.వీ. తిరుపతయ్య రాసిన ‘జీవన సమరం’ (2005) తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు తెలియజేస్తూ, ఈ ప్రాంత మాండలికాన్ని పాత్రోచితంగా ఉపయోగించిన నవల. లోకేశ్వర్ రాసిన ‘సలాం హైద్రాబాద్’ (2005) నాలుగు శతాబ్దాల హైదరాబాద్ నగర చరిత్రని, ప్రజల జీవన విధానాన్ని ఇతివృత్తంగా తీసుకుని రాసిన నవల. ప్రభాకర్ జైని రాసిన ‘కుట్ర’ (2019) అరవై ఏండ్ల తెలంగాణ పోరాటాన్ని డాక్యుమెంట్ చేసిన నవల.
తెలంగాణ ప్రాంతీయవాదం – పాట :
తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలో తెలంగాణ పాట పాత్ర నిరుపమానమైనది. గద్దర్ తెలంగాణ పల్లెల్లోని పాటల్ని ఎంతగానో వాడుకున్నారు. అయితే తొంభై ల నాటి పల్లెల వాస్తవ పరిస్థితుల్ని ప్రజల భాషలో బలంగా చెప్పినవారు గోరటి వెంకన్న. ఇంకా అందె శ్రీ, గూడ అంజయ్య, జయరాజు, సంధ్య, భారతి, ఇందిర పాడే పాటలు తెలంగాణ స్ఫూర్తిని బలంగా ప్రతిధ్వనించాయి. అవి శ్రోతలను ఉర్రూతలూగించాయి. గోరటి వెంక న్న పాటల్లో బైరాగుల తత్వాలు, యక్షగాన లక్షణాలు, అందెశ్రీ పాట ల్లో పద్య నాటక లక్షణాలు కనిపిస్తాయని కాసుల ప్రతాపరెడ్డి విశ్లేషించారు. తెలంగాణ చైతన్యంతో వికసించిన పాటకు సాహిత్య గౌరవాన్ని సంతరించి పెట్టడానికి విమర్శకులు కృషిచేశారు.
-శాంతిశ్రీ బెనర్జీ
98719 89360