రాష్ట్రం ఏర్పడ్డాక 2016లో పిల్లలతో సాహిత్య సృజన చేయించడానికి మొట్టమొదటి కథా కార్యశాల మార్చి 27న నిజామాబాద్లో జరిగింది.రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ బాలసాహిత్య చరిత్రలో ఒక అద్భుతం జరిగింది. మార్చి 4న పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కథారచనా పోటీ నిర్వహించి, వారిలో కథా రచనలో మెలకువలు నేర్పటమే కాదు, చిన్న తనంలోనే సాహితీ సృజనకు బాటలు వేశారు. ఇలాంటి ప్రయత్నం బహుశా దేశ చరిత్రలోనే ఎప్పుడూ ఎక్కడ జరగలేదేమో!
రాష్ట్రంలో లక్షల మంది బడి పిల్లలు ఒకే రోజు, ఒకే సమయంలో, ఒకే అంశం మీద కథలు రాయడం అద్భుతం. ఈ బాలసాహిత్య రచన కార్యక్రమంలో పాల్గొన్న బాల బాలికలు తెలుగు భాషలోనే కాకుండా హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, బంజారా, ఎరుకల భాషల్లోనూ కథలు రాశారు. వీటిలో లిపిలేని భాషల్లో కథలు రాసిన పిల్లలు కూడా ఉండటం విశేషం. మరాఠీ, ఒరియా, సంస్కృతం భాషల్లోనూ పిల్లలు కథలు రాశారు.
2022 మార్చి 3న ప్రత్యక్షంగా, జూమ్లోనూ బాలలకు సృజనాత్మక కథా రచన కార్యశాలలు నిర్వహించారు. ఈ పదేండ్లలో బాల సాహిత్యంలో పిల్లల రచనల సృజనాత్మక కార్యశాలలు ప్రారంభమయ్యాయి. ఒక దశాబ్ద కాలంలోనే దాదాపు అన్ని జిల్లాల నుంచి వివిధ ప్రక్రియలలో పిల్లలు రాసిన రచనల పుస్తకాలు మూడు వందల ఎనభైకి పైగా వచ్చాయంటే పిల్లల్లో సాహితీ సృజన ఏ స్థాయిలో జరుగుతున్నదో ఊహించవచ్చు.
‘తెలంగాణలో కవులు లేరు’ అని అన్నందుకు నిదర్శనంగా మొన్న ’గోలకొండ కవుల సంచిక’ వెలువడగా, నిన్నటి తెలుగు మహాసభలు తెలంగాణలోనే సాహిత్యం పరిఢవిల్లుతోందని రుజువు చేయగా, ఇవ్వాళ మన విద్యార్థుల మహా కథా రచనా యజ్ఞం గొప్ప సంస్కృతిని తెలంగాణ నుంచి అందించింది. గరిపెల్లి అశోక్ రికార్డు చేసిన ప్రకారం వేలాది మంది పాఠశాల విద్యార్థులు వందల పుస్తకాలు తేవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో రాజకీయ వర్గమేకాదు, రచయితలు, కవులు, కళాకారులు, ఉద్యోగులతో పాటు బడి పిల్లలు కూడా ప్రధాన పాత్ర పోషించి రోడ్లపైకి వచ్చిన విషయం మనకు తెలుసు. దీనికి తోడు పాఠశాలల స్థాయి నుంచి కళాశాలల స్థాయి వరకు తెరవే, ఇతర సంస్థలు నిర్వహించిన అవగాహనా కార్యక్రమాలు కూడా పిల్లలను ఈ దిశగా కొంత వరకు మళ్లించేందుకు దోహదపడ్డాయని చెప్పొచ్చు.
2004 నుంచి హైదరాబాద్లోని పాఠశాలలలో విద్యార్థులకు కథలు పోటీలను నిర్వహిస్తూ వచ్చింది డాక్టర్ మాడభూషి రంగాచార్య స్మారక సంఘం, సంస్థ నిర్వా హకురాలు లలితాదేవి. తర్వాత సాహిత్య అకాడమీ, బాల చెలిమి పిల్లలకు నిర్వహించిన సృజనాత్మక కార్యశాలలో వేదకుమార్, దేశపతి శ్రీనివాస్ ఇంకా ఎందరో ప్రసిద్ధులైన బాల సాహితీవేత్తలు పాల్గొన్నారు. ‘రీడ్’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సాహిత్య అకాడమి-తెలంగాణ విద్యాశాఖ సంయుక్తంగా ‘మన వూరు-మన చెట్టు’ పేరిట కథా యజ్ఞం నిర్వహించడం, అందుకు విద్యార్థుల నుంచి అధికారుల వరకు సహకరించడం ఒక గొప్ప ఆవిష్కరణకు పాదువేసింది. దాని ఫలితమే ఇవ్వాళ తెలంగాణ సాహిత్య అకాడమి వద్ద ఉన్న మూడున్నర లక్షల బాలల కథల బ్యాంకు, రేపటి తరానికి అందిస్తున్న సేంద్రీయ ఎరువు. దీనికి కారణమైన బాధ్యులందరూ అభినందనీయులే.
– డాక్టర్ వి.ఆర్.శర్మ, 91778 87749