సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేవీ రాఘవాచారి సాహిత్య పరిశోధన పీఠం తెలుగు సాహిత్యంలో కొత్త పుంతలు తొక్కుతున్నది. పరిశోధన కేంద్రంగా, పోటీ పరీక్షలకు అభ్యర్థులను సిద్ధం చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నది. తెలుగు వెలుగు విరాజిల్లుతూ భవిష్యత్తు తరాలకు సాహిత్యాన్ని అందిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించింది.
కేవీ రమణాచారి తండ్రి రాఘవాచారి జ్ఞాపకార్థం.. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి, ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారి తండ్రి, ప్రముఖ కవి కేవీ రాఘవాచారి సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏండ్ల తరబడి అధ్యాపకులుగా పనిచేశారు. వారి జ్ఞాపకార్థం 2017 ఆగస్టులో ఇదే డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ ప్రసాద్ సహకారంతో కేవీ రాఘవాచారి స్మారక పరిశోధన పీఠం స్థాపించారు. పీఠం స్థాపనకు తెలుగుపై ఆయనకున్న మక్కువ, సాహిత్యంపై అభిమానం నాంది పలికాయి. రాష్ట్రంలోనే సాహిత్య పరిశోధన ముఖ్య లక్ష్యంగా ఏర్పాటైన సాహిత్య పీఠం కలిగిన ఏకైక కళాశాల ఇది కావడం గమనార్హం. కళాశాలలో తెలుగు విభాగం పర్యవేక్షణలో ఉండే కేంద్రంలో ఏటా కేవీ రమణాచారి తన సొంత డబ్బులతో 100కు పైగా అరుదైన సాహిత్య పుస్తకాలను అందిస్తున్నారు. ఇప్పటికీ ఈ గ్రంథాలయంలో 2,200 పుస్తకాలతో పాటు, తాళపత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. చెప్యాల హరినాథ శర్మ, మాజీ మంత్రి హరీశ్రావు చేతులమీదుగా ప్రారంభమైన ఈ పరిశోధన కేంద్రం నిత్య తెలుగు పరిశోధన కేంద్రంగా గుర్తింపు పొందింది. కేవీ రాఘవాచారి పేరు మీద ప్రత్యేక అలుమ్ని బ్లాక్ ఏర్పాటు చేసి అందులో పుస్తకాలను అందుబాటులో ఉంచారు.
కేవీ రాఘవాచారి స్మారక సాహిత్య పీఠం ద్వారా ఇప్పటివరకు జాతీయస్థాయిలో రెండు సదస్సులు, నాలుగు వర్క్షాప్లు నిర్వహించారు. 20వ శతాబ్దపు తెలంగాణ పద్య ప్రతిభ పేరుతో 2019లో ఏర్పాటు చేసిన సదస్సులో ఎంతోమంది వక్తలు హాజరై, తెలుగు సాహిత్యం దాని అవసరాన్ని తెలియజేశారు. అంతేకాకుండా ఈ కేంద్రం ద్వారా 2023లో కమనీయ తెలుగు రామాయణంపై నాలుగు వర్క్షాప్లను నిర్వహించారు. ఈ పీఠం ద్వారా పద్యం, కథ, కవితలపై అధ్యాపకులు ప్రత్యేక శిక్షణ ఇస్తూనే, సింపోజియంపై చర్చలను కొనసాగించారు.
సాహిత్య పీఠం ఏర్పాటు చేయడం ఒక ఎత్తయితే దానిని కాపాడుకుంటూ తెలుగులో పరిశోధనలు చేస్తూ భవిష్యత్తు తరాలకు సాహిత్యం అందించడం గొప్ప విషయం. ఇందులో తెలుగు విభాగం పూర్తిగా సఫలమైంది. తెలుగు పరిశోధన కేంద్రం ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు 10కి పైగా పుస్తకాలు సిద్దిపేట డిగ్రీ కళాశాల ఐఎస్బీఎన్ (ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నెంబర్)తో ప్రచురించారు. ఇందులో తెలుగు సాహిత్యానికి సంబంధించి 8 పుస్తకాలు ఉండగా ఒకటి హిస్టరీ, మరొకటి బయో టెక్నాలజీ సబ్జెక్టులకు సంబంధించినవి ఉన్నాయి. సింహాసన ద్వాత్రింశిక, తాళపత్రాలు, ఆరాధన విద్యా సర్వస్వం, తెలుగు సాహిత్య విమర్శ దర్శనం, రాజస్మయి రహస్యం లాంటి అరుదైన పుస్తకాలు అందుబాటులో ఉండటం విశేషం.
సిద్దిపేట సాహిత్యపీఠం చేస్తున్న కృషి అటు తెలుగు సాహిత్యాన్ని భవిష్యత్తు తరాలకు అందించడానికి పరిశోధనలు మాత్రమే కాకుండా నేటితరం విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడానికి అనేక పుస్తకాలు అందుబాటులో ఉంచారు. ఇప్పటికే ఇక్కడ పరిశోధన చేసిన ఆరుగురు విద్యార్థులు నెట్-సెట్ లాంటి జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచారు. మరో విద్యార్థి పీహెచ్డీ జూనియర్ ఫెలోషిప్ సాధించాడు. మరో ఏడుగురు విద్యార్థులు పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణులవడం చెప్పుకోదగ్గ విశేషాలు. అలాగే తెలుగు సాహిత్యంలో ప్రతి సంవత్సరం ప్రతిభ చూపిన విద్యార్థులకు రాఘవాచారి పేరు మీద బంగారు పతకాలు కూడా అందిస్తున్నారు. ప్రతిరోజు దాదాపు 40 నుంచి 50 మంది విద్యార్థులు లైబ్రరీని సందర్శించడం, ఇక్కడ పుస్తకాలు చదువడంతో పాటు, తాళపత్రాలపై పరిశోధన చేస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేశారు. http// kvraghava charyasspeetamblogspot.com సందర్శించవచ్చు.
– కొమురవెల్లి అంజయ్య, 98480 05676