ప్రాచీన తెలుగును గుర్తించటానికి ముఖ్యంగా ప్రాకృత భాషలోని గాథా సప్తశతిపై ఆధారపడాల్సి వస్తున్నది. ప్రాకృతంలోని గాథా సప్తశతిలో వందలాది తెలుగు పదాలు మనకు కనిపిస్తాయి. అయితే ఆ కాలంలో తెలుగు ఉనికిలో ఉన్నదో లేదో స్పష్టంగా చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే, ప్రాకృతం అనేది క్రీ.శ. ఒకటో శతాబ్దం నాటిది కావడమే. శాతవాహనుల కాలం నాటి లీలావతి పరిణయ గాథను కొందరు తప్పుగా చిత్రీకరించగా.. అప్పటి మంత్రి గుణాఢ్యుడు కోపగించుకొని బృహత్ కథను రచించి, వాస్తవికతను బయటపెట్టారు. అది తెలుగు భాషలోనిదేనని పేరుగాంచింది.
గాథా సప్తశతి తర్వాత తెలుగునాట వందలాది అచ్చమైన తెలుగు పదాలు, వ్యాఖ్యానాలు వెలుగులోకి వచ్చాయి. క్రీ.శ. నాలుగో శతాబ్దం నాటి ‘కీసరగుట్ట! (తొలచు వాండ్రు) అటు పిమ్మట, కలమళ్ల ధనుంజయుని క్రీ.శ. 575 నాటి శాసనం’ వంటి తెలుగు లిపికి సంబంధించిన శాసనాలు అనేకం బయటపడ్డాయి. ఇవి తెలుగు భాషకు పెట్టని కోట వంటివి. ఎంతో ఘన చరిత్ర కలిగిన తెలుగు భాష తర్వాతికాలంలో దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది. ప్రాచీనత సంచరించుకొన్నది. ఇటీవల కాశీలోని జ్ఞానవాపిలో జరిపిన తవ్వకాల్లో తెలుగు లిపిలో ఉన్న శాసనం, పట్టికలు బయటపడటం విశేషం. కాశీ విశ్వనాథ ఆలయం ఏనాటిది? మన తెలుగు భాష ప్రాచీనత ఏనాటిది? అనే ప్రశ్నలను ఈ శాసనం అందరిలోనూ రేకెత్తిస్తున్నది.
అంతేగాక జ్ఞానవాపిలో బయటపడ్డ శాసనం ఒక ఉద్వేగభరిత మానసిక స్థితిని కలిగిస్తున్నది. మన చరిత్రకారులు, భాషావేత్తలు దాన్ని పరిశీలించాలి. వాస్తవాలను వెలికితీయాలి. పరిశోధకులకు ఇది ఒక దివ్యమైన అవకాశం. దీని వల్ల తెలుగు భాష జ్ఞానవాపి నాటిదా? లేదా అంతకుముందే ఉన్నదా? అనే అంశాలు తెలుసుకోవచ్చు.
పురాతన కాలం నాటి నాణేలపై కూడా తెలుగు లిపి ఉన్న విషయం అందరికీ విదితమే. తెలుగు కొత్త చరిత్ర కోసం విశేషమైన కృషి చేస్తున్న శ్రీరామోజు హరగోపాల్ వంటి చరిత్రకారులు ఈ శాసనంపై ప్రత్యేక దృష్టి సారించడం అవసరం. తెలుగును, తెలుగు సమాజాన్ని విస్తరించటం ఎంతైనా అవసరం.
తేరాల సత్యనారాయణ శర్మ
63097 24594