నేడు రా వెళ్ల వెంకట రామారావు వర్ధంతి
‘కదనాన శతృవుల కుత్తుకలనవలీల
నుత్తరించిన బలోన్మత్తులేలిన భూమి
వీరులకు కాణాచిరా – తెలగాణ
ధీరులకు మొగసాలరా !
అబలయని దేశమును కబళింప తలపడిన
పరరాజులకు స్త్రీల పటుశౌర్యమును జూపి
రాజ్య తంత్రము నడిపెరా- తెలగాణ
రాణి రుద్రమ దేవిరా!’
కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును,
వేయి కంబాలలో వెలయించి మించినది
అడుగడుగు శిల్పాలతో తెలగాణ
అందాలు విరజిమ్మెరా
వర్ణ సహజత్వమున వనలతల మఱపించు
లాలిత్యరేఖా విలాసాల చిత్రణలు
ఆనాటి చిత్రాలురా తెలగాణ
ఆలయపు కుడ్యాలురా
అంటూ ప్రతి పదంలో తెలంగాణ శౌర్య పటిమను, వైభవాన్ని నిక్షిప్తం చేసుకొన్న ఈ గీతం, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావెళ్ళ వెంకట రామారావు కలం నుండి జాలువారింది. సాయుధ పోరాట సమయంలో సమరయోధులకు స్ఫూర్తిగా నిలిచి, తెలంగాణ తొలి మాతృగీతంగా గుర్తింపు పొందింది. తొలిదశ తెలంగాణ ఉద్యమం కంటే ముందే ఈ పాట అనేక సభల్లో మార్మోగింది. తెలంగాణ ప్రాంత సాంస్కృతిక ఉద్యమాలకు, ఉద్యమ చైతన్యానికి, ఉద్యమకారుల పౌరుషానికి అస్తిత్వగీతంగా నిలిచింది.
తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతోమంది అజ్ఞాత వీరులు ఉండేవారు. వారిలో కొంతమంది సాహిత్యంలోనూ రాణించారు. వారు తెలంగాణ సాహిత్య చరిత్రలో అజ్ఞాత కవులుగా గుర్తింపు పొందారు. రావెళ్ల వెంకట రామారావు కూడా అలాంటి అజ్ఞాత ఉద్యమకవి. రావెళ్ళవెంకట రామారావు ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, గోకినేపల్లిలో 1927 జనవరి 31న రైతు కుటుంబంలో జన్మించారు. విద్యార్థిదశలోనే 1944లో ఆంధ్ర మహాసభలో చేరిన రావెళ్ల, ఆనాటి రజాకార్ల దమన కాండను, అకృత్యాలను కండ్లారా చూసి చలించి, ఆనాటి సాయుధపోరాటంలో గన్నునూ, పెన్నునూ, ఏకకాలంలో ఆయుధాలుగా వాడుకొంటూ సమరంగాన ముందుకురికి దళ కమాండర్గా ఎదిగారు. నాటి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, నవ భారత, స్వతంత్రభారత పత్రికలలో అభ్యుదయ, జానపద శైలిలో రచనలకు శ్రీకారం చుట్టారు.
‘నాలుగు శతాబ్దాల నుండి
నవాబు సైతానులు
తెలంగాణ జనరక్తం
జలగల వలె పీల్చినారు
అంటూ నిజాం నియంతృత్వ పరిపాలనపై గళమెత్తిన కవి రావెళ్ల. వీరు మాతృభాషలో చదువుకునే అవకాశం లేకపోయినా వీధిబడిలో సాహిత్య పరిభాషా పాండిత్యానికి పాదులు తవ్వుకున్నారు. ఆ సాహిత్య పునాదుల స్ఫూర్తినుంచే తెలంగాణ అస్తిత్వానికి తొలి చిరునామా గీతమైన ‘కదనాన శత్రువుల, కుత్తుకల నవలీల, నుత్తరించిన బలోన్మత్తులేలిన భూమి’ అనే పాట ఉద్భవించింది. 1960లో ‘జీవనరాగం’ అనే ఖండకావ్యంలో ‘మాతృగీతిక’ శీర్షికతో వచ్చిన ఈ గేయం గొప్ప చారిత్రాత్మక బాధ్యతను భుజాన వేసుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం ప్రశ్నార్థకమైన వేళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పాల్వంచలో బీజం పడింది. సింగరేణి బొగ్గు గనుల్లో రాజుకున్న ఆ ఉద్యమ అగ్గికి ఈ ‘మాతృగీతిక’ ఊపిరులూదింది.
రహస్య జీవితం గడుపుతూ పోరాటం సాగించిన రావెళ్ళ, నిజాం పోలీసులకు పట్టుబడి 1948 అక్టోబర్ నుంచి 1952 డిసెంబర్ వరకు గుల్బర్గా, ఔరంగాబాద్, ఢిల్లీ, ఖమ్మం జైళ్లలో శిక్షను అనుభవించారు. జైళ్లల్లో ఉన్న పరిస్థితులను మార్చాలని 16 రోజులు నిరాహార దీక్ష చేశారు. ఫలితంగా ఖైదీలకు చదువడం, రాయడం లాంటి సౌకర్యాలు లభించా యి. ఢిల్లీ కేంద్ర కారాగారంలో ప్రముఖ కమ్యూనిస్టు నేత ఇంద్రజిత్ గుప్తా, మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి దశరథ్ దేవ్ తదితరులు రావెళ్లకు సహచరులుగా ఉన్నారు.
రహస్య ఉద్యమ సమయంలో నేలకొండపల్లి మండలం, బోదుబండ క్యాంప్లో, రాత్రిపూట నిద్రపోయే ముందు రావెళ్ల తన తుపాకిని సెంట్రీకిచ్చి నిద్రకు ఉపక్రమించాడు. అయితే వీరి ఉనికిని తెలుసుకొన్న నిజాం ముష్కర మూకలు రావెళ్ల దళంపై దాడికి ప్రయత్నించాయి. ఇది గమనించిన సెంట్రీ తుపాకిని వదిలేసి పారిపోయాడు. నిజాం మూకలు దాడి ప్రారంభించడంతో మెలుకువ వచ్చిన రావెళ్ల , కాల్పుల్లో ఒక తూటా శరీరం నుంచి దూసుకు పోయినా లెక్క చేయకుండా తన తుపాకితో నలువైపులా కాల్పులు సాగిస్తూ, తన దళంలో చాలామంది ఉన్నట్టు భ్రమ కలిగించాడు. దాంతో ముష్కర మూకలు భయపడి పారిపోయాయి.
ఉద్యమాన్నే ఊపిరిగా భావించిన ్లరావెళ్ల వెంకట రామారావు ఉద్యమకారుల్లో ఉద్య మ స్ఫూర్తిని నింపటం కోసం రక రకాల పేర్లతో ఎన్నో రచనలు చేశారు. జయశ్రీ, పురాతన్, క్రిషిక్, తెలంగాణ్యుడు, ఆర్.వి. ఆర్ లాంటి పేర్లు ఆయన కలం పేర్లలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. ఆయన ప్రముఖ రచనలు పల్లెభారతి, జీవనరాగం, అనల త ల్పం, రాగజ్యోతులు, చైతన్య స్రవంతి గ్రంథాల రూపంలో వెలువడి ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి.
జైలునుంచి విడుదలయ్యాక, రావెళ్ల వెంకట రామారావు తన స్వగ్రామం గోకినేపల్లిలోనే స్థిరపడ్డారు. ఆయనకు భార్య సుగుణమ్మ, నలుగురు కుమారులున్నారు. తర్వాతి కాలంలో తన ఇంటి నే ఒక కవితా కుటీరంగా మలుచుకొని అనేక రచనలు చేశారు రావెళ్ల. ఆయన సాహిత్యసేవకు గుర్తింపుగా పలు పురస్కారాలు ఆయనను వరించాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి గురజాడ సాహితీ అవార్డ్, దాశరథి సాహితీ పురస్కారం, జాషువా సాహితీ అవార్డ్ ఉన్నాయి.
ఉద్యమాన్నే ఊపిరిగా మలుచుకొని ప్రజల మనిషిగా జీవించిన రావెళ్ల వెంకట రామారావు 2013 డిసెంబర్ 10న గోకినేపల్లిలోని తన స్వగృహంలో స్వర్గస్థులయ్యారు. వీరులకు కాణాచిరా, ‘తెలగాణ ధీరులకు మొగసాలరా’ అంటూ నినదించిన ఆయన గళం ఆ రోజుతో శాశ్వతంగా మూగబోయింది. తల్లడిల్లిన తెలంగాణ తల్లి మూగగా రోదించింది.
బసవరాజు నరేందర్ రావు
99085 16549