హాయిగా సంధ్యారాగం
పాడుకుంటున్న సెలయేటిలో
ఒకరు అసూయ రాయి విసురుతారు
గేయం కాస్త గాయం అయి వేధిస్తుంటుంది..
అలై బలై వేసుకుంటూ
అందరం చదువులో మునిగితే
ఇద్దరి మధ్యలో హిజాబ్ విసిరి
పుస్తకాల నిండా విద్వేషం నింపారు..
మూడు రంగుల జెండాకు
ముచ్చటగా అందరూ సమానమే
మరి ఒకే రంగు పులిమి
మానవత్వాన్ని చీకట్లోకి నెట్టుతుంటారు.
చరిత్రలోకి వెళ్లవద్దు
రక్తపు మరకలు అంటించవద్దు
రాజులందరూ అశ్వమేథయాగం చేసినవారే
శవాల మీద నడిచి సింహాసనం వేసుకున్నవారే…
పాత ఫైల్స్ తెరవవద్దు ప్లీజ్
(ఢిల్లీ, కశ్మీర్, గుజరాత్..)
కారణాలు తవ్వి గుండెల్ని పిండవద్దు
రాజకీయ పార్టీలన్నీ ఓటు రాలే దుర్మార్గం చేసినవే
విద్వేషాల మీద బ్యాలెట్ బాక్స్ నింపుకొన్నవారే..
భారంగా బతుకుబాటలో
చెరో చేయి కలుపుకొని
కన్నీటి నదిని దాటుతున్న వేళ
ఆశల పుట్టిని ముంచి ఊపిరి ఉక్కిరిబిక్కిరి చేయవద్దు.
–దాసరి మోహన్
99853 09080