Telangana | తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న రోజుల్లో ఆంధ్ర ప్రాంతం నుంచి సమర్థనగా ఓ సంకలనం వచ్చింది. ‘కావడి కుండలు’ అనే పేరిట వెలువడిన ఆ సంకలనం ‘విడిపోయి సామరస్యంగా కలిసుందాం’ అనే ప్రతిపాదనను కవితాత్మకంగా ఆవిష్కరించింది. ఎంతో ప్రతికూలత మధ్య ఆ సంకలనాన్ని వెలువరించిన సాహసి డాక్టర్ కోయి కోటేశ్వరరావు. కవిగా, దళితవాదిగా, విద్యావేత్తగా బహుముఖీనమైన కార్యరంగం ఆయనది. సిటీకాలేజీలో ఆచార్యునిగా సేవలందిస్తున్న డాక్టర్ కోటేశ్వరరావు దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో తెలంగాణలో వెల్లివిరిసిన సామరస్యం గురించి, విద్య, సాహిత్య వికాసాల గురించి ‘నమస్తే తెలంగాణ’తో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
నమస్తే తెలంగాణ: ‘కావడికుండలు’ అనే సంకలనాన్ని ప్రత్యేకంగా తీసుకువచ్చారు కదా? నాడు మీరు ఎలాంటి ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వచ్చిందో మా పాఠకులకు వివరిస్తారా?
కోయి: తెలంగాణ ఉద్యమానికి సంఘీభావంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ‘కావడికుండలు’ అనే సంకలన నేపథ్యాన్ని గురించి మీరు నన్నడగటం చాలా ఆనందంగా ఉన్నది. దీంతోపాటు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా… నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకునే అవకాశం కూడా లభించింది. మాది ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర్లోని ఎనికపాడు అనే కుగ్రామం. నేను డిగ్రీ పొన్నూరు భావనారాయణ స్వామి సంస్కృత కళాశాలలో చదువుకున్నాను. ఆ తర్వాత 1991లో హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్నాను. నా పరిశోధన కూడా ఓయూలో జరిగింది. కాబట్టి విద్యార్థిగా, ఉద్యోగిగా మూడు దశాబ్దాలుగా తెలంగాణ నేలతో, ఈ మట్టితో, ఈ ప్రాంతంతో నాకొక అవినాభావమైన, అవిభాజ్యమైన సంబం ధం ఉన్నది.
నేను 1998లో ఆర్మూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశాను. ఆర్మూరు, కామారెడ్డి, నిజామాబాద్ ప్రాంతాల్లో అప్పుడప్పుడే తెలంగాణ మలిదశ ఉద్యమం జరుగుతున్నది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ అక్కడికి వచ్చేవారు. అనేక సందర్భాల్లో ఆయన ఉపన్యాసాలు విన్నాను. అంతకుముందు పరిశోధక విద్యార్థిగా ఉన్నప్పుడు శివసాగర్, ఉసా, జె గౌతమ్ లాంటివాళ్లతో తెలంగాణ ఉద్యమంలో నేను విద్యార్థిగా పాల్గొన్నాను. అందుకే నాది ఆంధ్ర ప్రాంతం అయినప్పటికీ నా అస్తిత్వ మూలాలను కాపాడుకుంటూనే ఒక ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటానికి మనం సంఘీభావం తెలియజేయాలనే ఒక ఎరుక ఆరోజు నాకు కలిగింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉపన్యాసాలు, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్న ప్రజా వాగ్గేయకారుల పాట లు వినటమే దానికి కారణం. మల్లేపల్లి లక్ష్మయ్య ‘మల్లేపల్లి రాజం’ పేరుతో స్మారకోపన్యాసాన్ని చిన్న పుస్తకంగా తీసుకువచ్చారు.
ఆ పుస్తకం చదివిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఔచిత్యం ఎంత గొప్పదో, ఎందుకు అవసరమో నాకు అర్థమైంది. అభివృద్ధిలో, సాంస్కృతికంగా, అనేక విభాగాల్లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందనే విష యం తెలిసింది. ఆర్మూర్ ప్రాంతంలో నేను చాలా ఉత్తేజం పొంది మలిదశ తెలంగాణ పోరాటంలో పాల్గొన్నాను. తర్వాత కోదాడ, హుజూర్నగర్ ప్రాం తాల్లో నేను పనిచేశాను. మిర్యాలగూడలో వేనేపల్లి పాండురంగారావు (మట్టిమనిషి) మనందరికి తెలు సు. ఆయన 2007లో హాలియాలో ఒక చారిత్రాత్మకమైన సదస్సు ఏర్పాటుచేశారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కానీ, మలిదశ తెలంగాణ ఉద్యమం లో కానీ ఆంధ్ర ప్రాంత కవులు, రచయితలు, నాయకులతో సమావేశం ఏర్పాటుచేసి, సంఘీభావంగా మాట్లాడటమనేది అంతకుముందు జరగలేదు.
2007 నవంబర్ 1న హాలియాలో మొట్టమొదటిసారిగా వేనేపల్లి పాండురంగారావు ఆధ్వర్యం లో జరిగింది. ఆ సమావేశంలో నాతో పాటు డాక్టర్ వినోదిని, వైఎస్ విశ్వేశ్వర్రావు, కాకరాల, మల్లెల వెంకట్రావు వంటి ఆంధ్ర ప్రాంత కవులు, రచయితలు, నాయకులు హాజరయ్యారు. ఆ సమావేశం లో తెలంగాణకు సంఘీభావంగా సీమాంధ్ర ప్రాంత కవులు శాశ్వతమైన ముద్రను వేసే ఏదైనా ఒక పుస్తక రూపంలో తీసుకురావాలని సమష్టిగా నిర్ణయించుకున్నాం. 2008లో నేను ‘కావడికుండలు’ అనే సంకలనం తీసుకురావాలని సంకల్పించి, ఆ తర్వాత ఒక ప్రకటన ఇచ్చి మూడేండ్లపాటు కష్టపడ్డాం. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాం ధ్ర ప్రాంతానికి చెందిన కవులు, విప్లవ, దళిత, వామపక్ష, స్త్రీవాద కవులు రాసిన 45 కవితలను సేకరించి 2010లో ‘అన్నదమ్ముల్లా విడిపోదాం, ఆత్మీయుల్లా కలిసి ఉందాం, కావడికుండల్లా విడిపోదాం, కావడిబద్దలా కలిసి ఉందాం’ అనే ఒక చారిత్రాత్మకమైన నినాదంతో ‘కావడికుండలు’ అనే పుస్తకాన్ని ఒంగోలులో ఆవిష్కరించాం.
ఈ పుస్తకానికి కొంత ప్రతిఘటన కూడా ఎదురైంది అప్పట్లో. మీరు ఎదుర్కొన్న సమస్యలు ఎట్లాంటివి?
ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ప్రతిఘటనలు, వ్యతిరేకతలు, నిరసనలను మేం ఎదుర్కొన్నాం. అయినప్పటికీ దళిత, బహుజన కవులు తెలంగాణ ఉద్యమానికి సంఘీభావంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టాం. 2010 సెప్టెంబర్లో ‘బహుజన కెరటాలు’ అనే ప్రత్యేక సంచికను తీసుకువచ్చాం. ఈ సంచికను పల్నాటి శ్రీరాములు, సతీష్ చందర్ ఆవిష్కరించారు. పైడి తెరేష్బాబు, జీవీ రత్నాకర్, కత్తి కల్యాణ్, రవికుమార్ లాంటి చాలామంది కవులు ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు.
తెలంగాణ సాధించిన విద్యాభివృద్ధి గురించి ఏమంటారు?
ఈ రోజు తెలంగాణ గురుకులాల్లో చదివిన గిరిజన, దళిత, బహుజన బిడ్డలు అజీం ప్రేమ్జీ యూ నివర్సిటీ వంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందుతున్నారు. ఇది తెలంగాణలో వచ్చిన గొప్ప విద్యాచైతన్యం. ‘మీరు దళితులకు ఏమన్నా చేయాలనుకుంటే నాణ్యమైన విద్యనందిస్తే చాలు.. వారిని అభివృద్ధి చేసినట్టే’ అని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. ‘మీరు నాగరికత అందించే సమస్త ఫలాలను వదులుకోండి, పర్వాలేదు. కానీ, విద్యాహక్కును, విద్య ద్వారా లభించే జ్ఞానాన్ని మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో వదులుకోకూడదు’ అనే అంబేద్కర్ సూత్రా న్ని ఈ రోజు గురుకుల విద్యావ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేయడం స్ఫూర్తిదాయకమైన అంశం.
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి అనే నినాదం ప్రముఖంగా ముందుకువచ్చింది. దీన్ని మీరేమంటారు?
ఆంగ్లవిద్య దళితులకు చాలా అత్యవసరం. అదొక ప్రాణవాయువు. జీవితంలో సాధికారతతో తలెత్తుకు బతుకడానికి ఆంగ్ల విద్య చాలా అవసరం. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం గొప్ప సంస్కరణ. అలాగే డిగ్రీలో ఫైనలియర్లో ద్వితీయభాషగా తెలుగు ఉండేది కాదు. మూడేండ్ల కిందట ఫైనలియర్లో కూడా తెలుగు తప్పనిసరిగా ఉండాలని, అది ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా ఉండాలనే ఉద్దేశంతో జర్నలిజం, అనువాదం, ఎపిసోడ్ రైటింగ్, టీచింగ్ స్కిల్స్, సమీక్ష ఇలాంటి కొత్త ఉపాధి సాధక అంశాలను ప్రవేశపెట్టారు. అమ్మ భాషకు పెద్దపీట వేస్తూనే ఉపాధి కేంద్రకమైన ఆంగ్లభాషను కూడా గౌరవించాలనే సమతుల్యమైన ఎరుకను తెలంగాణ విద్య తెలియజేసింది.
పక్కపొంటి, గక్కడేంది, గిక్కడేంది. తోలుకపోవుడేందని అనుకునేవాళ్లం. తర్వాత మాకు అర్థమైంది. ఇవన్నీ కావ్యాల్లో ప్రయోగాలని. ఇదే ఆదిభాష అని మా గురువు రవ్వా శ్రీహరి చెప్పారు. ఆ నృసింహస్వామి పొంటి అని ప్రాచీన కావ్యంలో ప్రయోగాలున్నాయి. ‘నీళ్లాడే పొద్దులయ్యే’ అని పోతన ప్రయోగించారు. ఇప్పుడు అందరికీ అర్థమైంది. ఈ భాషే ఆది భాష. దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉద్యమం కారణమవ్వడమనేది ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే కనపడుతుంది.
బాబాసాహెబ్ అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటును మీరెలా చూస్తారు?
రాజ్యంగ నైతికతకు వ్యతిరేకంగా అనేక ప్రణాళికలు, సిలబస్లో మార్పులు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మత గ్రంథాలను ప్రథమ గ్రంథాలుగా, రాజ్యాంగం కంటే ఉన్నతమైన గ్రంథాలుగా ప్రకటించాలని వస్తున్న కుహనావాదం కూడా మీకు తెలుసు. అయితే దానికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు ను, ఆయన స్ఫూర్తిని వాగ్దానం చేసేవిధంగా, ఆయ న జ్ఞాన చైతన్యాన్ని విస్తృతపరిచేవిధంగా ప్రతీకాత్మకంగా 125 అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని పెట్టడం గొప్ప స్ఫూర్తిదాయకమైన విషయం. మరఠ్వాడా యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలంటే పోరాటం చేయాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఒక జిల్లాకు అంబేద్కర్ పేరుపెడితే వ్యతిరేకత వచ్చింది. కానీ ఇక్కడ ఎవరూ డిమాండ్ చేయకుండానే కేసీఆర్ భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. జ్ఞానవంతమైన టూరిజంలో భాగంగా అంబేద్కర్ నిలువెత్తు విగ్రహన్ని ఏర్పాటుచేయడం అభినందనీయం.
అంబేద్కర్ విగ్రహం ఎలాంటి స్ఫూర్తిని నింపనున్నది?
విగ్రహం అంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కాదు. విగ్ర హం అంటే ఐరన్ కాదు. విగ్రహం అంటే సమున్నతమైన స్ఫూర్తి. ఒక బోర్డు మీద రాసే అర్హతలేని ఒక మహర్ విద్యార్థి రాజ్యాంగం రాసే స్థాయికి ఎలా ఎదిగాడో.. ఆ స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని అందరూ తెలుసుకునే అవకాశం వస్తుంది. ఆయన ఎక్కడినుంచి ఎక్కడికి ఎదిగాడనే జవాబు వస్తుంది. ఈ క్రమంలో ఒక మేధోమథనం జరిగి నేను కూడా ఇలా ఎదగాలి అనే స్ఫూర్తి కలుగుతుంది.
తెలంగాణలో దళితోద్యమ వికాసం గురించి మీరెమంటారు?
అనేక అంశాలకు తొలి అడుగుజాడ తెలంగాణ నేల అయినట్టుగానే రెండు రాష్ర్టాల్లో దళిత చైతన్యానికి, అంబేద్కర్ కంటే ముందే 1911లో హైదరాబాద్ కేంద్రంగా భాగ్యరెడ్డివర్మ కృషిచేశారు. దళితుల సర్వతోముఖాభివృద్ధికి, జ్ఞాన వికాసానికి, బౌద్ధకేంద్రకమైన తాత్విక వికాసానికి ‘ఆది హిందు’ పేరుతో ఉద్యమానికి బీజాలు ఇక్కడే పడ్డాయి. భాగ్యరెడ్డివర్మ స్ఫూర్తితో రాజమండ్రికి చెందిన కుసుమ ధర్మ న్న (బీఎస్ వెంకట్రావుకు పీఆర్వో) 1917లో విజయవాడలో పంచమాంధ్ర సభ అని పెద్ద సభ నిర్వహించారు. ఆ సభలో పాల్గొన్న భాగ్యరెడ్డివర్మ మ నం పంచములం కాదు ఆది ఆంధ్రులం అని ఎలుగెత్తి చాటారు. అలా భాగ్యరెడ్డివర్మ 1917 నుంచి 1936 వరకు విజయవాడ, కాకినాడ, విజయనగరం ఇలా దాదాపు 14 ప్రాంతాల్లో సభలు నిర్వహించారు.
తెలంగాణలో సాహిత్య ఆవిర్భావ వికాసాల గురించి..
కుసుమ ధర్మన్నను తొలి దళిత కవిగా ఆమోదిస్తున్నాం. కుసుమ ధర్మన్నకు భాగ్యరెడ్డివర్మ ప్రేర ణ కాబట్టి కుసుమ ధర్మన్న వందేండ్ల కిందటే దళిత చైతన్యాన్ని అందిపుచ్చుకున్నారు. తెలుగు సాహిత్య మూలాలు తెలంగాణ నేలలో ఉన్నాయి. తెలుగు సాహిత్య పరిణామ క్రమాన్ని తెలుగు సాహిత్య చరిత్రను పునర్నిర్వచించాల్సిన అవసరం ఉన్నదన్న ఎరుకను మలిదశ తెలంగాణ ఉద్యమం తెలియజేసింది. అంటే ఆదికవి నన్న య కాదు. నన్నయ కేవలం అనువాదకుడు. పాల్కుర్కి సోమనాథుడు దేశీయమైన శైలితో, తెలంగాణ భాషతో, ఛందస్సు, ద్విపద మార్గ ఛందస్సుకు భిన్నంగా రాశాడు. 1936లో పింగ ళి లక్ష్మికాంతం రంగనాథ రామాయణానికి ముందుమాట రాస్తూ ఒక గొప్ప మాటన్నారు. ఆంధ్రలో బ్రిటిష్వారి పాలన మూలంగా ఆంగ్ల భాష ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. అయితే దానికి భిన్నంగా తెలంగాణలో మాత్రం వాళ్ల నేలకోసం పోరాటం చేసిన వీరులు, యోధులు, ప్రకృతి, ప్రకృతితో మమేకమైన జీవనం, తాతల నాటి తల్లి భాష, దేశీయ దృష్టి కనపడుతుందని నాడే చెప్పాడు.
సంస్కృత విశ్వవిద్యాలయం గురించి మీ అభిప్రాయాన్ని పంచుకుంటారా?
పాల్కుర్కి స్మారక కేంద్రంతో పాటు, మల్లినాథుని పేరుతో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయడం గొప్ప విషయం. సంస్కృతంలో ఉన్న గొప్ప సాహిత్యాన్ని ఈ తరానికి తెలియజేయాలనే గొప్ప ప్రయత్నంతో విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం మంచి విషయం. సంస్కృతంతో పాటు ఆధునిక టెక్నాలజీని కూడా ప్రవేశపెడితే అది గొప్ప కేంద్రమవుతుంది. అనేక అంశాలు సంస్కృత కేంద్రంగా ఉన్నాయి. కనుక, దానితో పాటు ఉపాధి అవకాశాలున్న కోర్సులు పెడితే అది మంచి విశ్వవిద్యాలయంగా మారే అవకాశం ఉన్నది.
ఇక్కడి ప్రజల భాషకు, ఆర్తికి గతంలోనూ ఆంధ్రా ప్రాంతం వారు సంఘీభావం తెలిపిన సందర్భాలున్నాయి కదా?
అవును, దేనికైనా ఒక వారసత్వం ఉంటుంది. దాని పరిణామ క్రమాన్ని కూడా అర్థం చేసుకొని మాట్లాడటం సముచితంగా ఉంటుంది. వనపర్తి సంస్థానంలో ఆదిపూడి సోమనాథరావు అనే ఒక ఆంధ్రకవి ఉండేవాడు. ఆయన ఆ రోజుల్లోనే తెలంగాణ గురించి ‘అచ్చ తెనుంగు కబ్బమునకు ఆది పదంబై పొంచుభాగ్యమున్ పెంచుకున్నదేశమిది’ అన్నారు. అంటే అచ్చతెలుగు భాష ఇక్కడ వర్ధిల్లిందని ఆ రోజుల్లోనే చెప్పడమనేది చాలా గొప్ప విషయం. ‘తెలుగుదేశ చరిత్రకు తెలంగాణ విత్తనము’ అన్నారు కొమర్రాజు లక్ష్మణరావు పంతులు. కొమర్రాజు లక్ష్మణరావు ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి అలా అనడం అంటే తెలంగాణ భాష ఔన్నత్యాన్ని తెలిపే ఒక జీవనసూత్రం. అలాగే జమ్మలమడుగు మాధవశర్మ వంటి పండితులు అచ్చతెలుగు పదాలు ఎక్కడైన ఉన్నాయా అంటే అవి తెలంగాణ పల్లెల్లో ఉన్నాయి, రాయలసీమ పల్లెల్లో ఉన్నాయని ఆ రోజుల్లోనే చెప్పారు.
అలాగే జాషువాను ఆంధ్ర కవులు ఒక న్యూనతాభావంతో చూస్తున్నప్పుడు దాశరథి కృష్ణమాచార్యులు 1936 ప్రాంతంలోనే జాషువాను ఇక్కడికి ఆహ్వానించి సన్మానించి ‘తెలుగు పద్య కవిత్వాన్ని మరో మలుపు తిప్పిన మహాకవి’ అన్నారు. జాషువా కూడా ‘ఉర్దూశారద ఊరేగు ధరణి.. తెలు గు బిబ్బోకవతి నాట్యమాడు సరసులున్ననేల’ అని ఆ రోజుల్లోనే తెలంగాణ భాషా సాహిత్యాలను కీర్తించారు.
అలాగే విశ్వనాథ సత్యనారాయణ కూడా ‘అన్నదమ్ములుగా విడిపోదాం, రెండు రాష్ర్టాల విభజనను నేను అంగీకరిస్తున్నాను’ అని ‘ముద్దు వడ్డనలు’ అనే పుస్తకంలో చెప్పారు. అలా చాలామంది తొలితరం ఆంధ్ర ప్రాంతానికి చెందిన పండితులు, కవులు తెలంగాణ ప్రాంతంలో ఉన్న భాషా సాహిత్యాల ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్నారు. వారి వారి గ్రంథాల్లో వ్యాసాల్లో పొందుపరిచారు.
అలాగే వారసత్వం గురించి వస్తే తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ సాయుధ పోరాటం వారసత్వం. ఆ ఉద్యమానికి అక్షరాయుధాలు అందించిన వారిలో బొల్లిముంత శివరామకృష్ణ, ఆరుద్ర, మహీధరలాంటి వారున్నారు. తెలంగాణ కవులు కూడా విశాఖ ఉక్కు ఉద్యమం, కారంచేడు, చుం డూరు సంఘటనలు జరిగినపుడు సంఘీభావం తెలియజేసి గొప్ప కవితలు రాశారు. భారతదేశంలో వస్తున్న గొప్ప సాహిత్యం ఏదైనా ఉందంటే అది తెలంగాణ కేంద్రంగా వస్తున్నది. ఎందుకంటే ఎక్కడ ఉద్యమం ఉంటే అక్కడ గొప్ప సాహిత్యం వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కొన్ని వేల పాటలు, కొన్ని వేల క్యాసెట్లు, కొన్ని వేల కవితలు, వందల కవిత్వ సంపుటాలు రావడం అనేది గొప్ప చరిత్ర. యూ ట్యూబ్లో డిజిటల్ సాహిత్యం కూడా వచ్చింది. గ్రా మీణ కల్చర్ గొప్పతనాన్ని చాటిచెప్పడంలో తెలంగాణలో ఒక సాంస్కృతిక విస్ఫోటనం జరిగింది.
తెలంగాణ గురించి ఒక్క మాటలో చెప్పమంటే ఏం చెప్తారు?
తెలంగాణ తల్లి ఒక పుష్పక విమానం లాంటి ది, ఒక అక్షయపాత్రలాంటిది. ఇక్కడికి ఎంతమంది వచ్చినా ఇంకా ఒకరికి చోటుంటుంది. ఎంతమంది తిన్నా ఇంకొక మెతుకు మిగిలి ఉం టుంది. అలా భారతదేశవ్యాప్తంగా వలస వచ్చిన అందరినీ ఆదరిస్తున్నది. గతంలో భూగర్భ జలాలమీద ఆధారపడ్డ వ్యవసాయం ఈ రోజు ఆరు రెట్లు పెరిగింది. ఒక ధాన్యాగారంగా తెలంగాణ వెలుగొందుతున్నది. ‘పల్లే పల్లెనా పల్లేర్లు మొలిచే’ అనే దశ నుంచి.. సాగు విస్తీర్ణం పెంచుకొనే గొప్ప పరిణామ క్రమానికి చేరుకున్నది. ఇదంతా ఉద్య మ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే సాధ్యమైంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు ప్రాంతాల సాహితీకారులకు సంబంధించినంత వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై మీ అభిప్రాయం ఏమిటి?
‘కావడికుండలు’ అనే కవిత పైడి తెరేష్బాబు రాస్తే, నేను ఈ పుస్తకానికి సంపాదకుడిగా ఉన్నాను. వేనేపల్లి పాండురంగారావుకు సంబంధించిన ‘మట్టి మనుషులు’ అనే సాహితీ సంస్థ దీన్ని ప్రచురించింది. అయితే పైడి తెరేష్బాబు 2014లో అనారోగ్యం కారణంగా చనిపోయారు. ఆ వార్త దేశపతి శ్రీనివాస్ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలిసింది. వెంటనే ఆయన నన్ను ఫోన్లో సంప్రదించారు. ‘మీరు పైడి తెరేష్బాబు కుటుంబాన్ని పరామర్శించి, తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని వాగ్దానం చేయండి’ అని ఆదేశిస్తే నేను ఆశ్చర్యపోయాను. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒంగోలు కవి… అప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నారు. కానీ పైడి తెరేష్బాబు చనిపోతే అక్కడి నాయకులు మౌనం వహించారే తప్ప రూపాయి ఆర్థిక సహాయం కూడా చేయలేదు. కేసీఆర్ రూ.10 లక్షలు ప్రకటించడమే కాదు, స్వయంగా చిక్కడపల్లిలోని ఆయన ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబానికి రూ.10 లక్షలను చెక్కు రూపంలో అందించారు. సీఎం కేసీఆర్ స్వయంగా కవి. కాబట్టి ఆయనకు కవులు విలువ తెలుసు. అందుకే తెలంగాణ వచ్చిన తర్వాత కవులను గౌరవిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా ఆంధ్ర కవులను గుర్తించడం సామరస్యానికి ప్రతీకగా చెప్పవచ్చు.
ఆంధ్రా ప్రాంతంలో ఉండి తెలంగాణ అనుకూల వైఖరి మీరు తీసుకున్నారు. ఇవ్వాళ తెలంగాణ కల సాకారమైంది. రాష్ట్రం ఏర్పాటై దశాబ్ది ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మీరనుకున్న ‘అన్నదమ్ముల్లా విడిపోయి, ఆత్మీయుల్లా కలిసి ఉందాం’ అనే ఆకాంక్ష ఏ మేరకు నెరవేరింది? ఇప్పుడెలా ఉంది తెలంగాణ?
‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే మనం వీసా తీసుకొని హైదరాబాద్కు వెళ్లాల్సి వస్తుంది’, తెలంగాణ ఏర్పాటైతే అంధకారమవుతుంది, ఇక్కడి నాయకులకు పాలించడం చేతకాదు లాంటి కువిమర్శలు చేస్తూ సీమాంధ్ర నాయకులు తమ స్వలాభం కోసం ఇరు ప్రాంతాల ప్రజలను మభ్యపెట్టారు. కానీ, సమైక్యవాద ఉద్యమం అలారం లాంటిది. తెలంగాణ ఉద్యమం ఒక తొలి కోడి కూత లాంటిది’ అని శాస్త్రీయబద్ధంగా తెలంగాణ ఉద్యమానికి మద్దతునిచ్చాం. తాతాల్కికంగా తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోవటం కోసం సీమాంధ్ర నాయకులు కుహనా రాజకీయాలు చేశారని తేటతెల్లమైంది. 2014 నుంచి ఈ దశాబ్ది కాలంలో అపోహలన్నీ పటాపంచలయ్యాయి. ఇప్పుడు భారతదేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నదనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఆంధ్రుల విషయానికి వస్తే ఉద్యమకాలంలో కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగానే ఆంధ్రులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఏ ఆంధ్రున్నడిగినా ‘తెలంగాణలో మాకెలాంటి భయం లేదని’ చెప్తున్నారు.
ఇంటర్వ్యూ: తుమ్మలపల్లి రఘురాములు