తెలుగు, సంస్కృత భాషల్లో అఖండ పండితుడు, కవి, రచయిత, ఆధ్యాత్మిక సాహితీవేత్త, అవధాన ఘనాపాఠి డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ. ఆయన సంస్కృతంలో ఉత్తమ అధ్యాత్మిక సాహిత్యాన్ని సృజించారు. తెలుగులో ఖండకావ్యాలతో పాటు అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేశారు. నటేశ్వర శర్మ ప్రతిష్ఠాత్మక దాశరథి పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ఆయనతో ముచ్చటించింది.
మీరు ఎంతో అభిమానించే మహాకవి దాశరథి పేరిట ఏర్పాటుచేసిన పురస్కారం అందుకుంటున్న సందర్భంగా మీ స్పందన ఏమిటి?
ఈ పురస్కారానికి ఎంపికవ్వడం గర్వంగా భావిస్తున్నా. మహాకవి దాశరథి అచ్చమైన పద్య కవి. పద్య కవిత్వంలో సముజ్వలమైన గ్రంథాలు రాసి సమాజాన్ని ఉత్తేజపరిచిన మహనీయుడు. చాలామంది కవులు ఆయన స్ఫూర్తితో అనేక రచనలు చేస్తున్నారు. ఒక మహాకవి ఎందరో అనంతర కవులకు మార్గదర్శకుడవుతాడు. అలాంటి దార్శనిక కవి దాశరథి.
ఓ జనతా నతాంజలి పుటోజ్వల దివ్య కవోష్ణ రక్తధారా జలసిక్త పాద కమలద్వయ శోభి మనోజ్ఞ దేహరేఖా జయ భారతీ యుగయుగమ్ముల పున్నెపు పంటవీవు
నీ పూజకు తెచ్చినాడ నిదె పొంగిన గుండియ నిండు పద్దెముల్..
అంటూ పద్యాలతో అగ్నిధారను ప్రారంభించారు దాశరథి. ఉజ్వలమైన భావాలతో, పదసంపదతో ఉత్తేజపరచాలంటే పద్యం గొప్ప సాధనమని భావించి దాశరథి అద్భుతంగా పద్యాలను పండించి.. సమాజాన్ని చైతన్యపరిచారు.
నరకానన్ బడి క్రుంగుచున్న నను గంధర్వాప్సరః కామినీతరుణ స్వాదు నవోపవగూహన పథాంతర్వర్తిగా జేసి దుర్భరదారిద్య్ర పిశాచినీ రుధిరధారా క్రూర దంష్ర్టా ప్రఘా త రిరంసా పరిఖిన్నతన్ మరుపు నొందన్ జేతువోయీ! కవీ!
కవులను ఉద్దేశించి చెప్పిన పద్యమిది. సమాజంలో కవిత్వం బాధలతో, కష్టాలతో కుంగిపోతున్న మానవులను ఉత్తేజపరచాలి, వాళ్లలో ఆశలు చిగురింపజేయాలని చెప్పారు. కవిత ఉత్తేజపరచడమే కాదు ఆనందపర్చాలి, ఆత్మోన్నతి కలుగజేయాలి. ఇవన్నీ తన పద్యాలతో సాధ్యం చేశారు దాశరథి.
నా వాసంత కుమారి వచ్చినది వీణా వాదనానంద సంధ్యా వీచి పరికల్పిత యుగీ నాభి ప్రదేశాలతో నా వాసంత కుమారి విచ్చినది పున్నాగ ప్రసూనాంబర శ్రీవిన్యాసము తోడ నా కొరకు కాంచీ కింకిణీ నాదయై రుతువుల్లో మొదటిదైన వసంతం వికాసానికి ప్రతీక. దాన్ని ఒక కన్యారూపంగా భావించి వర్ణించారు.
మీరు ఇటు సంస్కృతం అటు తెలుగు భాషల్లోని దాదాపు అన్ని సాహితీ ప్రక్రియల్లోనూ రచనలు చేశారు. అదెలా సాధ్యమైందంటారు?నేను చిన్ననాటి నుంచి సంస్కృతం అధ్యయనం చేశాను. మా నాన్నగారు తిరుమలలోని ‘శ్రీ వేంకటేశ్వర వేద సంస్కృత పాఠశాల’లో చేర్పించారు. అక్కడ గురువులు నిత్య వ్యవహారంలోనూ సంస్కృతంలోనే సంభాషించమని చెప్పేవాళ్లు. దీంతో సంస్కృతంపై మంచిపట్టు సాధ్యమైంది. అక్కడే నేను శ్లోకాలు రాయ డం నేర్చుకున్నాను. ఆదికావ్యం రామాయణ కావ్య రచనకు వాల్మీకి మహర్షి ఎంచుకున్న అనుష్టుప్ ఛందస్సులో వాటిని రచించాను.
డాక్టరేట్ పరిశోధనకు ఆదిశంకరాచార్యులు రచించిన సౌందర్యలహరి ఎంచుకోవడానికి స్ఫూర్తి ఏమిటి?
శంకర భగవత్పాదులు సంస్కృతంలో అనేక స్తో త్రాలు రాశారు. కొన్ని పారమార్థికమైనవి, నామావళి తో కూడినవి, ఉపచారాత్మకమైనవి ఇలా అనేకానేకం. కానీ, సౌందర్యలహరి శక్తి ఆధిక్యతను చాటే గ్రంథం. ఇది రెండు భా గాలుగా ఉంటుంది. మొదటిది సౌందర్యం, రెండోది ఆనందం. అమ్మవారి సౌందర్యాన్ని వారు ఆపాద మస్తకం వర్ణించారు. ఆ వర్ణన నాకు స్ఫూర్తి. అందు కే దానిపై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించాను.
సంస్కృతంలో మీరు రాసిన ‘శ్రీషోడశి’ సిరీస్ గురించి చెప్పండి?
ఇందులో పదహారు శ్లోకాలుంటాయి. అమ్మవారికి చంద్రకళ అని పేరు. చంద్రుడు షోడశ కళలు కలవాడు. పక్షంలో ఉండేవి పదిహేను కళలు. ఆ తర్వత పదహారోది సంపూర్ణ కళ. అది అమ్మవారిలో ఉంటుంది. ఆమెను ఒక్కో తిథినాడు ఉపాసిస్తూ వెళ్తున్నప్పుడు చిట్టచివర మన సహస్రారంలో కొలువై ఉన్న అమ్మను చేరుకోగలం. అప్పుడు ఈ ఐహికమైన ఆసక్తులేమీ ఉండవు. ఏమీ కోరుకోలేని స్థితికి చేరుకుంటాం.
తెలుగులో మీరు ఖండకావ్యాలు కూడా రాసినట్టున్నారు కదా..?
తెలుగులో నాకు మంచిపేరు తెచ్చిపెట్టిన ఖండకావ్యం ‘సమయ విలాసిని’. కాలం గొప్పదనాన్ని అందులో చెప్పాను. గతం, వర్తమానం, భవిష్యత్ కాలాలను మనిషి ఏ విధంగా బేరీజు వేసుకుంటాడు. అనేది అందులో చర్చించాను. కానీ, వీటిన్నిటికీ కూడా నియామక శక్తి ఒకటున్నది. అదే కాలశక్తి. ఆ కాల మహిమను చాటుతూ సాగుతుంది.గత శిశిర వాయు వీచీ ప్రఘాతమునకు ఫలిత పత్రాలు రాల్చిన పాదపములు మరల చివురులనిత్తు ఆమనుల వేళ ఆవహించెను నందనోద్యానములను
పుడమియె శైవలింగమని పూజలు చేసెదవీవు భక్తితో వడివడివానలందడిపి వార్షిక వార్షుక వేళలందు, నీ యొడలభిషేకపాత్రగ నియుక్తముగాగ తటిల్లతారుచుల్ మృడునికి తైజసాత్మక సమృద్ధిగ గంధపు పూతలయ్యెడిన్ !
ఇది రుతువుల ప్రాశస్త్యం గురించి రాసిన ‘రుతుగీత’ సంకలనం లోనిది. ఇందులో రుతువులు ఎలా ప్రారంభమవుతాయి, ఎలా అంతమవుతాయి? ఇలా ఆరు రుతువులనూ వర్ణిస్తూ రాశాను. జగద్గురువు శ్రీకృష్ణుడు ప్రవచించిన గీతలో ఏ విధంగా అయితే పారమార్థిక చింతన ఉంటుందో, ‘రుతుగీత’లోనూ రుతువుల పరమార్థం వివరించే ప్రయత్నం చేశాను.
వృత్తం అనేది తెలుగుకు ప్రత్యేకించిన ప్రక్రియ అంటారు. తెలంగాణలో నేటికీ రచయితలు వృత్త పద్యాలు రాస్తున్నారు. తద్వారా పద్యాన్ని నిలబెడుతున్నారు. దీని వెనుకున్న ప్రత్యేకతను ఎలా వివరిస్తారు?
ఉపజాతులకు చెందిన కందం, ఆటవెలది, తేటగీతి ఇవన్నీ సాహితీ ప్రక్రియ ఆరంభంలో ఉన్న కవులు చిన్నచిన్న పద్యాలకు, శతకాలకు ఉపయోగిస్తుంటారు. సుదీర్ఘమైన వర్ణన చేసేటప్పుడు, సుదీర్ఘమైన విషయాన్ని తీసుకున్నప్పుడు ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం వంటి వృత్తాల్లో రాస్తే దానికి అందం వస్తుంది. సీస పద్యం కూడా చక్కటి ఒరవడిని సృష్టిస్తుంది. ఒక్కో పద్యానికీ, ఒక్కో భావానికీ ఒక్కో వృత్తం ఎంచుకుంటూ ఉంటారు.ప్రయత్నిస్తున్న కొద్దీ ఇందులోని రమ్యత అర్థమవుతుంది.
మీరు శతాధిక అవధానాలు చేశారు. అవధానిగా మీకు స్ఫూర్తి ఎవరు?
తెలంగాణలో గొప్ప అవధానులున్నారు. వారిలో శతావధాని గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ ఈ ప్రాం తాన్ని గొప్పగా ప్రభావితం చేశారు. ఆయన పద్యాలను ధారణ చేస్తూ రాగయుక్తంగా ఆలపించేవారు. పద్యాలు మళ్లీ వినిపించాలని ఆహూతులు ‘వన్స్మోర్’ అంటుండేవారు. ఇది అవధానమా, సమ్మోహనాత్మక గానకేళినా అని అనిపించేది! ఆయనను స్ఫూర్తి గా తీసుకొని నేను అవధాన ప్రక్రియలోకి ప్రవేశించాను. నిషిద్ధాక్షరి, సమస్య, వర్ణన, దత్తపది, ఛందోభాషణ, అప్రస్తుత ప్రశంస, వార గణితం, స్వీయ కవితాగానం ఈ అంశాలను ఎంచుకున్నాను.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాహితీరంగంలో మీరు గమనించిన అంశాలను వివరిస్తారా?
రాష్ట్ర ఆవిర్భావానికి ముందు కవులకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉండేది కాదు. తెలంగాణ ఏర్పడి న తర్వాత ఈ పరిస్థితిలో చాలా మార్పు కలిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సాహితీప్రియుడు. సాహిత్యాన్ని అనేక విధాలుగా అధ్యయనం చేసిన వ్యక్తి. సాహితీరంగాన్ని, కవులను ఆయన ఆదరించిన పద్ధతి వల్ల ఇప్పుడు తెలంగాణలో అన్ని సాహితీ ప్రక్రియలు పురివిప్పుకొని సౌందర్యరూపాన్ని సంతరించుకున్నాయి. కవులు పురోగమించడానికి వేదికలు ఏర్పాటయ్యాయి. తెలంగాణ దశాబ్ది కవులకు స్వర్ణయుగం అని చెప్పొ చ్చు. సం స్కృత పండితుడు, వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి పేరిట ఆయన జన్మస్థలంలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయాలని సీఎం కేసీ ఆర్ నిర్ణయించడం గొప్ప విషయం.
కేసీఆర్ గురించి చదివిన పద్యాలు
చంద్రశేఖరాభినందనము అభినవభోజరాజువొ? మహాదృతి జూచెడి దేవరాజువో? విభవమునొప్పె నీ కవులప్రేమ విశిష్టమునై కనంబడన్ ప్రభలను నింపినావు కవిరాజులకీ తెలగాణసీమలో నభయమునిచ్చు నీ గరిమ యద్భుతమయ్యెను చంద్రశేఖరా!
పద్యమన్నచో నీ ప్రేమ భాసురమ్ము పద్యపఠనతో సాగెడి ప్రవచనముల జనుల హృదయాలనలరించు ఘనుడనీవు సాహితీసేవ శతమానసక్తి నిలుపు!
గురువుల యొద్ద పద్యముల గూరిచి శిక్షణనొందినావు, నీ వరగురుభక్తి దొడ్డది సభాస్థలిపై గురుపూజసేయగా స్థిరమగుకీర్తి వెల్గినది శేఖరమై వినయమ్ముపండెనో
వరగుణమాన్యవర్ధిత విభాసుర ధీమణి! చంద్రశేఖరా!
పాలకుడు పద్యసాహితీబావుకుడయి హృద్యపద్యాలయొరవడి రీతి దెలిసి సాగవలెనని చెప్పిన చరిత నీది అపరభోజుడవై వెల్గుమక్షయముగ!
అయాచితం విరచిత నవ్యగీతికలోని ఓ కుసుమం
దివ్యమానవా నీకొక భవ్య గీతి వినిపింతును భవ్యగీతమే కాదు ఒక నవ్యగతిని చూపింతును ఆరిన నీ ఎద లోపల ఆశాదీపం వెలుగింతును ఉద్రిక్త జ్వరము నుండి ఉపశమనం కలిగింతును బంగారు పంటలు నీ బ్రతుకులోన పండింతును
ముఖ్యమంత్రి ప్రోత్సాహం
ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పద్య ప్రియత్వం గొప్పది. ఎక్కడ మంచి పద్యం కనిపించినా దాన్ని స్మరిస్తారు. విడిచిపెట్టరు. ఆయన ప్రసంగాల్లో పద్యధార ప్రవహిస్తూ ఉంటుంది. సాహితీ ప్రేమికుడైన ముఖ్యమంత్రి వల్ల సమాజంలో ఉన్న కవులు, సాహితీవేత్తలు ఎంతో ఉత్తేజాన్ని పొందుతున్నారు. వారికి తగినటువంటి ఒక ప్రోత్సాహం, సకృతి లభిస్తుందన్న ఆనందాన్ని పొందుతున్నారు. అలాంటి వాళ్లలో నేనూ ఒకణ్ని. పద్యమొక్కటే కాదు గేయం కావొచ్చు, అవధానం కావొచ్చు ఏదైనా సమాజానికి ఉపయోగపడే ప్రక్రియే! వీటన్నింటికీ తెలంగాణలో సముచిత స్థానం కల్పించినట్టు కనిపిస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇక్కడి కవులందరూ అత్యంత ఆదరణ పొందుతున్నారు. వాళ్ల సాహిత్యానికి వేదిక దొరుకుతున్నది. ఏ వేదిక మీదైనా వాళ్ల గొంతులు విప్పి వినిపించే వాతావరణం ఏర్పడింది.
‘చుక్కలు’ అనే పేరుతో చమక్కులతో కూడిన సంక్షిప్త కవితలు రాశాను. సామాజిక పరివర్తన దీని నేపథ్యం. రచనా శైలి అధిక్షేపిస్తున్నట్టు ఉంటుంది. అందులోనే మార్పు ఉంటుంది. సమాజంలో ఉండే రుగ్మతలను వ్యంగ్యంగా చెప్పి, మనిషిలో మానసిక పరివర్తన తీసుకురావాలనే సంకల్పంతో చేసిన ప్రయత్నం ఇది.
-తుమ్మలపల్లి రఘురాములు
9346328291