మహాకవి కాళిదాసు రుతు సంహార కృతి కఠినంగా లేకపోవడంతో మల్లినాథ సూరి దీనికి వ్యాఖ్యానం రాయలేదు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ప్రజల భాషలోనే కవిత్వం రాయాలనే నేటి అభ్యుదయ కవులకు ఆద్యుడు మహాకవి కాళిదాసు అని, ఆయన రుతు సంహార కావ్యం ఆధారంగా చెప్పవచ్చు.
2024 మే 20న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ‘చెలిమె’లో రఘువర్మ రాసిన ‘కాళిదాసు తొలి కృతి రుతు సంహారం’ అనే శీర్షికతో వచ్చిన లఘు వ్యాసాన్ని చదివాను. సాహిత్య ప్రపంచంలో ఎందరో కవులున్నా మహాకవి అనగానే ‘మహాకవి కాళిదాసు’ గుర్తుకువస్తాడు. పాఠశాలల్లో సంస్కృత భాష కనుమరుగవుతున్న ఈ కాలంలో నేటి విద్యార్థులు మహాకవి కాళిదాసు రుతు సంహార కావ్యాన్ని అర్థం చేసుకోవడం కష్టమనే చెప్పాలి. దీనికి ప్రధాన కారణం నేడు సంస్కృత భాషను నేర్పే విధానంలో ఉన్న లోపం. విద్యార్థులకు సంస్కృత భాషను నేర్పడమంటే ఓ పదిరువై దేవతా స్తుతులను నేర్పడం, ఆపై నాలుగు శబ్దాలను, నాలుగు ధాతువులను నేర్పడం, తర్వాత భర్తృహరి సుభాషితాలు, పంచతంత్ర కథలు వంటివి నేర్పడం అనే ధోరణిలో నేటి సంస్కృత భాషాభిమానులు ముందుకుసాగిపోతున్నారు. దీంతో విద్యార్థులు సంస్కృత భాష అంటే పూజల శ్లోకాలకు, కాలక్షేప కథలకు మాత్రమే పరిమితమవుతున్నారు. కాదు కూడదంటే మంత్రాలకు, వరాలకు, శాపాలకు పరిమితం అనే దృష్టికి వచ్చారు.
ఆంగ్ల భాషా ప్రభావం అతి తక్కువగా ఉన్న కాలంలో సంస్కృత భాషాభ్యాసం ఈ రీతిలోనే ఉండటం వల్ల ఆంగ్ల భాష అత్యంత సులభంగా సంస్కృత భాషను తోసి రాజన్నది. నిజానికి మహాకవి కాళిదాసు రచనలే అధికంగా పాఠ్యాంశాలై అవి శాస్త్రీయ బోధనకు నోచుకుని ఉంటే పరిస్థితి మరోరకంగా ఉండేది.
మహాకవి కాళిదాసు రుతు సంహార పఠనం సంస్కృత సంభాషణకు ఉపయోగపడితే, అందలి భావ పరంపరలు ప్రకృతి ధర్మాలను, జీవశాస్త్ర ధర్మాలను కలిగి ఉంటాయి. ఇక ఆయన రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం కావ్యాలు పురాణ కథలను చెప్పడమే కాకుండా విజ్ఞాన ఛాయలతో ప్రకాసిస్తుంటాయి. ఆ ఛాయాపూరిత భాష సమాజానికి అందితే సమాజ నిజ జీవితానికి కావల్సిన పారిభాషిక పదాలు (టెర్మినాలజీ) సమాజానికి అందుతాయి.
మహాకవి కాళిదాసు కవిత్వంలో నేటి సమాజానికి కావల్సినంత టెర్మినాలజీ ఉన్నది. కానీ ఆ దిశగా సంస్కృత భాషా బోధన జరగలేదు. ఉదాహరణకు మహాకవి కాళిదాసు తన కుమారసంభవ కావ్యంలో ‘పృథివ్యా ఇవ మానదండః’ అని అంటారు. అంటే హిమవంతుడు భూమికి కొలబద్దలాగ నిలిచి ఉన్నాడని అర్థం. ఇక్కడ మానదండం అనేది పారిభాషిక పదం. ఇలాంటి పదాలను మరింత విపులంగా వివరించగలిగే బోధకులు ఉంటే సంస్కృత పారిభాషిక పదజాలం విద్యార్థులకు సమృద్ధిగా అందుతుంది. దురదృష్టకరమైన విషయం ఏమంటే ఈ రీతిన పూర్వీకుల బోధన జరగలేదు. హిమవంతుడు భూమికి కొలబద్ద, ఆయన మహానుభావుడు. మహా మహా యజ్ఞాలు, యాగాలు చేశాడు అంటూ ఆధ్యాత్మిక చట్రంలో ఒకనాటి బోధన జరిగింది. కొంతమంది ఛాందస పండితులైతే మహాకవి కాళిదాసు కవిత్వమా! ‘అల్లుని మంచితనము, గొల్లని సాహిత్యము’ అంటూ మహాకవి కాళిదాసుని కులపరంగా ఎగతాళి చేశారు. సంస్కృత భాష ప్రజలకు దూరమవుతుండేసరికి మరలా మహాకవి కాళిదాసు సూపర్, డూపర్, బంపర్ అంటున్నారు.
నిజమైన కవి చెప్పే సాహిత్యంలో, కవి తను చెప్పే కథతో పాటు తనకు తెలిసిన విజ్ఞాన ఛాయలను కూడా కుప్పించి రాస్తాడు. అలాంటి వారే మహా కవులవుతారు. అలాంటి మహాకవి ఎవరంటే మహాకవి కాళిదాసు.
మహాకవి కాళిదాసు తన రఘువంశాన్ని ‘వాగర్థావివ సంపృక్తౌ…’ అనే శ్లోకంతోనూ, తన కుమార సంభవాన్ని ‘అస్తి ఉత్తర శ్యాం దిశి’ అనే శ్లోకం తోనూ, తన మేఘ సందేశాన్ని ‘కశ్చిత్ కాంత విరహ..’ అనే శ్లోకంతోనూ ప్రారంభించారు. ఈ శ్లోకాలలోని మొదటి పదాలు వాక్, అస్తి, కశ్చిత్. ఈ మూడు పదాలను కలుపుకొంటే ‘వాగస్తి కశ్చిత్’ అంటే ఒకనొక వాక్కు ఉన్నది అని అర్థం.
మహాకవి కాళిదాసు తనకు ఒకానొక వాక్కు ఉన్నదని రాశారు. కానీ తన వాక్కే ఆ వాక్కని అహంకరించలేదు. ఆ ఒకానొకలోనే అమోఘ అర్థాన్ని చూడవచ్చు. అలాగే ‘ఏకోహి దోషోః గుణసన్నిపాతే నిమజ్జతీందోః కిరణేష్వివాంకః’ అని మహాకవి కాళిదాసు హిమవంతుడిని వర్ణిస్తూనే నా సాహిత్యంలో చిన్న దోషం ఉన్నదని నా సాహిత్యమునంత తప్పు పట్టకండి అన్నారు. చంద్రునిలో మచ్చ ఉందని చంద్ర కిరణాలను శంకించం కదా అనే భావాన్ని నర్మగర్భంగా తను రాసిన శ్లోకంలో ఉంచారు. మహాకవి కాళిదాసు వ్యాసుని నడుమ జరిగిన తు.చ. కథ కూడా చివరికి మహాకవి కాళిదాసు వినయాన్నే తెలియజేస్తుంది.
మహాకవి కాళిదాసు కావాలనే ఇలా రాశాడా అంటే తను కావాలనుకున్నా, వద్దనుకున్నా శ్యామలాదేవి అతనిని అలా అనుగ్రహించిందని చెప్పాలి తప్ప అతని కులం మీద ద్వేషంతోనో, అతని సాహిత్యం మీద అసూయతోనో మరో రకంగా చెప్పకూడదు. ఏతావాతా చెప్పేదేమంటే ఈనాటి సమాజానికి సైతం మహాకవి కాళిదాసు రచనలు సంస్కృత భాషాభివృద్ధికి చక్కగా ఉపయోగపడతాయి. సరళ సంస్కృత భాష, చక్కని భావజాలం, నేటి సమాజానికి సైతం ఉపయోగపడే పారిభాషిక పదజాలం, విజ్ఞాన ఛాయలతో కూడిన ఆలోచనావిధానం, కావల్సినంత మేర భక్తి, మేధో సామర్థ్యాన్ని పెంచే యుక్తి మహాకవి కాళిదాసు సాహిత్యంలో ఉన్నది. నిజమైన సంస్కృత భాషాభిమానులు మహాకవి కాళిదాసు సాహిత్యం సహాయంతో, అందునా రఘువర్మ చెప్పిన మహాకవి కాళిదాసు తొలి రచన రుతు సంహారం సహాయంతో సశాస్త్రీయంగా ముందడుగు వేస్తే ఆధునిక విద్యా ప్రపంచం సైతం సంస్కృత భాషను ఆంగ్లంలా అక్కున చేర్చుకుంటుంది.
– వాగుమూడి లక్ష్మీరాఘవరావు 98494 48947