కథలంటే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. ఎవరైనా కథలు చెప్తే ఆసక్తిగా వింటారు. ఏ రకం కథలైనా వినడానికి శ్రద్ధ చూపెడతారు పిల్లలు. అలాంటి ప్రత్యేకతను కలిగి ఉంటుంది కథ. పిల్లలే కాదు, పెద్దలు కూడా కథలను ఇష్టపడతారు. ఒకప్పుడు చందమామ కథలంటే అందరూ చెవి కోసుకునేవారు. అప్పట్లో నెలనెల వచ్చే చందమామ పత్రిక కోసం ఎదురు చూసేవారు. ‘చందమామ’ 14 భారతీయ భాషల్లో వెలుగులను పంచింది.
ఆనాటి చందమామ కథలు అందమైన బొమ్మలతో అందర్నీ అలరించాయి. అప్పటి కథలకు పాణం పోసి.. ఇప్పటి పిల్లల కోసం గొప్పగా అలంకరించి మళ్లీ చందమామ కథలను అందిస్తున్నారు రచయిత మాచిరాజు కామేశ్వరరావు. నేటి తరానికి అనుగుణంగా అందమైన ముద్రణతో, రంగురంగుల బొమ్మలతో ఆబాలగోపాలాన్ని అలరించడానికి మళ్లీ పాఠకుల ముందుకొస్తున్నాయి చందమామ కథలు.
తన కోపమే తనకు శత్రువు అంటారు పెద్దలు. ఎవరి కోపం వారి పాలిట శాపంగా మారుతుంది. కోపంతో జీవితాన్ని దుఃఖమయం చేసుకోకూడదు. జీవితం చాలా చిన్నది. పైన పేర్కొన్నట్టు.. తన కోపమే తనకు శత్రువు అని తెలిపే సందేశాత్మక కథ ‘కోపిష్టి మొగుడు’. ఈ కథ నేటి తరం మనుషులకు చక్కగా సరిపోతుంది.
మరొక కథ అపార్థం. మనం విన్నవి, కన్నవి అన్నిసార్లు నిజాలు కావు. కొన్ని సందర్భాల్లో ఇతరులను మనం అపార్థం చేసుకుని స్వయంగా అల్లకల్లోలం సృష్టించుకుంటాం. అందుకే నిజాలు తెలుసుకొని మాట్లాడాలనే నీతిని ఈ కథలో తెలుసుకుంటారు. కట్నాల పిచ్చి కథలో పెండ్లి చేసుకోవడానికి డబ్బులు, కట్నాలు ముఖ్యం కాదనే విషయం అవగతం అవుతుంది. చదువుకున్నవాళ్లు కూడా ఈ కాలంలో వరకట్నం కోసం ఆశపడుతుండటం విచారకరం. పెండ్లి చేసుకోవడానికి అందం, గుణగణాలు ముఖ్యమనే చక్కటి సందేశాన్ని ఈ కథ ద్వారా తెలుస్తుంది.
ఇద్దరు నిరుద్యోగులు మరో కథ. స్వశక్తి మీద నమ్మకముంటే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. సంపాదించుకున్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోగల ఆత్మవిశ్వాసం ప్రతిఒక్కరికీ అవసరమనే విషయం ఈ కథలో తెలుసుకుంటాం. మన నిత్య జీవితంలో ఎదురయ్యే అంశాల గురించే చందమామలో కథలుంటాయి. ఇందులో ఉండే 45 కథలు వేటికవే ప్రత్యేకం.
మన నిత్యజీవితాలకు సంబంధించినవే చందమామ కథలు. ఇవి ఆద్యం తం ఆసక్తికరంగా ఉంటా యి. అందరినీ అలరించే కథలివి. ప్రతి విద్యార్థి చద వాల్సిన నీతి కథలివి. ప్రతి ఒక్కరి చేతిలో ఉండాల్సిన పుస్తకం ఇది.
యాడవరం చంద్రకాంత్ గౌడ్
94417 62105