వల్లభాపురం జనార్దన వచనకవిగా, పద్య కవిగా ప్రసిద్ధులు. ఆయన రచించిన విజయక్రాంతి సంగీత రూపకం పుస్తకాన్ని 1974లో నవోదయ సాహితీ సమితి కొల్లాపురం సంస్థ ప్రచురించింది. ఆనాటి భయంకరమైన కరువు బీభత్సాన్ని గేయరూపకంగా అన్ని గ్రామాల్లో ప్రదర్శించారు. కరువు పీడిత ప్రాంతం నుంచి ఎదిగొచ్చి, చదువుకొని తన శ్రామికవర్గ స్పృహను, రైతు వెతలను వదలకుండా రాసిన మొదటి రచన ఇది.
విజయక్రాంతి పుస్తకం ఇప్పుడు ఎక్కడా అందుబాటులో లేదు. అందుకే ఇటీవల దాన్ని మరోసారి ముద్రించారు. జనవరి 7న మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఈ పుస్తకావిష్కరణ జరిగింది. ఇక పుస్తకం విషయానికొస్తే.. ఈ పుస్తకానికి పల్లవి అనే పేరుతో డాక్టర్ జీవీ సుబ్రహ్మణ్యం ముందుమాట రాశారు. భావ పల్లవి అంటూ కవి తన మాటను రాశారు.
1974లో అప్పటి పల్లెటూర్లలో కనిపించే రాజకీయ కక్షల పరిణామాలను ఇందులో విపులంగా చిత్రించారు. కరువు, అప్పులు, వడ్డీలు, మిత్తి, పెత్తందారు నాగులు దౌర్జన్యాలపై గేయ నాటకాన్ని రాసి గ్రామాల్లో ప్రదర్శించారు. పద్యగేయ రూపకంగా నాటకాన్ని రాయడం కత్తిమీద సామే. పాత్ర పలికిన ప్రతిమాట మాత్రాబద్ధం కావాలి. ధనమదాంధ దౌర్జన్యానికి వ్యతిరేకంగా శాంతి, సమానత్వం, సమసమాజమే మార్గంగా, శ్రేయోరాజ్య స్థాపనగా దేశభక్తిని ప్రకటించిన ప్రబోధమే ఈ గేయరూపక విజయక్రాంతి.
సామాజిక వ్యవస్థను చిత్రించే ఏ రచన అయినా సామాన్యులకు అందుబాటులో ఉండేటట్టుగా ఆయా పదాల మాండలికాలలో కొనసాగే రచన శాశ్వతంగా నిలుస్తుంది. కథావస్తువు బలంగా లేకపోతే నాటకం రక్తికట్టడం కష్టమవుతుంది. కథనం వినసొంపుగా ఉంటే ప్రజలు అద్భుతంగా పాడుకుంటారు. ఇందులోని కథలు కూడా సహజంగా, వాస్తవాలకు దగ్గరగా.. ఊహలకు, కల్పితాలకు తావివ్వకుండా ఉంటాయి. రామాపురం అనే గ్రామంలో తన కల్లంకాడ రైతు రామిరెడ్డి, పెత్తందారు నాగరాజు, గుమస్తా శేషయ్యల మధ్య జరిగే సంభాషణలు అప్పటి పరిస్థితులను కండ్లకు కడతాయి. విజయక్రాంతిలోని గేయాలు మానవ హృదయాల్ని ద్రవింపజేస్తాయి. రైతు కష్టాలపై చేసిన రచన అలలమీద పడవలా సాగుతది. రైతు రామిరెడ్డి తాను పండించిన ధాన్యాన్ని తరలించకుండా.. గుమస్తా శేషయ్య అడ్డుపడి, రైతును కొట్టి ఆ ధాన్యాన్ని ఎత్తుకుపోయే సన్నివేశాన్ని చూస్తే మన కండ్ల వెంట కన్నీళ్లు వస్తాయి.
ఏడు దృశ్యాలుగా సాగిన ఈ కావ్యంలో..
సోదరులారా కదలండి
సోమరులై చెడిపోకండి
జనశక్తిని రుచి చూపిద్దాం
ధనస్వామ్యపు పస తేల్చేద్దాం
సామ్యవాదమును సాధింతాం
శ్రమజీవిని అభిషేకింతాం
జగతికి సుఖముల పంచేద్దాం
ప్రగతికి బాటలు వేసేద్దాం
పెత్తందారుల పెద్దరికం
గుత్త పెట్టుబడి చదరంగం
బూర్జువాయిజం దౌర్జన్యం
భువి లేకుండగ చేసేద్దాం
గ్రామ రాజ్యమును నిర్మింతాం
రామరాజ్యమును స్థాపింతాం
సమాన హక్కుల సాధింతాం
శాంతి సమతలను వెలయింతాం…
అని సాగే గేయం ఎందరినో కదిలించింది.
ఒక సందర్భంలో సర్పంచ్గా ఎన్నికైన రమేష్ను పెత్తందారు నాగరాజు హత్య చేయించగా.. ఆ వార్త విని గ్రామమంతా కుప్పకూలిపోతుంది. ఆత్మీయులంతా విలపిస్తారు. అప్పుడు ఊరు శోకగీతమై విలపిస్తుంది. ఆ గీతం ఇలా సాగుతుంది..
మన బ్రతుకుల వెలుగు రేక
మానవతకు నవ ప్రతీక
ఆరిపాయె కన్నీరె మిగిలె
మన ప్రాణము మన నెయ్యము
మనకు దూరమాయెనయ్య
ధనదానవ క్రూరదంష్ట్ర…
నూనూగు మీసాల నూతన యవ్వనంలో 20 ఏండ్ల వయస్సులో వల్లభాపురం జనార్దన రాసిన ఏడు దృశ్యాల గేయ రూపకమే విజయక్రాంతి. ఆనాటి గ్రామ పంచాయతీ ఎన్నికలు, రాజకీయాలు, కక్షలు, సాంఘిక అసమానతలు, రైతుల దీనస్థితుల సమాహారమే విజయక్రాంతి.
చాలాచక్కగా, చిక్కటి కవిత్వమై ఛందోబద్ధమై సాగిన విజయక్రాంతి ఇప్పటికీ, ఎప్పటికీ ఒక చైతన్య క్రాంతి. ఆనాడు ఉన్న పరిస్థితే నేడూ వివిధ రూపాల్లో కనిపిస్తూనే ఉన్నది. నిరసనలు, ఉద్యమాలు నడుస్తూనే ఉన్నయి. ఢిల్లీలో నిరసన చేస్తున్న రైతులను అణచివేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూనే ఉన్నయి. అలాంటి ఘటనలపై ఎనభై ఏండ్ల వయసులోనూ వల్లభాపురం జనార్దన ప్రజల పక్షాన కవితలు, పద్యాల రూపంలో తుపాకీని ఎక్కుపెడుతూనే ఉన్నారు. ఆయన రచించిన
రచనలు ‘పహారా కాస్తున్న రాత్రి’, ‘విష కౌగిలి’, ‘యుగపతాక శ్రీశ్రీ దీర్ఘ కవితలు’ సమగ్రంగా వచ్చినట్టయితే నేటి యువతరానికి, నవతరం సాహితీ అభిలాషులకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తాయి.
వనపట్ల సుబ్బయ్య