తెలంగాణ ప్రాంతంలో కాకతీయులకు పూర్వం చాళుక్యులు తమ రాజ్యవిస్తరణ తో పాటు ఆలయాల నిర్మాణం, చెరువుల త్రవ్వకాలు, దానధర్మాదులు అనేకం నిర్వహించినారు. వీరి బాటనే కాకతీయులకు మార్గదర్శకమైంది. చాళుక్య సోమేశ్వరుని కాలంలో నల్లగొండ జిల్లాలోని కోదాడు ప్రాంతంలోని చిలుకూరు గ్రామంలో లభించిన శాసనం అటువంటిదే. ఈ శాసనం చాళుక్య సోమేశ్వరుని మహా మండలేశ్వరుడైన అసగమరస అనే రాష్ట్రకూట వంశీయుడు వేయించి నట్టిది. శాసన కాలం శతక సంవత్సరం-989 = క్రీ.శ.1067 ప్లవంగ నామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పంచమి.
చాళుక్య సోమేశ్వరుని కాలంలో లట్టలూరు పురవరాధీశ్వరుడు, మహా మండలేశ్వరుడైన అసగమరస అనే రాష్ట్రకూట వంశీయుడు కొలనుపాక, సబ్బినాడు ప్రాంతాలను పాలించాడు. ఇతడు చిలుకూరుపల్లిలో తన పేర అసగేశ్వరాలయాన్ని నిర్మించినాడు. ఆ సమయంలోనే లకులేశ్వర పండితుని శిష్యుడు ధృవేశ్వర పండితునికి, అసగేశ్వరస్వామి అంగరంగ భోగాలకు మల్లీశ్వరతోట, దేవుని రంగభోగానికి, నృత్య, గీత, వాద్యాదులకు, తపోధనుల ఆహారాదులకు, ఖండస్ఫుటిత జీర్ణోద్ధార, నవసుధాకర్మలకు జయంతి తుండమడ్డి, వెడిరావూరు గ్రామాలలో భూమిని స్వామివారి మూడు కాలాల్లో ని భోగాలకు సర్వస్వామ్యంగా దానమిచ్చాడు. అదేవిధంగా సబ్బినాడులోని భీమేశ్వర దేవరకు, దేవులపల్లి గ్రామంలో తన తల్లి పేర (సాయి నిమ్మడిదేవి) సావబేశ్వరాలయం నిర్మించి అంగడిలోని సిద్ధాయాదులు చెల్లునట్లు దానం చేశాడు.
అసగరస మహారాజు ఈ శాసనంలో అతని గుణగణాల గురించి విస్తృత వర్ణన ఉన్నది. అతన్ని ‘లట్టలూరు పురవరాధీశ్వర, విక్రమధీర గండర, చాళుక్య రాజ్యలక్ష్మీ విస్తార, చాళుక్య కటకప్రాకార, చాళుక్య కటక సామన్త సన్నాహ సంగ్రామావనేచర, మహా వరాహ భూళ సామంత, రట్టకుళ పార్థ, క్షత్రియ పవిత్ర రట్ట రాధేయ, విశ్రాంత కౌంతేయ, మహేంద్ర మాఫె వాక్య హరిశ్చంద్ర, రట్టకుల కుంత త్రినేత్ర, మండలిక మకుట మకరి, మాండలిక విభూషణ, చాళుక్య రామ శ్రీపాద పద్మారాధన విభూషణ, ధార్మి ధర్మాత్మజ, పరంగానా దూర, రాష్ట్రకూట కుళ నిస్తార, పరనారీ నందన, మాండలిక మకరకేతన, సరస్వతీసమయ కుముద వనచంద్ర, దాక్షిణ్య సుధా సంపూర్ణ వదన చంద్రవీర, వీర మాండలిక మకుట మాణిక్యాభరణ, వీర మార్తండ హృదయాహ్లాద పరహిత కర్ణ’ అని కీర్తించారు.
‘సమస్త రాజ సంపూర్ణ ప్రతిపన్న జలనిధి రాజ విద్యానిధి సేవిత, సమయ దీక్షాగురు అనవరత మహాదాన సురతరు, మండలిక చింతామణి, శరణాగత మహామండలిక రక్షామణి, చోళబల జలధి బలవానలం, ప్రతాప దావానలం, చోళకబక సూరెకారం, కావేరి కకారం కేవిరి భయలోభ దూర, కీర్తికామినీ కంఠహార, సుభట దేవ కొల్లిపాక సకల దిక్చత్ర సాధక త్రైలోక్య మల్లదేవ శ్రీపాద పద్మారాధక, జగద్విఖ్యాత కీర్తిధ్వజాలంకృత శ్రీమన్మహామండలేశ్వర అసగ భూపాల’ అని చాలా విస్తృతంగా వర్ణించబడినాడు.
–డాక్టర్ భిన్నూరి మనోహరి
93479 71177