చదువుకుంటే ఉన్న మతి పోయినట్లుందని పెద్దలు చెప్పిన మాట ను ఈ కాలంలోని కొందరు యువతీ యువకులు రుజువు చేస్తున్నారు. తప్ప తాగి వాహనాలు నడిపి రోడ్డు మీద ఉన్న వారికే కాదు.. తమతో కలిసి ప్రయాణించేవారికి కూడా ప్రాణాంతకంగా మారుతున్నారు. పలు సందర్భాల్లో తమ ప్రాణాలూ కోల్పోతున్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి పరిధిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం దీనికో తాజా ఉదాహరణ. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఓ క్లబ్లో కలిసి పార్టీ చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో మద్యం తాగిన అబ్బాయి విపరీతమైన వేగంతో నడపడం వల్ల కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న యువతులలో ఒకరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కెనడాలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది.
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గత ఏడు నెలల్లోనే మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల 144 మంది మరణించారు. ఇదే సమయంలో దాదాపుగా 20 వేల ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసులు నమోదయ్యాయి. తాగి నడిపినందుకు గత నెలలో 353 మందికి జైలు శిక్ష పడింది. ఎక్కువగా వారాంతాల్లోనే ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రయితే చాలు హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో ధనవంతుల పిల్లలు మొరటుగా కార్లు నడుపుతూ కనిపించడం పరిపాటి. ద్విచక్రవాహనాలపై వెళ్లేవారు, పాదచారులు అరచేత ప్రాణాలు పెట్టుకొని తిరగవలసి వస్తున్నది. కొందరు తాగి నడపడమే కాకుండా, పోలీసులు అడ్డగిస్తే తాము ఫలానా పెద్ద మనుషుల కుటుంబీకులమని చెబుతూ తప్పించుకోజూస్తున్నారు. పోలీసుల పట్ల కూడా అమర్యాదగా ప్రవర్తించడం మామూలైపోయింది. ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తుండగా తాగుబోతు కారుతో ఢీకొట్టటంతో ఒక ఏఎస్ఐ మరణించగా, మరో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు.
పోలీసులు ఎంత పకడ్బందీగా నేరాలను నిరోధించడానికి ప్రయత్నించినా కొన్ని విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందుకు కారణం వాహన చోదకులలో స్వీయ క్రమశిక్షణ, కనీస బాధ్యత లోపించటమే. చేతికి అందివచ్చిన పిల్లలు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురై తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగులు స్తున్నారు. ఇందులో తల్లిదండ్రుల తప్పు కూడా ఉన్నది. పిల్లలు రాత్రంతా జల్సాలు చేస్తూ, తాగి వాహనాలు నడుపుతున్నారంటే పట్టించుకోకపోవడం వారి బాధ్యతారాహిత్యమే. ఈ విధంగా తమ పిల్లలకే కాదు, సమాజానికీ చెరుపు చేస్తున్నారు. పిల్లలను పట్టించుకోకుండా, ప్రమాదం జరిగిన తర్వాత శోకించి ఫలితం ఏముంటుంది? ఉన్నత కుటుంబీకులు, విద్యావంతులైన యువత సమాజం పట్ల మరింత బాధ్యతాయుతంగా ఉండాలే తప్ప ఇంతటి నిర్లక్ష్యం ఎంతమాత్రం సరికాదు.