పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం. దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్దికొద్దిగా దూరమవుతూ దక్షిణార్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగభగ మండే చలిమంటలు వేసుకుంటారు.
అంతేకాకుండా దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ, రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మనకు తెలిసిందే. మరైతే ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణం మరియు శాస్త్రీయ కారణాలు తెలుసుకుందాం.
‘భుగ్’ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ దినమే శ్రీ రంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది పురాణగాథ. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణగాథ కూడా ఉంది. అయితే తరువాత బలి చక్రవర్తిని పాతాళరాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమివ్వడం జరిగిందట. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాల్లో చెప్పబడింది. కృష్ణుడు ఇంద్రుడికి గుణపాఠం చెప్పేందుకు గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజూ ఇదే. శాపవశంగా పరమేశ్వరుని వాహనమయిన బసవన్న రైతన్నకు అండదండగా నిలిచేందుకు భూమికి దిగి వచ్చిన రోజు ఇదేనని మరో గాథ.
సాధారణంగా అందరూ చెప్పేది, ఇది చలికాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నెలంతా ఇంటిముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. ఆ గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తుంటాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి. వాటికి ఔషధంంగా ఇది పని చేస్తుంది. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరడులు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని వేస్తారు. అగ్నిహోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశి ఆవు నెయ్యి నుంచి బోలెడు ప్రాణవాయువు విడుదల అవుతుందట.
ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదల అయ్యే పొగ అతి శక్తివంతమైంది. మన శరీరం నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వవచ్చు. అదే అందరికీ వస్తే ఔషధం సమకూర్చడం దాదాపు అసాధ్యం. ఇదంతా ఆలోచించిన మన పెద్దలు భోగి మంటల సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే పొగ అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరూ ఒక చోట చేరడం వల్ల ప్రజల మధ్య దూరాలు తగ్గుతాయి. ఇది ఒకరకంగా అగ్నిదేవుడి ఆరాధనా, మరోరకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా.
కాని ఈ రోజుల్లో కొందరు రబ్బరు టైర్లను పెట్రోలు పోసి తగులబెట్టి భోగిమంటలు అంటున్నారు. కానీ దీనివల్ల విషవాయువులను పీలుస్తూ, కాలుష్యాన్ని ఎగదోస్తూ మన ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడమే అవుతుంది. ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులను వేసి కాల్చాలి అంటుంటారు. పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి కావు అని తెలుసుకోవాలి. నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు, మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడలు పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి.
తెలంగాణ సామాజిక రచయితల సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…కరీంనగర్ జిల్లా
రావుల రాజేశం
98488 11424