రెండవ ప్రపంచయుద్ధం తర్వాత ‘సార్త్రె’ తెచ్చిన అస్తిత్వవాదం, ఆయన సహచరి సిమోన్ దబుహి రాసిన ‘ది సెకండ్ సెక్స్’ గ్రంథం స్త్రీవాద భావజాలాన్ని విస్తృత ప్రచారంలోకి తెచ్చింది. స్త్రీలు తమ అస్తిత్వాన్ని గూర్చి శ్రమ దోపిడీ, సెక్స్ సంబంధాల్లో అనుసరించబడే ద్వంద్వ నీతి గురించి ఆ పుస్తకం చర్చించింది. ఆ నేపథ్యంలోంచే స్త్రీల మీద తరతరాల అణచివేతకు, వెలివేతకు మహిళలు ఎదురుతిరిగారు.
1966లో అమెరికాలో ‘నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్’ అనే పేరుతో ఫెమినిస్ట్ సంస్థ ఏర్పడింది. పురుషాధిక్య ప్రపంచమే స్త్రీలకు శత్రువని, స్త్రీల అణచివేతకు పితృస్వామ్య సమాజం కారణం అని ప్రకటించారు. తర్వాత స్త్రీ, పురుషుల మధ్య అసమానతతో కూడిన సంబంధాలు, లైంగిక రాజకీయాలు తెలుగులో స్త్రీవాద ధోరణికి సిద్ధాంతాలయ్యాయి. తెలుగు నేలలో చలం, రంగనాయకమ్మ, ఓల్గా తదితర రచయితల రచనలు స్త్రీ వాదానికి భూమికగా పనిచేశాయని చెప్పవచ్చు. ముఖ్యంగా 1993లో స్త్రీవాదులు ప్రచురించిన ‘నీలి మేఘాలు’ కవితా సంకలనం స్త్రీవాద భావజాలాన్ని చాలా ప్రచారంలోకి తెచ్చింది. ఈ భావజాలం కొంతవరకు విమర్శలకు గురైనా, 1980-90 దశకంలో స్త్రీవాదం బలంగా ముందుకువచ్చింది.
భారతదేశంలో 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభంలో జరిగిన సంఘసంస్కరణ ఉద్యమాలు స్త్రీల సమస్యలను చాలావరకు పట్టించుకున్నాయి. స్త్రీ విద్య ముందడుగు వేసింది. స్త్రీలకు ఓటుహక్కు వచ్చింది. దేశ స్వాతంత్య్రం తర్వాత 1960-70 దశకంలో చాలామంది మహిళా రచయితలు రచనలు చేశారు. వారిలో తెలంగాణ నుంచి మాదిరెడ్డి సులోచన, బొమ్మ హైమాదేవి, పొల్కంపల్లి శాంతాదేవి మొదలైన రచయిత్రులున్నారు. వారు అనేక నవలలు రచించారు. వాళ్లు ప్రేమ పెళ్లిళ్లు, వర్ణాంతర వివాహాలు వంటి ఇతివృత్తాలు తీసుకొని నవలలు, కథలు రచించారు. యూరప్లో తలెత్తిన స్త్రీ వాదాన్ని పట్టించుకోలేదు. కుటుంబ సమస్యలు, వరకట్న సమస్యలు, ఉద్యోగినుల సమస్యల గూర్చి రాశారు. స్త్రీల స్వేచ్ఛ, స్త్రీ- పురుష సంబంధాల్లో ఉన్న భేద భావాల గురించి వారు రాయలేదు. స్త్రీల ఇంటి చాకిరీ, ఆర్థిక స్వాతంత్య్రం లేని స్త్రీల శ్రమదోపిడీ గూర్చి వారు రాయలేదు. కానీ ఇంతకుముందే… 1952లోనే వట్టికోట ఆళ్వారు స్వామి రచించిన ‘అవకాశమిస్తే..’ అనే కథలో స్త్రీల వంటింటి చాకిరీని గురించి ప్రస్తావించటం గమనార్హం. స్త్రీల ఇంటిపనుల్లో పురుషులు కూడా భాగస్వాములు కావాలన్నా డు. ఆ కథలో కథానాయిక.. ‘ అసలు మీ మగవాళ్లు మమ్ముల అణచిపెట్టారు. లేకుంటే, మీకంటే అన్ని విషయాల్లో మేమే సమర్థులం. కావాలంటే మా చేతికి అధికారం ఇవ్వండి చూపిస్తాము మా శక్తి సామర్థ్యాలు..’ అంటుంది. మరొక చోట ‘..అన్నింటినీ అరికట్టేవారు పురుషులు. స్త్రీలు ఎల్లప్పుడూ పురోగాములే. ఎప్పుడూ ముందడుగే..’ అని నాయిక అంటుంది! ఇవన్నీ.. వట్టికోట అభిప్రాయాలు.
మరొకచోట ఆయన.. ‘అనుచరులు లేకుండా ముందడుగేయ లాభం లేదు. నన్నైనా నీ వెంట తీసుకెళ్లు..’ అని స్త్రీల వెంట పురుషులు ఉంటేనే స్త్రీ స్వేచ్ఛ సాధ్యమవుతుందని ఆళ్వారుస్వామి అన్నాడు. ఆ తర్వాత కాలంలో తెలంగాణ స్త్రీవాద రచయిత్రులు పురుష ద్వేషం కాకుండా, స్త్రీల సమస్యలన్నింటికీ పురుషుడే కారణం అని అనకుండా వట్టికోట చెప్పిన ప్రజాస్వామ్య ధోరణినే అనుసరిస్తూ నవలలు, కథలు రచించారు. విప్లవ కవుల్లో తెలంగాణ వారైన చెరబండరాజు, గద్దర్, అల్లం రాజయ్య, వరవరరావు స్త్రీ సమస్యలపై కవిత్వం, కథలు రాశారు. స్త్రీ పురుషులిద్దరూ కలిసి ఉద్యమించాలన్నారు.
సాహిత్యంలో స్త్రీవాదం ధోరణిలో నవలలు, కథలు, కవితలు వచ్చాయి. విమల- ‘వంటిల్లు’ అనే కవితలో వంటింటికే అంకితమైన ఇంటి చాకిరికి గురైన స్త్రీ సమస్యలను చిత్రించింది. ‘అసలు మా అమ్మే నడుస్తున్న వంటగదిలా ఉంటుంది… మా అమ్మ, అమ్మమ్మ ఇంట్లో అమ్మలంతా.. ఇక్కడే స్త్రీలయ్యా రు…’ అని అంటుంది.
‘ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా చివరకు వంటింటి గిన్నెలంటిపైనా నాన్న పేరే..!’ అని పురుషాధిపత్యాన్ని ఎత్తిచూపింది. స్త్రీ అణచివేతకు, వివక్షకు విమల ‘వంటిల్లు’ను ప్రతీకగా తీసుకొని కవిత రాసింది. ‘మనమేమైనా మన అంతిమ కర్తవ్యం/ గంటె తిప్పడం చేసిన ఈ వంటిల్లును ధ్వంసం చేద్దాం రండి..’ అని పిలుపునిచ్చింది. ఈ వాక్యాల్లో వంటింటిని విధ్వంసం చేద్దాం అనటం అనేది వ్యవస్థను ధ్వంసం చేద్దాం అనేదానికి ప్రతీక.
-ముదిగంటి సుజాతారెడ్డి
99634 31606