పశ్చిమచాళుక్యరాజు త్రిభువన మల్ల ఆరవ విక్రమాదిత్యుని కాలంలో వరంగల్లు జిల్లా నర్సంపేట ప్రాంతంలోని బానాజీపేటలో ఒక శాసనం లభించింది. శాసన కాలం శ. సం.1004. దుందుభి సంవత్సరం. పుష్యశుద్ధ తదియ ఆదివారం.
ఉగ్రవాడికి చెందిన మేడరస వీర కమల జినాలయాన్ని నిర్మించాడు. మేడరస వెల్గొంట కులతిలకుడైన మాధవవర్మ వంశానికి చెందినవాడు. ఈ మాధవ వర్మ తన సైన్యంలో 8,000 ఏనుగులు, 10 కోట్ల గుర్రాలు అనంతమైన పాద సైనికులు కలిగి ఉన్నాడు.
ఈ జినాలయానికి మహా మండలేశ్వర కాకతీయ బేతరస కొంత భూమిని దానంగా సమర్పించాడు. అదేవిధంగా పండితులకు, పూదోటకు, చైత్రమాసంలో జరిగే పవిత్రోత్సవాలకు 12 గద్యాణములు త్రిభోగాధ్యస్తర సిద్ధికోసం సర్వ బాధా పరిహారంగా సమర్పించాడు.
ఈ ధర్మాన్ని పాటించనివారు వారణాసిలో గోవులను చంపిన పాపాన్ని పొందుతారని శాపోక్తులున్నాయి. శాసనంలో కాకతీయ బేతరసు సమధిగత పంచ మహాశబ్ద, మహామండలేశ్వర, హన్మకొండ పురవరేశ్వర, పరమ మహేశ్వర, పరహితచరిత, వినయ విభూషణ, శ్రీమన్మహా మండలేశ్వర కాకతీయ బేతరసర్ అని పేర్కొన్నారు.ఈ శాసనాన్ని అయ్యపయ్య, శ్రీధరయ్యలు రచించారు.
శాసనంలో ఉన్న అంశం ఇంతే అయినప్పటికీ కాకతీయులు ముఖ్యంగా శివభక్తులు. వారు మొదట జైనులని, కాకతి అనేది జైన దేవత నామమని కూడా ప్రచారంలో ఉంది. కానీ ప్రస్తుత శాసనంలో మాత్రం మేదరస రాజు నిర్మించిన జినాలయానికి కాకతి బేతడు కొంత భూమిని దానమిచ్చినట్లుగా మనం గమనించవచ్చు. కాకతీయులు పూర్వం జైనమతాన్ని ఆదరించారు, శైవాన్ని ప్రోత్సహించారు. మత సహనాన్ని పాటించి రాజ్యంలో సుస్థిర పాలనను నెలకొల్పారు. అందుకు ఈ శాసనమే తార్కాణం.
-భిన్నూరి మనోహరి