కాళేశ్వరంపై చెప్పుడు మాటలతో తప్పుడు నివేదిక రాసిన కమిషన్ కథ కంచికి చేరింది. రాష్ర్ట ఉన్నత న్యాయస్థానం తీర్పుతో ఆ విచారణ బుడగ పేలిపోయింది. ఆ నివేదిక నిరర్థకమని తేలిపోయింది. తప్పుడు నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తేల్చిచెప్పింది. టార్గెట్ కేసీఆర్ అసలైన మిషన్..రాజకీయ ప్రతీకారమే పరమావధిగా పనిచేసిన పీసీసీ ఘోష్ కమిషన్.. పాలకుల తానాలకు తందానాలాడుతూ రాసిన నివేదిక ఉన్నత న్యాయస్థానం తిరస్కారంతో అటకెక్కింది. ఆ విచారణ తప్పులతడకగా సాగిందని, అందువల్ల ఆ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్ తదితరులపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని కోర్టు స్పష్టంగా చెప్పింది. అందులో మొదటిది సాక్షులుగా పిలిచి, ఏకపక్షంగా దోషులుగా నిర్ధారించడం. రెండవది పరిధి దాటి కొందరి ప్రతిష్టను భంగపర్చేలా వ్యాఖ్యలు చేయడం. విచారణలో ఎలాంటి విధివిధానాలు పాటించలేదని తప్పు పట్టడం గమనార్హం.
ఇది అచ్చంగా కాళేశ్వర విజయం. కేసీఆర్ దీక్షాదక్షతలకు లభించిన గౌరవం. కక్షలు, కార్పణ్యాల కాంగ్రెస్ కర్కశ పాలనకు చెంపపెట్టు. ‘ముద్ర’ చెరిపేస్తానని ఎగిరెగిరి పడుతున్న సీఎం రేవంత్రెడ్డికి ఎదురుదెబ్బ. అయితే, కమిషన్ వేయడాన్ని న్యాయస్థానం తప్పుపట్టలేదని ప్రభుత్వ వర్గాలు చంకలు గుద్దుకుంటున్నాయి. కమిషన్ వేసే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. కానీ ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ఎంత సజావుగా తయారైంది, ఎంతవరకు చెల్లుబడి అవుతుందనేదే అసలు సమస్య. అంతకుముందే విద్యుత్తు రంగంపై కమిషన్ వేసి కాంగ్రెస్ సర్కార్ భంగపడింది. న్యాయమూర్తి నియామకంతో సహా అన్నిదశల్లోనూ అభాసుపాలు కావడం తెలిసిందే. కమిషన్ పెద్దగా వచ్చిన ఓ మాజీ న్యాయమూర్తి పబ్లిక్గా మాట్లాడిన పరాకు మాటలు ఆయన ఉద్వాసనకు దారితీయడం ప్రభుత్వ ఉద్దేశాలను పట్టిచ్చింది. కాగా, కాళేశ్వరంపై ఏర్పాటైన కమిషన్ పెద్ద కాంగ్రెస్ మార్క్ నివేదిక సర్కార్ చేతిలో పెట్టి గుట్టుగా వెళ్లిపోవడమూ అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ నివేదిక పస ఏమిటో ఆనాడే తేలిపోయింది. కాళేశ్వరం కల నిజం చేసిన దార్శనికుడి చరిత్రను కళంకితం చేయడమే పరమావధిగా పనిచేసిన కమిషన్ ఎలాంటి నివేదిక ఇస్తుందో ఊహించలేమా?
తెలంగాణకు నీటి భరోసా కల్పించిన మహోన్నతమైన ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతల అవాకులు, చవాకులు పేలటం మొదటినుంచీ చూస్తున్నాం. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత వారు ఆడిన నాటకాలను అందరూ చూశారు. ప్రజలు మెచ్చిన ప్రాజెక్టును వారు కాదనలేరు. జలకాళేశ్వర నిర్మాత కేసీఆర్ ఔన్నత్యాన్ని ఔననలేరు. పనికిరాని విచారణలు, పసలేని కేసులు, నివేదికలతో అక్కసుతో ప్రభుత్వం ఆడుతున్న తిక్కరాజకీయం ప్రజలకు విసుగు తెప్పిస్తున్నది. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా వన్, డ్రగ్స్, ఓఆర్ఆర్ పరిధిలో భూముల లీజు పేరిట కేసులు పెట్టి వేధించడం వెగటు పుట్టిస్తున్నది. నమ్మి ఓటేసిన ప్రజలు కోరుకునేది సక్రమమైన పాలన. కావాల్సింది సంక్షేమాన్ని గాడిలో పెట్టి, ప్రగతిని పరుగులు పెట్టించడం. కానీ ఆ బాధ్యతను గాలికి వదిలేసి విపక్ష నేతపై పనికిమాలిన రాజకీయాలు చేస్తూ పోతే అంతిమంగా బొక్కబోర్లా పడక తప్పదు. పొరుగులకు సద్దికట్టే తెలంగాణ జలద్రోహులకు మిగిలేది అపకీర్తే. కాళేశ్వరం అంటేనే కేసీఆర్ ముద్ర. ఆ ముద్రను చెరిపేందుకు వేసిన ఎత్తు అంతిమంగా కోర్టులో చిత్తయింది. కాళేశ్వరం కీర్తిని, ఆ స్ఫూర్తిని మసకబారేలా చేయాలని పన్నిన పన్నాగాలు బెడిసికొట్టాయి. జన ప్రాణేశ్వరమైన జల కాళేశ్వరం కడిగిన ముత్యమైంది. అహరహం శోధించి, అద్భుతాన్ని సాధించిన జలవిజయం నిగిడిన సత్యమైంది.