బిందువును చేరి బిందువు సింధువగును
ధ్యేయమును బట్టి ప్రతి పని దివ్యమగును
– దాశరథి
ఎక్కడో కొండ కోనల్లో బొట్టు బొట్టుగా ప్రారంభమై ఎన్నెన్నో వాగులను, వంకలను కలుపుకొంటూ ఎత్తు ప్రాంతాలు ఎదురైనప్పుడు లాఘవంగా గమనాన్ని మార్చి, పల్లపు ప్రాంతాల్లో పరుగులు పెట్టి చివరకు గమ్యాన్ని ముద్దాడే నదీ ప్రవాహ గతి కేసీఆర్ వేసే ప్రతి అడుగులో ఆవిష్కృతమవుతుంది. ఆయన ధ్యానం, ఆయన మౌనం, ఆయన పోరు బాట ఏదైనా ఒక మానవీయ తాత్త్విక చింతనతో.. దేశం, ప్రజలు బాగుపడాలన్న లక్ష్యంతో ముందుకు సాగిపోతూ లక్ష్యతీరం చేరేదాకా ప్రయాణం సాగిస్తాయి.
రెండు దశాబ్దాల క్రితం ఒక సందర్భంలో ‘శ్రీరామ్ సాగర్’ ప్రాజెక్ట్ను సందర్శించిన కేసీఆర్ దాని దుస్థితిని చూసి తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయానికి దురపిల్లారు. ప్రత్యేక రాష్ట్రమే సర్వ సమస్యలకు పరిష్కారమన్న ఊహ ఆయన మనోగతంలో అంకురించిన సుమూహర్తం ఏదో కాని ఆరు దశాబ్దాల తెలంగాణ కల సాకారమైంది. ముఖ్యమంత్రిగా ఆయన నాయకత్వంలోని స్వరాష్ట్రం ప్రగతి పథాన పరుగులు తీస్తూ అన్ని రంగాల్లో దేశంలోనే అగ్ర భాగాన నిలిచింది.
శుక్రవారం సరిగ్గా మధ్యాహ్నం 1.20 నిమిషాలకు తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితికి సాధికారికంగా శ్రీకారం చుట్టిన కేసీఆర్ దేశ ప్రజల ఆకాంక్షలు సాకారం కావటానికి అడుగు ముందుకు వేశారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు గల ఆవశ్యకతను వివరించిన ఆయన ప్రసంగంలో ఎక్కడా రాజకీయాలు లేవు. పడదోస్తాం, విడదీస్తాం అంటూ జబ్బలు చరిచిన దృశ్యాలు లేవు. ఎన్నికలు, అధికారాలు, స్వపక్షాలు, విపక్షాలు అన్న ప్రస్తావనలే లేవు. ఒక దార్శనికుడు, ఒక స్రష్ట, ఒక రూపశిల్పి, ఒక ప్రజా పక్షపాతి, ఒక దేశ భక్తుడు, ఒక అభివృద్ధి సంక్షేమ అనురక్తుడు ఆయన సంకల్ప ప్రసంగంలో అంతర్యామిగా కన్పించారు.
దేశానికి నాయకత్వం వహించగలిగే అర్హతలు ఆయనలో పుష్కలంగా ఉన్నాయని ఇవాళ ఆసేతు హిమాచల ప్రజానీకం విశ్వసిస్తున్నది. రెండు చేతులు చాపి తమ గుండెలకు హత్తుకుని ఆశీర్వదిస్తామని ఆహ్వానిస్తున్నది దేశం. ఏదో రాజకీయాల్లో భాగంగా కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేయలేదు. దేశాన్ని గుణాత్మకంగా మార్చాలని, అగ్రగామిగా తీర్చిదిద్దాలని, ఈ విశాల మాతృభూమి మనకందించిన ప్రకృతి వనరులను, మానవ వనరులను సద్వినియోగం చేసుకుని భారతీయుడు ప్రపంచ పీఠంపై శిరమెత్తి నిలిచేలా చేయాలన్నదే కేసీఆర్ వజ్ర సంకల్పం. అందుకే భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం దేశవ్యాప్తంగా పెను సంచలనమైంది.
కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించిన నాటి నుంచి రాష్ట్ర సాధన దాకా సంధించిన మౌలికమైన ప్రశ్నలే ఆయన విజయానికి బాటలు వేశాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు ప్రకటన చేస్తూ జలదృశ్యంలో చేసిన ప్రసంగంలో కూడా తెలంగాణ అస్తిత్వం, ఆత్మ గౌరవం, ఘనమైన చరిత్ర, నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ పట్ల కొనసాగుతున్న వివక్ష… ఇవే ప్రధానమై నిలిచాయి తప్ప ఎక్కడా అవాంఛనీయమైన రాజకీయ అంశాలు చోటు చేసుకోలేదు. భారత రాష్ట్ర సమితి నేపథ్యంలో ఇటీవలి కేసీఆర్ ప్రసంగంలో కూడా దేశానికి సంబంధించిన పలు మౌలిక ప్రశ్నలు గొంతు విప్పాయి. దేశంలో పారే నదుల్లో 70 వేల టీఎంసీల నీళ్లు లభ్యమవుతున్నా అందులో పావు వంతు కూడా వినియోగించుకోలేని దుస్థితి ఇంకా ఎందుకుంది? అందరికీ 24 గంటల కరెంటు ఇవ్వగలిగిన వనరులున్న దేశంలో ఇంకా కరెంటు కోతలు, అంధకారంలో వేలాది గ్రామాలు ఎందుకు కునారిల్లుతున్నయన్నదే కేసీఆర్ సూటి ప్రశ్న.
స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకొంటున్న వేళ ఇంకా తెగని నదీ జలాల సమస్యలు, రాష్ర్టాల మధ్య వివాదాలు, నిరుద్యోగం, అన్నార్తుల ఆక్రందన, సామాజిక దుష్కృత్యాలు ఇంకా పెరిగి పోవటం పట్ల ఆందోళన ఆయన మాటల్లో వ్యక్తమైంది. మన తర్వాత స్వాతంత్య్రం పొందిన చైనా నుంచి కొవ్వొత్తులు మొదలుకొని భారీ యంత్ర పరికరాలు దాకా అనేక వస్తువులు దిగుమతి చేసుకొనే దుస్థితిలో దేశం ఉంది. డాలర్తో పోల్చుకున్నప్పుడు రూపాయి మారకం విలువ నానాటికీ పాతాళానికి పడిపోతున్నది. ఇలాంటి ఎన్నో మౌలికమైన దేశీయ సమస్యల పట్ల కేసీఆర్ స్పందించి పరిష్కార మార్గాలు సూచిస్తున్న తీరుని చూసి ఆయనను ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక భావి
భారత భాగ్యశిల్పిగా, నిజమైన దేశ ప్రేమికుడిగా, క్రాంత దర్శిగా దేశ ప్రజలు భావిస్తున్నారు. ‘ఒక పార్టీని పడగొట్టి మరో పార్టీ గద్దె నెక్కడం, ఆ పార్టీని పడగొట్టి మరో పార్టీ గద్దె నెక్కడం… రాజకీయమంటే ఇదేనా? దేశాన్ని తీర్చిదిద్దే రాజకీయ సంస్కృతి వచ్చి తీరాలి’ అన్న కేసీఆర్ మాటల్లో ఒక సార్వజనీన సత్యం ద్యోతకమైంది.
సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థిని పడగొట్టటానికి అలవి కాని వరాలు, అంతులేని వాగ్దానాలు, అర చేతిలో వైకుంఠాన్ని చూపిస్తుంటారు. కానీ భారత రాష్ట్ర సమితి నేతగా కేసీఆర్ చెబుతున్న ప్రతి మాట తెలంగాణలో కేవలం ఎనిమిదేండ్ల కాలంలో చేసి చూపించారు. ఆయన పట్ల ప్రజల్లో నెలకొన్న విశ్వాసానికి అదే గీటురాయి. మాటల్లో కుండబద్దలు కొట్టటం, చేతల్లో కొండ బద్దలు కొట్టటం తప్ప శుష్క ప్రియాలు, శూన్య హస్తా లు, అసత్యాలు, ఆకాశ పంచాంగాలు ఆయన నిఘంటువులో కన్పించవు. రాజకీయ జగత్ జెట్టీలను మట్టి కరిపించి అసాధ్యమనుకున్న తెలంగాణను సుసాధ్యం చేశారు కేసీఆర్.
దేశమంతా ఇక పింక్ టైడ్
దేశ సంపదను ఆశ్రిత పెట్టుబడిదారులకు దోచి పెడుతున్న ప్రభుత్వాలను కూలదోస్తూ- సమాజ సంక్షేమాన్ని పట్టించుకునే వామపక్ష భావజాలం గల పార్టీలకు లాటిన్దేశాల ప్రజలు పట్టం గట్టడం ప్రారంభించారు. దీనినే పింక్ టైడ్గా రాజనీతి విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ పింక్ టైడ్ కొంత తగ్గు ముఖం పట్టినట్టు కనిపించినప్పటికీ, మళ్ళా లాటిన్ దేశాలలో అలలు అలలుగా ఎగిసివస్తున్నది. 2018లో మెక్సికోలో, 2019లో అర్జెంటీనాలో , 2020లో బొలివియా, పెరు దేశాలలో 2021లో చిలీలో 2022లో కొలంబియా, బ్రెజిల్ దేశాలలో పింక్ టైడ్ ప్రభవించింది.
భారత దేశంలోనూ ప్రజలు అప్రమత్తమయ్యారు. మతవిద్వేష రాజకీయాలకు, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా జాగృతమవుతున్నారు. కేసీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం ప్రజల సంక్షేమాన్ని పట్టించుకునే కొత్త పొద్దును తెలియచేస్తున్నది.
వీళ్లకు పరిపాలన చేతకాదని అన్నవారే ఆయన తెచ్చిన సంస్కరణలను, పథకాలను కాపీ కొట్టవలసిన అనివార్యత ఏర్పడింది. దేశంలో ఎక్కడా లేని, ఎవరూ కలలో కూడా ఊహించని 24 గంటల కరెంటు తెలంగాణకే సాధ్యమైంది. రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పింఛన్లు, గృహ వసతి, విద్యా వైద్య సౌకర్యాలు, అత్యద్భుతమైన పారిశ్రామిక విధానం, నీటి ప్రాజెక్టులు, కార్మిక కర్షక ఉద్యోగ మహిళ వర్గాలకు ప్రాధాన్యం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఆలంబన… ఇలా ఒకటా, రెండా… అన్ని వర్గాలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కరుడు గట్టిన తెలంగాణ వ్యతిరేకులు సైతం నిబిడాశ్చర్యంతో పరికించే స్థాయికి తెలంగాణ చేరుకుంది. తెలంగాణలో సాధ్యమైన ఈ పథకాలు మా రాష్ర్టాల్లో ఎందుకు సాధ్యం కావన్న ప్రశ్న నేడు దేశాన్ని తొలుస్తున్నది.
అందుకే పొరుగు రాష్ర్టాల సరిహద్దుల్లోని ప్రజలు తమ ప్రాంతాలను తెలంగాణలో కలపమని ఉద్యమిస్తున్నారు. ఇది బీఆర్ఎస్ ప్రారంభానికి ముందే కేసీఆర్ సాధించిన తొలి విజయం. ఇదే సమయంలో వివిధ రాష్ర్టాల రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వివిధ ప్రాంతీయ పార్టీలు, మేధావులు ‘కేసీఆర్ ఆగే బడో, హమ్ తుమారా సాథ్ హై’ అని నినదిస్తున్నారు. ఈ నినాదం దేశం నలుమూలలా ప్రతిధ్వనించటం కేసీఆర్ మలి విజయం. బంకిం చంద్ర ఛటర్జీ తన వందేమాతర గీతంలో కోరుకున్న భారతం కేసీఆర్ నాయకత్వంలో దేశ ప్రజలకు చేరువయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ఇవాళ తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ. మన ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇవాళ భారత జాతి అభ్యుదయ పథ నిర్దేశకుడు. రండి… అందరం కలిసి నడుద్దాం. దేశానికి నాయకత్వం వహించే తెలంగాణ బిడ్డలుగా గర్విద్దాం.
శుభం భూయాత్
డాక్టర్ అయాచితం శ్రీధర్
98498 93238