తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969 నుంచి.., మలిదశ తెలంగాణ పోరాటం దాకా అవిశ్రాంతంగా పోరాడిన వారు వేణు సంకోజు. రాష్ర్టసాధన ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడమే గాక, తన కలం, గళం ద్వారా ప్రజా చైతన్యానికి పాటుపడిన యోధుల్లో నల్లగొండకు చెందిన కవి, రచయిత, వక్త, విమర్శకులు వేణు సంకోజు ఒకరు. స్నేహశీలతకు రూపుకడితే ఎలా ఉంటుందో అచ్చం అలా వేణు సంకోజు స్నేహానికి ప్రతీక. తెలంగాణవాదిగా, సాహితీవేత్తగా ఉద్యమకారుడిగా తెలంగాణ ప్రజలకు సుపరిచితం. ‘మనిషిగా పూచే మటి’్ట, ‘మనం’, ‘నేల కల’, ‘ప్రాణప్రదమైన’ మొదలైన కవితా సంపుటాలతో పాటు, ‘స్పర్శ’ కథల సంపుటితో తెలంగాణ సాహిత్యంలో తనదైన ముద్రవేసిన వేణు సంకోజుకు రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాశరథి సాహిత్య పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. ఈ నేపథ్యంలో వేణు సంకోజుతో ‘చెలిమె’ మాట-ముచ్చట.
మీ నేపథ్యాన్ని గురించి వివరిస్తారా..
నేను నల్గొండ జిల్లా చండూరులో పుట్టిన. అమ్మ శాంభవి. నాన్న వీరబ్రహ్మం. పుట్టింది చండూరులోనే అయినా బాల్యమంతా సికింద్రాబాద్ కంచర బస్తీలోనే గడిచింది. ఒకటి నుంచి పదో తరగతి (హెచ్ఎస్సీ) వరకు కళాసిగూడ ప్రభుత్వ హైస్కూల్లో చదువుకున్నా. తర్వాత పీయూసీ సికింద్రాబాద్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పూర్తి చేసిన. ఏవీ కాలేజీలో సాయంకాలం కళాశాలలో డిగ్రీ చదివిన. చిన్ననాడే మా నాయిన చనిపోవడంతో చదువులు కొనసాగిస్తూనే పెట్రోల్ బంక్ బాయ్గా ఇంకా అనేక చిన్నా చితక పనులు చేస్తూ.. చివరకు డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా పదవీ విరమణ చేసిన.
1969 తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు కదా! మీ అనుభవాలు చెప్పండి.
అవును, నేను 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న. సికింద్రాబాద్ సమీపంలోని రంగ్రేజీ బజార్లో, దర్గా దగ్గర బూరుగు మహదేవ్ హాల్లో1969 ఏప్రిల్ 4న ప్రత్యేక తెలంగాణ సభ జరిగింది. చాలా మంది తెలంగాణవాదులు ఆ సభలో పాల్గొన్నరు. దాంతో ఉద్యమకారులను చెల్లాచెదురు చేయటానికి పోలీసులు లాఠీఛార్జి చేసిండ్రు. అనేక మందిని అరెస్టు చేశారు. ఉద్యమ జ్వాలలు చల్లార్చడానికి ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించి కనబడితే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. నా మిత్రుడు ప్రకాష్ ఆ సమయంలో మా ఇంట్లోనే ఉన్నడు. ఉద్రిక్తత తగ్గిందని భావించి బయటకు వెళ్లిండు.. వెళ్ళిన కొద్ది క్షణాల్లోనే మా ఇంటి సమీపంలోనే ప్రకాష్ పోలీసుల తూటాలకు బలి అయ్యిండు. దగ్గర నుంచి గురిచూసి కాల్చటంతో మూడు తూటా లు ప్రకాష్ శరీరంలోకి వెళ్ళాయి. అక్కడికక్కడే నేలకొరిగాడు.
కిందపడ్డ ప్రకాష్ చేతిలో అగ్గిపెట్టె, దూది పెట్టి పోలీసులు అరాచకవాదిగా ముద్ర వేసే ప్రయ త్నం చేశారు. ప్రకాష్ మరణం నన్నెంతో కలచి వేసింది. ‘తెలంగాణ ప్రజాసమితి’ నిర్వహించిన సభల్లో తరచుగా పాల్గొనేవాడిని. మాపై పోలీసుల నిఘా పెరిగింది. ఒకరోజు మా ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఎన్నో విలువైన పుస్తకాలను ఎత్తుకెళ్లా రు. నన్ను, నా మిత్రుడు నరేష్ను పోలీసులు ఒక రహస్య ప్రాంతంలో విచారించారు. ఆధారాలు లభించకపోవడం వల్ల నన్ను వదిలి వేశారు.
మిమ్మల్ని ప్రభావితం చేసిన సాహితీవేత్తలెవరు?
నన్ను ఎక్కువగా ఆకర్షించింది శ్రీశ్రీ. అభ్యుదయ, విప్లవ రచయితలతో స్నేహం. ముఖ్యంగా కాళోజీ జీవితం, సాహిత్యం నా పై ఎంతో ప్రభావాన్ని చూపాయి. ‘వారీ… వేణూ! ఈ కవిత్వం నీకెట్లా పట్టుబడిందిరా?’ అనే ఆయన ప్రేమ పూర్వక పిలుపు ఇప్పటికీ నా చెవుల్లో మోగుతూనే ఉంటుంది. హైదరాబాద్, నల్లగొండ సాహిత్య సభలకు కాళోజీని అనేకసార్లు ఆహ్వానించాను. వారు వరంగల్లో నిర్వహించిన సభలకు అనేక మార్లు పోయిన.ఆయన హృదయ మార్దవం, ధర్మాగ్రహం నన్ను ఆకట్టుకున్నాయి. ఉద్యమ స్ఫూర్తిలో నాకు ఆదర్శమైన నగ్నముని, నా ఆత్మీయ మిత్రబృందం అమ్మంగి వేణుగోపాల్, వి.ఆర్.విద్యార్థి, అంపశయ్య నవీన్ మొదలగు వారి స్నేహం నాకు సాహితీ రంగంలో బలాన్నిచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఒక సైద్ధాంతిక భూమిక ఏర్పరచుకోవడానికి జయశంకర్ సార్ పరిచయం దోహదం చేసింది. విద్యాసాగర్రావు గారి జలవనరులు, తెలంగాణకు జరుగుతున్న వివక్షపై విశ్లేషణాత్మక ఉపన్యాసాలు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై వారి రచనలు మలిదశ తెలంగాణ ఉద్యమ కారుడిగా నా పై ఎంతో ప్రభావాన్ని వేశాయి.
మీ సాహిత్య ప్రస్థానాన్ని వివరించండి.
స్కూల్ విద్యార్థిగా ఉన్న రోజుల్లో జవహర్లాల్ నెహ్రూ మరణించినప్పుడు వారిపై ఒక ‘ఎలిజీ’ రాశాను. నాకు గుర్తున్నంత వరకు అది నా తొలి రచన. తర్వాత కాలంలో అనేక కవితలు వివిధ పత్రికల్లో అచ్చవుతూ వచ్చాయి.1995లో ‘మనిషిగా పూచే మట్టి’ నా తొలి కవితా సంపుటి. ఈ సంకలనాన్ని కాళోజీ ఆవిష్కరించారు. నా రెండవ కవితా సంపుటి ‘మనం’ 2001లో అచ్చయింది. 2008లో ‘ప్రాణప్రదమైన’, ‘నేల కల’ అనే రెండు కవితా సంపుటాలను వెలువరించాను. అప్పటికే మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చుతున్నది. ఆ ఉద్యమ ప్రభావం ఈ సంకలనాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కవిత్వంలో ఇమడలేని జీవితానుభవాలను, నేను చూసిన జీవితాలను కథలుగా మలిచాను. అవే ‘స్పర్శ’ కథల సంపుటిగా వెలువరించాను. కేంద్ర సాహిత్య అకాడమీ వారి కోరిక మేరకు సుద్దాల హనుమంతు జీవిత చరిత్ర రాశాను.‘తెలుగు నవలల్లో చిత్రించిన రాజ్యము మరియు రాజ్యాంగం’ అనే ఈ అంశంపై ఎంఫిల్ పరిశోధన చేశాను. శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా ‘ప్రజల పక్షాన ప్రతిజ’్ఞ నా సంపాదకత్వంలో వెలువరించాను. డిగ్రీ కళాశాలలో విద్యార్థుల రచనలతో ‘చలనం’ అనే పుస్తకాన్ని నా సంపాదకత్వంలో తీసుకొచ్చిన.
దాశరథి పురస్కారాన్ని పొందిన సందర్భంగా మీ స్పందన…
తెలంగాణకు జరుగుతున్న అన్యాయంలో సాహి త్య, సాంస్కృతిక వివక్ష, అణచివేత కూడా ఒకటి. తెలంగాణ సంస్కృతికి, భాషకు, ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గొప్పగా నిర్వహించుకున్న ప్రపంచ తెలుగు మహాసభలు మన వైభవాన్ని చాటిచెప్పాయి. తెలంగాణ ప్రభుత్వం మన సంస్కృతికి సాహిత్యానికి పెద్దపీట వేస్తున్నదని చెప్పడానికి ఎన్నో నిదర్శనాలున్నాయి.
బోనాలు, బతుకమ్మ పండుగలను ఘనంగా నిర్వహిస్తూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పట్టంగడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. సాహితీ వికాసానికి కూడా విశేష కృషి చేస్తున్నది. తెలంగాణ పునర్నిర్మాణం అంటే.. నీళ్లు, నిధులు, నియామకాలు మాత్రమే కాదు; సాహిత్య సాంస్కృతిక రంగాలు కూడా పునరుజ్జీవనం పొందాలి. ఆ క్రమంలో జన చైతన్యమే కవులు, రచయితల లక్ష్యం కావాలి. అట్లా ప్రజా చైతన్యం కోసం ఎంతగానో తపించిన మహాకవి దాశరథి పేరిట ఉన్న అవార్డు తీసుకోవడం నాకు ఆనందాన్నిచ్చింది. ఈ అవార్డుతో నా బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నా. దేశంలో నానాటికీ లౌకిక, ప్రజాస్వామిక విలువలు ప్రమాదంలో పడుతున్నాయి. అనేక రూపాల్లో ప్రజాస్వామిక విలువలపై దాడి జరుగుతున్నది. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. రాసే కలాలకు సంకెళ్లు వేస్తున్నారు. ఈ అప్రజాస్వామిక ధోరణులను ధిక్కరించటమే కాళోజీ, దాశరథి మార్గం. ఆ మార్గంలో నేటి తరం పయనించాలనీ, విలువలను పరిరక్షించుకోవాలని కోరుతున్నా.
ఇంటర్వ్యూ: సాగర్ల సత్తయ్య , 79891 17415
సాహిత్య వికాసంలో మీ కృషి…
నల్లగొండ, హైదరాబాద్ కేంద్రాలుగా ‘జయ మిత్ర’ సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రారంభించాం. ఈ సంస్థకు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా ఉన్నా. ‘జయ మిత్ర’ పక్షాన 50కి పైగా పుస్తకాలు ప్రచురించాం. తెలంగా ణ రచయితల వేదిక 2001లో నందిని సిధారెడ్డి అధ్యక్షుడుగా నేను ప్రధాన కార్యదర్శిగా ఏర్పడింది. 2002 జూలై 7న నల్లగొండలో ప్రథమ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించాం.
మలి తెలంగాణ ఉద్యమం గురించి…
మలిదశ తెలంగాణ ఉద్యమంలో నా వంతు పాత్రను నిర్వహించానని అనుకుంటున్నా. ముఖ్యంగా జనాల్లో చైతన్యం కలిగించడానికి నావంతు కృషి చేసిన. నల్లగొండ కేంద్రంగా ఏర్పడిన ఐక్య కార్యాచరణ కమిటీలో అధికార ప్రతినిధిగా నా వంతు బాధ్యతలు నిర్వహించిన. ఉమ్మడి నల్లగొండ జిల్లానే కాదు, తెలంగాణ వ్యాప్తంగా అనేక సభల్లో పాల్గొన్నా. ‘వీర తెలంగాణ’ పత్రిక సంపాదకుడిగా 18 నెలల పాటు పత్రిక వెలువరించడం ద్వారా భావజాల పరమైన చైతన్యాన్ని కలిగించాము. ఆ పత్రికను నాటి తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలైన ఆత్మగౌరవం, అవకాశాల్లో సమానత్వం సాధించడానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవశ్యకమని భావించాం. సుదీర్ఘ పోరాటాలు, త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించాం, ముందుకు పోతున్నాం. సంతృప్తిగా ఉన్నది.