జర్నలిస్టుల్లో కవులు తక్కువే. వార్తలు, కథనాల ఏరివేతలోనే వారి సమయం హరిస్తుంది. దొరికిన విశ్రాంతిలోనే తమ మదిలో కదిలే భావధార కోసం వచనాన్ని మరిచి పద్యంలోకి వెళ్లాలి. వేళాపాళా చూడని మనసు ఊరట కోసం నిద్రాకాలాన్ని చించి మరీ కవితలల్లాలి. అప్పుడే హద్దులు దాటి రాయలేని వార్తలు కవి వెంట ఇంటికొచ్చి ఆయన నిశ్వాసాల్లో కొత్త ఊపిరి పోసుకుంటాయి. వార్తకు యాజమాన్యం ఉంటుంది కానీ, కవితకు కవే యజమాని. ఇలా కవిత్వం బారిన పడిన పాత్రికేయుల్లో గార శ్రీరామమూర్తి ఒకరు.
జీవితమే పాత్రికేయంగా గడిపిన శ్రీరామమూర్తి కవిగా ‘నిజం’ అవతారమెత్తారు. జీవన గమనంలో చుట్టుముట్టిన భిన్న నేపథ్యాల, పార్శాల ఒత్తిళ్లకు, రాపిడికి ‘నిజం’గా కవిత్వం ఆయనకు ఒక రిలీఫ్. ఒక ముందడుగు. ఒక బాధ్యత. ఒక ఆయుధం కూడా. బతుకు ఎన్ని మలుపులు తిరిగినా, తెరువు ఎన్ని దారులు చూపినా తన కవిత్వపు జెండా రంగు, ఎత్తు, నిటారు ఏ మాత్రం మారనీయలేదు. కవిత్వంలో నాణ్యత ఎంత ముఖ్యమో నిబద్ధత అంతకన్నా ముఖ్యమని నమ్మిన కవి ఆయన. తన నమ్మికని నిలబెట్టే ధీర కవిత్వాన్ని, వెరుపులేని వ్యక్తీకరణను కలంలో నింపుకొన్న ‘నిజం’ నిజాన్ని నిక్కచ్చిగా ప్రకటించారు. అలా ఆయన ముద్రతో వచ్చిన మరో కవితా గుచ్ఛం ‘రంగు రంగుల సూర్యోదయాలు’.
నిజంలో ఐదు వందలకు పైగా నాలుగు పాదాల కవితలున్నాయి. ‘రెండు పూల మధ్య ఖాళీని/ పరిమళం పూరిస్తుంది/ ఇద్దరు మనుషుల మధ్య బంధాన్ని/ మతం నరుకుతుంది, ‘తినే పచ్చిక కంటే/ నెమరు ఎంతో రుచి/ వర్తమానం కంటే/ గతం మధురం’ ఇలా సాగే ఈ కవితల్లో వర్తమాన సమాజపు అన్ని రూపాలను, పోకడలను ఎత్తి చూపారు. ‘అన్ని చక్రాలూ/ నడిస్తేనే రథం కదిలేది/ దేనికేది కృతజ్ఞతలు చెప్పుకోనక్కర్లేదు/ బాధ్యతే అసలైన బండి’ అని చెప్తూ మనుషుల్లో చీలికల్ని నిలదీశారు.
శ్రీరామమూర్తిపై కవిత్వానిదెప్పుడూ పై చెయ్యే. ఆయన మూడ్ని దట్టంగా ఆవరిస్తుంది. అందుకే ‘విత్తనాలక్కర్లేని మనసు పొలం/ ఎల్లకాలం పండే ఆలోచనల క్షేత్రం, నిద్రలోనూ మేల్కొనేదే కన్ను/ చూపు దుప్పటి కప్పుకొని పడుకుంటుంది’ అని తన కవిత్వ చేతనను చెప్పుకోగలిగారు. కవిత్వంతో ఆయనది యాభై ఏండ్ల అనుబంధం. ఆయనలో భావుకతకు కొదువే లేదు. ముదిమిలో అది మరింత చిగురులు వేస్తోంది. ‘తీగకు, గోటికి లేని తీపి/ మీటే రాగానికి పూస్తుంది ఎలా/ ఇదే నిజమయ్యే అపురూప కల’ అని చాలాసార్లు తన మనసులోకి వెళ్లిపోతారు. అయితే ఆయన అక్కడే ఆగకుండా తన భావజాలం పిలిచినట్టు వెనక్కి వచ్చి పాలకుల తీరును ఎండగడతారు. ‘నిజంగా అభివృద్ధి చేస్తే/ సంక్షేమం అక్కర్లేదు/ సంక్షేమమే నడిస్తే/ అభివృద్ధి అడ్రస్ ఉండదు’ అంటూ చురకలేస్తారు. అందుకే ఆయన కవిత్వం రంగురంగుల సూర్యోదయమైంది.
కవిత్వాన్ని ఆయన ఎంత ఇష్టపడుతారో, అందులో నాణ్యతను అంతే కోరుకుంటారు. ‘కవిత్వమా! ఇంటింటి/ సుమానివై నువ్వెంత/ సులువో చెబుతావు/ నాణ్యత దగ్గర కొండెక్కి కూచుంటావు’ అంటూ నేటి కవిత్వంలోని పలుచదనాన్ని విమర్శిస్తూ ‘లోతు బావికే కాదు, భావానికీ అవసరమే/ దిగేవారు పైకి రాలేక/ గిల గిలా కొట్టుకోవాలి’ అని సూత్రీకరిస్తారు.
శ్రీరామమూర్తి ఆలోచనల్లో నవ్యత ఎప్పుడు కదలాడుతుంది. చెప్పే విషయంలోనైనా, చెప్పే విధానంలోనైనా తనకంటూ ఓ బాట ఉంది. అందుకే ‘అవే కిరణాలు మళ్లీ మళ్లీనా?/ అయితే అది ఉషోదయమెలా అవుతుంది?’ అని కొత్త ప్రశ్నలు వేస్తారు. సామాజిక విమర్శలో కవి కలం సదా సంసిద్ధమే. ‘కుక్క కరిస్తే మందు ఉంటుంది/ మతం కరిస్తే ఉండదు’, ‘మనువాడిన నాడే/ భవిత చూసుకోవలసింది/ బౌద్ధాన్ని విడనాడిన/ దుర్బుద్ధుల భారతం’ లాంటి కవితలు అందుకు సాక్ష్యం. చివరగా తానేంటో తెలిపేలా ‘నేను ప్రేక్షకుడనే కానీ/ వేదికుడను కాను/ నా మూలాలు కప్పిపెట్టి/ నటించలేను’ అంటారు. స్థూలంగా నిజం కవిత్వానికి ఆయన రాసిన ఈ కవితనే ఉదహరించవచ్చు.
అక్షరాల కూర్పుతో ఏర్పడ్డ వాక్యంలో రసాత్మకత ప్రధాన లక్షణం అంటారు. అయితే వాక్యం జనాత్మకం కూడా కావ్యమే అని ఈ కవి కొత్తగా చెప్పారు. ఎంత రస గుళికలైనా జనం ప్రమేయం లేని కళలకు ప్రయోజనం శూన్యమే అనే అర్థం ఇందులో గోచరిస్తున్నది. నిజం కవిత్వంలో రసాత్మకత ఉంది, జనాత్మకతా ఉంది.
– బి.నర్సన్ 94401 28169