‘కథలు వాలేందుకు కొమ్మలు లేని స్థితిలో గత నాలుగేండ్లుగా ముల్కనూరు ప్రజాగ్రంథాలయం కథల పోటీలు నిర్వహించి వందల కొత్త కథల రచనకు మూలమైంది. రచయితకు కాకుండా కథకే గుర్తింపునిచ్చి ఎందరో నవ యువ కథకులను ఈ అక్షరయజ్ఞంలోకి రాబట్టింది. ముల్కనూరు విద్యావంతులు, ఉన్నతోద్యోగులు తమ సాహితీ పిపాసను ఇలా తీర్చుకుంటూ తెలుగు కథ విస్తరించేదిశగా ఆదర్శనీయ పాత్రను పోషిస్తున్నారు. ‘నమస్తే తెలంగాణ’ పత్రికతో కలిసి వారు నిర్వహించిన కథల పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవం జూలై 9న హైదరాబాద్లో జరిగింది. రవీంద్రభారతి, తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు కథకుల సమ్మేళనంతో పులకించిపోయాయి.
ఆదివారం ఉదయమే రెండు తెలుగు రాష్ర్టాల నలు దిశల నుంచిరవీంద్రభారతి వద్దకు ఒక్కొక్క రచయిత చేరికతో పైడి జైరాజ్ హాల్ కలాల కూడలిగా మారిపోయింది. వచ్చిన కథకుల పరస్పర పరిచయాలు, అలాయి బలాయిలు, ప్రత్యక్షంగా చూస్తున్న అపురూపఘట్టాలు పండుగ శుభాకాంక్షలను తలపించాయి. రచయితలు, రచయిత్రుల రాకతో మధ్యాహ్నం సాహిత్య గోష్టి మొదలైంది. ఆషామాషీగా కాకుండా ఈ గోష్టి తెలుగు కథ వర్తమాన నడకను, భవిష్యత్తు అవసరాలను, ఆధునిక ధోరణుల ప్రమే యాన్ని, మారుతున్న జీవితాల్లోని మంచి చెడులు ఎలా ప్రతిబింబించాలో, నేటి సమాజానికి ఎలాంటి కథల అవసరం ఎంతున్నదో అనే భిన్న కోణాలపై అర్థ వంతమైన చర్చ జరిగింది. ముల్కనూరు ప్రజా గ్రంథా లయం సారథి వేముల శ్రీనివాసులు అధ్యక్షతన 4 గంటల పాటు ఆసక్తికరంగా చర్చించారు. తెలంగాణ కథలు కొంత మూస ధోరణిలో సాగుతున్నాయని, మారిన జీవన వైవిధ్యాన్ని కథల్లో ప్రతిఫలింప జేయా లని కోడూరి విజయకుమార్ కోరారు.
తమ అనుభవాలను పంచుకుంటూ నిర్వాహకులు రెండు ముఖ్యమైన విషయాలు చర్చించారు. ఒకటి.. కథా గమనం ఒకే తరహాలో నడవాలి. ఒకసారి ఒక మాండలికం, మరోచోట వ్యవహారం ఉపయోగించటం వంటివి మంచి కథలో కూడా పంటికింద రాళ్లలా తగులుతాయి. మరొక విషయం ఏమిటంటే కథ ఎప్పుడైతే పాఠకుల హృదయాన్ని తాకుతుందో అదే గొప్ప కథ అని అన్నారు. ప్రథమ బహుమతి పొందిన కథకు చివరి బహుమతి పొందిన కథకు మధ్య అంతరం చాలా తక్కువే అనీ, అన్నీ గొప్ప కథలే అని చెప్పారు.
ప్రథమ బహుమతి గ్రహీత హుమాయూన్ సంఘీ ర్ రాసిన ఇబ్లీస్ కథను సభికులు ప్రశంసిస్తూ కథాంశం ఎంపికపై రచయిత సాహసాన్ని కొనియాడారు. వివిధ స్థాయుల్లో బహుమతి పొందిన కథల రచయితలు తమ కథల పరిచయం చేసి, పోటీలో ఎంపికైనందుకు సంతృప్తిని, నిర్వాహకులకు కృతజ్ఞతలను తెలియ జేశా రు. ఒక్కో రచయితది ఒక్కో ఆలోచన, ఒక్కో కోణం. కథ నేపథ్యం, వారి అనుభవాలు చాలా విలువైనవి. రచయితల వైపునుంచి కూడా కొన్ని సూచనలు వచ్చా యి. కథల నిడివి అనే పరిధి రచయితల స్వేచ్ఛను కొం తవరకూ హరిస్తోందని, ఈ నిడివి అనే హద్దులో రాసే ప్రయత్నంలో కథ ముఖ్యమైన ఇతి వృత్తం సరిగ్గా వివరించలేకపోతున్నామని కొందరు చెప్పారు. యువ రచయితల కోసం ప్రత్యేక పోటీలు నిర్వహించాలని కొంద రు కోరారు. బాల సాహిత్యంపై ప్రత్యేక పోటీ నిర్వహిస్తే బాగుంటుందని ఉరిమిళ్ల సునంద అన్నా రు. ప్రతి రచయిత వెలిబుచ్చిన అభిప్రాయాలు, సూచనలను సభాధ్యక్షుడు శ్రీనివాసులు గుణాత్మకం గా స్వీకరిస్తూ వివరణా త్మక సమాధానాలు ఇచ్చారు.
కథకులను వయస్సుల వారీగా విభజించి ముప్ప య్యేండ్ల లోపు ఉన్న నలుగురైదుగురు కథకులను ఉద్దేశించి ‘మీరే రేపటి కథను బతికించే ప్రతినిధులు’ అన్న జొన్నలగడ్డ శ్రీరామచంద్ర మూర్తి మాటలు అందరికి నచ్చాయి. మొదటిసారి కథ రాశామని దాని కి బహుమతి రావడం ఎంతో సంతోషంగా ఉందని కొందరు యువకులు చెప్తూ పోటీ నిర్వాహకులు తమకిస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు.
భోజనానంతరం కథకులంతా రవీంద్రభారతి నుంచి బహుమతుల ప్రదాన వేదిక అయిన తెలుగు విశ్వవిద్యాలయం దాకా పాదయాత్రగా సాగడం ఓ అపూర్వ ఘట్టం. తెలుగు కథ వర్ధిల్లాలి అనే సందేశాన్ని చాటేలా ఈ యాత్ర సాగింది.
సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవ సభ కు ముఖ్య అతిథిగా వచ్చిన తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు తంగెడ కిషన్రావు తమ చతు ర భాషణంతో సభికులను రంజింపజేశారు. విశిష్ట అతిథిగా పాల్గొ న్న బలగం సినిమా దర్శకుడు ఎల్దండి వేణు కథలు వినోదభరితంగా ఉంటే చదువరుల్లో ఆసక్తి పెరుగుతుందన్నారు.
ఈ సభలో మరో మహత్తర ఘట్టంగా పేర్కొనదగ్గ అంశం అలిశెట్టి ప్రభాకర్కు నవకవితాభిమన్యు అనే మరణానంతర బిరుదు ప్రదాన సన్నివేశం. ముల్కనూరు సాహితీ పీఠం తరపున ఈ గౌరవపూర్వక సన్మాన పత్రాన్ని అలిశెట్టి సతీమణి భాగ్యకు అందించి అక్షరాలా లక్ష రూపాయలను వారి కుటుంబానికి ఆర్థిక తోడ్పాటుగా అందించారు. అలిశెట్టి కుటుంబానికి దక్కిన ఈ గౌరవానికి ప్రతీకగా ఉద్విగ్నభరితంగా సభికులంతా నిలబడి కరతాళధ్వనులు చేశారు. ముల్కనూరు సాహితీపీఠం సేవను పలువురు వక్తలు కొనియాడారు.
బహుమతి గ్రహీతలందరికి నగదు, శాలువా, మెమెంటోల బహూకరణ క్రమపద్ధతిలో నడిపించిన గోవర్ధన్రెడ్డి వ్యాఖ్యానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిందే. ఈ రకంగా ఒక అరుదైన సంకల్పంతో ముల్కనూరు గ్రామవాసులు ఒక గొప్ప చరిత్ర సృష్టించారు. ముల్కనూరు నుంచి ఇంత దూరం వచ్చి, ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడమంటే అంత ఆషామాషీ విషయం కాదు. ‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తం గా నిర్వహించిన కథల పోటీ విజేతల పండుగ ఇలా అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ మహత్తర కార్యక్రమానికి దీపస్తంభంగా నిలిచిన శ్రీనివాసులు నాయకత్వంలో ఆ బృందం భవిష్యత్తులో తెలుగు కథకు మరిన్ని కొత్త కాంతులు అందిస్తారని గట్టిగా నమ్మవచ్చు. చమురు తగ్గు తూ రెపరెపలాడుతున్న తెలుగు కథా దీపానికి తన చేతులందించి కాపాడుతున్న ముల్కనూరు ప్రజా గ్రంథాలయానికి, సాహిత్య పీఠానికి, వీటి నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని తెలుగు కథ తన చరిత్రలో లిఖించుకుంటుంది.
బి.నర్సన్ 9440128169