వర్తమాన సామాజిక రుగ్మతలను సాహసంతో, నిబద్ధతతో కథా వస్తువులుగా మలుచుకొని సాహితీ సృజన చేసిన కథా రచయిత్రి కోట్ల వనజాత. అవినీతి, లంచగొండితనం, బంధుప్రీతి లాంటి చీడపీడలను నిరసిస్తూ ఆమె అనేక కథలు రాశారు. ఆ కథల సంపుటమే.. ‘ఇత్తు’.
ఒక ప్రభుత్వ అధికారిణిగా ఉంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవినీతి గురించి రాయడం సాహసమే. అది ఆమె నిజాయితీకి, నిబద్ధతతకు తార్కాణం. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవలందించడానికి కాకుండా, వారిని పీడించడానికే తయారయ్యాయి. ప్రభుత్వ ఆఫీసులు బ్యూరోక్రసీ రెడ్ టేపిజానికి నిలయాలుగా మారాయి. ఎక్కడికక్కడ లంచాలిస్తేనే పనులు సజావుగా సాగుతాయి. ఈ క్రమంలో నిజాయితీ గల అధికారులు ఇమడలేని దుస్థితి. అందరిలా మారకపోతే అక్కడ బతకడం కష్టం. వేధింపులతో అతడ్ని ఊపిరాడకుండా చేస్తారు. అందుకే సత్తెన్నలాంటి నిజాయితీపరుడు మిగతావారిలాగా మారిపోక తప్పలేదు. అతను చేరదీసిన కొత్త ఉద్యోగి రవిని గిట్టనివారు దొంగకేసులో ఇరికిస్తారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన రవి ఎంతో మానసిక వేదనను అనుభవించి, మిత్రుల సహాయంతో బయటపడగలుగుతాడు. కేసులలోంచి బయటపడనివాళ్లు దయానంద్లా ఆత్మహత్య చేసుకుంటారు. అప్రమత్తంగా లేకపోతే ఒకరి అత్యాశకు ఇంకొకరు బలవుతారని చెప్పడానికి ‘బహుముఖం’ కథ ఒక ఉదాహరణ.
క్లర్క్గా చేరి క్వాలిఫికేషన్ పెంచుకున్న రవి, సస్పెన్షన్ కాలంలో ప్రైవేట్ కాలేజీలో ఇంగ్లిష్ లెక్చరర్గా పనిచేస్తాడు. కేసులోం చి బయటపడినా పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తుంటే, విసిగి గవర్నమెంట్ లెక్చరర్గా పరీక్ష రాసి, నెగ్గి లెక్చరర్గా వెళ్ళిపోతాడు. లంచగొండితనం గురించి.. ‘ఒక ఉద్యోగి ఒక చేత్తో తీసుకునే డబ్బు ఎన్నో చేతులకు పంచబడుతుంది. మరెన్నో నోళ్ళతో తినబడుతుంది. ఇంకెన్నో పొట్టలతో ఆరగించుకోబడుతుంది. అందుకే అది కనిపించని బహుముఖం’ అని ‘బహుముఖం’ కథలో రవి విశ్లేషించడం నేటి వాస్తవికతకు నిదర్శనం.
బతుకలేక పాలమూరు, ఆంధ్రా నుంచి వలస వచ్చే ఎంతోమంది శ్రమజీవులకు హైదరాబాద్ ఆశ్రయం ఇచ్చింది. ఆంధ్ర నుంచి వచ్చిన అక్కాతమ్ముళ్లు తెలంగాణ ఉద్యమం గురించి చర్చిస్తూ, అందులోని లాభనష్టాలను బేరీజు వేస్తూ, ఉద్యమాన్ని సమర్థించడం ‘చివరి గుడిసెలో గాజుకళ్లు’ కథలో కనిపిస్తుంది. ఇందులో కొడుకును కోల్పోయిన గొల్ల బుచ్చమ్మ దుఃఖం యధార్థం. తెలంగాణ ఉద్యమంలో ఏడు వందల మంది కొడుకులను కోల్పోయిన తల్లుల దుఃఖం నిజం. పోరాట పటిమను తమ పిల్లలకు నేర్పాలని కోరుకుంటూ రచయిత్రి ‘రాజన్న’ కథ రాశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పట్ల రచయిత్రికి ఉన్న అంకితభావాన్ని ఈ రెండు కథలు తెలియజేస్తాయి.
తిండిబెట్టక, నిర్బంధంగా బాలికతో వెట్టిచాకిరి చేయించుకునే పెద్దింటి మహిళకు బుద్ధి చెప్పిన కథ ‘తార్నామ్ కాయిచోరి’ కాగా, లైంగిక వేధింపులకు పాల్పడే దొరకు గుణపాఠం నేర్పిన మహిళ యుక్తి ‘నల్లతేళ్ళు’లో కనిపిస్తుంది. భర్త తాగుడుకు మరిగి కుటుంబాన్ని పట్టించుకోకపోతే కూరగాయలమ్ముకొని బతికే స్త్రీలు, ఆ కష్టాలు మరిచిపోవడానికి కల్లు తాగితే, ఆ కల్తీ కల్లుకు ప్రాణాలే పొగొట్టుకోవాల్సి వస్తుంది. ‘బతుకు సంత’లో చోటుచేసుకున్న విషాదమిది. అనాథలు, దిక్కులేని స్త్రీల దయనీయమైన జీవితాల గురించి ఈ కథలు వివరిస్తే, ఉన్నత వర్గ స్త్రీలను హెచ్చరించే కథ ‘ముచ్చట పెట్టాలె’. ఆడపిల్లలకు ఆస్తి మీద హక్కుంటే కుటుంబాలు రోడ్డున పడవని చెప్తుందీ కథ.
కుటుంబ, మానవ విలువలన్నీ మంటగలసి మార్కెట్ విలువ ఒక్కటే నిలిచిపోయిన మనుషుల్లోని క్రూరత్వాన్ని ‘మార్కెట్’ కథ చెప్తుంది. బాధ్యతలు పట్టించుకోని కుటుంబం, క్రమశిక్షణ లేని కుటుంబం ఎలా కకావికలమైపోయిందో ‘ప్రతి సగానికో దుఃఖం’ లో తెలియజేసిన విధానం మనసును కదిలిస్తుంది.
కోట్ల వనజాత కథలన్నీ విస్తృత వైవిధ్యంతో కూడుకున్నవి. అన్ని మల్టీ లేయర్స్ కథలే. ఒకే ఇతివృత్తంలో అనేక జీవన పార్శ్వాలు ఆవిష్కృతం కావడం అత్యాధునిక కథా లక్షణం. విభి న్న దృశ్యాలు ఒకదాని మీద మరొకటి ఓవర్లాప్ అయినట్టుగా విరుద్ధ అనుభవాలతో మనిషి జీవితం ఏకకాలంలో అనేకానేక సంఘటనల సమ్మిశ్రమమై రూపుగడుతుంది. ఏదీ స్థిరంగా ఉండదు. అన్నీ ముక్కలుగా కనిపిస్తుంటాయి. క్షణకాలపు ఆకస్మిక ఘటనలుగా జరిగిపోతుంటాయి. విభిన్న భావోద్వేగాలకు లోనుచేస్తుంటాయి.
ఇలాంటి సంక్లిష్ట జీవితాన్ని ఒకేఒక్క సూత్రంతో నిర్వచించలేం. బహుళత్వం నేటి వాస్తవం. జీవితం ఇందుకు మినహాయిం పు కాదు. అనేక విభిన్నతల సమాహారం. వైరుధ్యాల్లోంచి, తీవ్ర వైరుధ్యాల్లోకి మనుషులు ప్రయాణిస్తుంటారు. ఒక వలయంలోంచి, మరో వలయంలోకి విస్తరిస్తుంటారు. విముక్తి కోసం తండ్లాటకు ఇది సంకేతం. ఇదొక విషాద వైచిత్రి. ఈ వైచిత్రిని తెలుసుకోవడంలో కోట్ల వనజాత కొంతవరకు సఫలమయ్యారు.
తాను తెలుకున్న దాన్ని సృజనాత్మకమైన రీతిన ఇతరులకు తెలియజేప్పే ప్రయత్నంగానే రచయిత్రి కథా రచనను వాహికగా చేసుకున్నారు. ఆర్థిక, సామాజిక సంబంధాలు మనిషి జీవితాన్ని ఎలా నిర్ణయిస్తున్నాయో వాచ్యంగా కాక కథలో ఇమిడిపోయేట్టు చెప్పే కళాత్మక నైపుణ్యం కోట్ల వనజాత ప్రతిభను తెలియజేస్తుంది. ఇలా అనేక జీవిత సత్యాలను ఆవిష్కరించడం వల్లనే వీరి కథలను చదవాలి. మన అనుభవ పరిధిని మరింత విస్తృతం చేసుకోవాలి.
– కె.పి.అశోక్ కుమార్, 97000 00948