నల్లగొండ జిల్లాలోని కొలనుపాక అటు శైవ, వైష్ణవ దైవతాలు, ఇటు జైన, బౌద్ధ దైవతాలు కొలువైన క్షేత్రం. పలు రాజ వంశాలకు చెందిన రాజులు ప్రజారంజక పాలకులుగానే కాకుండా వారి అవసరాలు తీరుస్తూ, దైవచింతన, ఆలయాల అభివృద్ధి విశేషమైన దాన ధర్మాదులు చేశారు. పశ్చిమ చాళుక్యరాజైన త్రిభువనమల్ల ఆరవ విక్రమాదిత్యుని కాలంలో కొలనుపాకలో వేయించిన శాసనం ఆ దానాన్ని తెలియజేస్తున్నది.
చాళుక్య విక్రమశకం 50= క్రీస్తు శకం1125, విశ్వావసు సంవత్సరం, చైత్ర బహుళ తదియ, సోమవారం నాడు మహా మండలేశ్వర చాళుక్య గంగపెర్మాడి కుమార సోమేశ్వరదేవుని మహా ప్రధాని, కొల్లిపాక 7000 దండనాథుడైన మానవెర్గడ సాయిమయ్య కోరిక మేరకు నిజ రాజధానిలోని పానుపురాయి గ్రామాన్ని అంబరతిళక అంబికాదేవి అంగభోగ, రంగ భోగాలకు సర్వ సమస్య, సర్వబాధా పరిహారంగా ధారాపూర్వకంగా సమర్పించి శాసనం వేయించాడు. ఈ దానాన్ని నడిపించినవాడు కేశిరాజు ప్రెగ్గడ. ఈ దానం సర్వస్వామ్యం నుంచి అక్కబసదిని మినహాయించింది. శాసనంలో సాయిమయ్య దాన గుణం, పరాక్రమం, విశిష్టతలు పేర్కొనబడినాయి. అతడు నాలుగు సమయాలు పోషించినవాడుగా ‘హరిహర జిన బుద్ధ పదాంబురుహ సమద్భ్రమర నొప్పిందం సకళ వసుంధరగె చతుస్సమయ సముద్ధరణ’ నాలుగు ధర్మాల సముద్ధరణుగా పేర్కొనబడినాడు.
శాసనంలో చాళుక్య సోమేశ్వరుని శౌర్య ప్రతాపాలు వర్ణించబడినాయి. త్రికళింగాధిపతిగా కీర్తించబడినాడు. శత్రువులను యుద్ధంలో ఓడించి అతడి గజసైన్యాన్ని స్వాధీనం చేసుకొని విజయస్తంభాన్ని నాటించాడు.
ఇంకా ‘సమస్త భువన మహనీయ, మహిమోత్తుంగ, చాళుక్య గంగ, మహారాజాధిరాజ పరమేశ్వరం, వీర మహేశ్వరం, విజయలక్ష్మీ నివాస, దక్షిణదోర్దండం, ద్వాదశ మండళిక మండళిమార్తండం, ప్రతాపాక్రాంత నవఖండ భూమండల రాజ లీలా చమత్కృతాఖండళం, కోదండ చతుర్భుజం శృంగార మకరధ్వజం, త్రిభువనరంగ ప్రవర్తిత కీర్తి నర్తకీ నర్తన సూత్రధారం, శరణాగత వజ్రప్రాకారం, మూరురాయకలి బిరుద, కువర హృదయాకంపం త్యాగజగఝంపనర్థి, జనచింతితార్థ చింతామణి, సుభట మండలిక, మకుట చూడామణి కుంతళరాజ్యాభ్యుదయ కారణంబప్పన గంధవారణం శ్రీమన్మహామండలేశ్వరం’ అని ప్రస్తుతించబడినాడు. ఇంకా ద్రావిళ రాజు గజ, అశ్వ, పదాతి దళాలను ధ్వంసం చేసి అతని ఆయుధాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలుస్తుంది.
శాసనంలో దండనాథుడైన స్వామి (సాయిమయ్య) వర్ణన కూడా ఉన్నది. ఆ తర్వాత ప్రధాని అయినటువంటి కేశిరాజు గురు పరంపర వివరించబడింది. కానూర్గణం చెందిన చంద్రమాలాధారి అతని శిష్యుడు పద్మనందిసూరి. ఇతడు పద్మప్రభామునిగా కూడా పిలువడినాడు. అతని సోదరుడు మేఘచంద్ర సిద్ధాంత దేవుడు. అతని ప్రధాన శిష్యుడు మాధవేందు సిద్ధాంతదేవుడు. అతని శిష్యుడే కేశిరాజు. జైన శాసనపతి. ఈ శాసనస్తంభాన్ని నిలిపినవాడు. యథావిధిగా శాసనంలో మంగళ మహాశ్రీ, శాపోక్తులున్నాయి.
– భిన్నూరి మనోహరి