మలిదశ తెలంగాణ పోరాటంలో విద్యార్థులు, మేధావులు, రచయితలు తెలంగాణ వాదం కోసం ఎనలేని కృషి చేశారు. సకల జనులంతా ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర సాధనోద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుదీర్ఘ పోరాటం, అనన్య త్యాగాలతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నారు. దీనికి రాజకీయ పరిణతి, గత అనుభవాలు, నాయకత్వ వ్యూహం, నిబద్ధత ఎంతో ఉపకరించింది.
రాష్ట్ర సాధనోద్యమంలో భాగంగా తెలంగాణ రచయితలు తెలంగాణ యాస, భాషలో పనిగట్టుకొని, ప్రయత్నపూర్వకంగా రచనలు చేశారు. సీమాంధ్ర వలస పాలనలో ఈసడించుకున్న యాస, భాషలోనే సాహిత్యాన్ని సృష్టించి ఈ ప్రాంత ప్రత్యేకతను, విశిష్టతను చాటారు. తెలంగాణ గ్రామీణ జీవితం, సంస్కృతి ఉన్నతిని చాటారు. సాహితీకారులు తమ బాల్యం, తెలంగాణ జనజీవన సంస్కృతులను ఎత్తిపడుతూ కవితా సంపుటాలను విరివిగా తెచ్చారు. అలాగే సీమాంధ్ర వలసవాద పాలకుల వివక్షను, దోపిడీ పీడనలను నిరసిస్తూ జనంలో తమ రచనలతో చైతన్యం నింపారు. ప్రజలను ఏకతాటిపై నడిపించటంలో రచయితలు, కళాకారుల పాత్ర అమోఘమైనది. తెలంగాణ భాషా సంస్కృతుల ఔన్నత్యాన్ని చాటుతూ కవులు కవిత్వం, రచయితలు కథలు, మేధావులు వ్యాసాలను విస్తృతంగా రాశారు. ఈ రచనలను ప్రచురించేందుకు ప్రత్యేకంగా తెలంగాణ పత్రికల స్థాపనలు కూడా జరిగాయి.
తరతరాల చారిత్రక, సామాజిక కారణాల వల్ల ఆంధ్ర- తెలంగాణ రెండు ప్రాంతాల్లోనూ భిన్న సంస్కృతులు ఏర్పడి విభిన్నభాషాయాసలు ఏర్పడినాయి. ఫలితంగా సహజంగానే వైరుధ్య పూరిత ఘర్షణ అనివార్యంగా ఏర్పడింది. ఆ క్రమంలోంచే తెలంగాణ ‘అస్తిత్వవాదం’ ఒక ఉద్యమంగా, వాదంగా ఎదిగింది. ఈ వాదంలో ప్రాంతీయాభిమానం, భాషా సంస్కృతుల మీద అభిమానం తెలంగాణ సాహిత్యంలో గాఢంగా ప్రతిఫలించింది. తెలంగాణ పట్ల సీమాంధ్ర వలసపాలకుల వివక్ష, ఆధిపత్యంపై నిరసన, తెలంగాణలోని పల్లెల విధ్వంసం రచనా వస్తువుగా మారింది. నీళ్లను మళ్లించుకుపోవటం, భూములను ఆక్రమించుకోవటం, వ్యవసాయ భూములు పారిశ్రామిక వాడలుగా, రిసార్టులుగా మారిన క్రమాన్ని తెలుపుతూ రచయితలు, కవులు తెలంగాణ
‘గోస’ను రాశారు.
నిజాం వ్యతిరేక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో పాట ఏ విధంగా ప్రధాన పాత్ర వహించిందో, తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ పాట అటువంటి పాత్ర పోషించింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మలిదశ తెలంగాణ ఉద్యమానికి పాట కేతనమై నాయకత్వం వహించింది. గద్దర్, గూడ అంజయ్య, గోరటి వెంకన్న, అందెశ్రీ, మాస్టార్జీ పాట ప్రక్రియలో రచనలు చేశారు.
‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా- పోరు తెలంగాణమా’ అని గద్దర్ తెలంగాణను ఆవాహనం చేశాడు.
‘ఆంధ్రులేందిరో-వాళ్ల పాలనేందిరోవలసలేందిరో-వాళ్ల మోసమేందిరో’ అని గూడ అంజయ్య పాటతో గొంతెత్తాడు.
‘అయ్యోనివా నువ్వు అవ్వోనివా-తెలంగాణోనికి నువ్వు పాలోనివా..; ఇసుంట రమ్మంటే ఇల్లంత నాదంటివి..’ అని పాటలో సీమాంధ్ర వలస పాలకుల దుర్నీతిని తెలంగాణ కవులు ఖండించారు.
‘తెలంగాణ.. నిలువెల్ల గాయాల వీణ’ అన్నాడు అందెశ్రీ.
తెలంగాణ కవికి తన ఊరు మీద మమకారం ఎక్కువ. దాన్ని ఏలేశ్వర నాగభూషణాచార్య కవితలో.. ‘ఇప్పుడు పల్లె చిన్నెలు లేకుండా/ నా కళ్లలోనే పదిలంగా దాచుకొన్నాను’ అంటాడు. ఇంత గాఢంగా ప్రేమించినా పల్లె
భూములు పరాయి పాలయ్యాయని ‘సింగరేణి చిచ్చు’ కవితలో వఝల శివకుమార్ ఇట్లా అంటాడు…
‘మా ర్యాగళ్లల్ల కాలువెట్టి/ అటువెట్టి ఇటువెట్టి బహురూపుల భాగోతాలు గట్టి/ నీళ్లు దొబ్బి, ఊళ్లు దొబ్బి మా యవుసాన్ని/ చిల్లుల బొక్కెన చేసినందుకే బయటకి బొగ్గుబాయి పొక్కల్లోకి/ జారిన బంజరు బతుకులైనం…’ అని ఆగ్రహిస్తాడు.
నందిని సిధారెడ్డి ‘పెనుగులాట’ కవితలో…
‘ఉన్నతమైన ప్రేమలల్లుకోవాల్సిన ఇంట/ ఊసులు, బంతిపూల సొగసులు కావాల్సిన ఇంట; అన్యోన్య పరిమళాలు అవకాశాన్ని కుదపాల్సిన ఇంట/ కాపురం వికృత క్రీడా విశేషమైంది; కలిసి బతకాల్సిన చోట/ వివక్ష దోపిడీలు అశాంతిని రేపాయి’ అంటాడు.
‘మా జాగలు దోసి.. మమ్మల్నే జీతం పెట్టుకుంటిరి ఎడ్డేషం మాదాయే, వెట్టిచాకిరి మాదాయె’ అని పప్పుల రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇప్పుడు తెలంగాణ కవులు తెలంగాణ భాషలో జంకు గొంకు లేకుండా వివక్షను లెక్కచేయకుండా న్యూనతాభావాన్ని విడిచిపెట్టి రాశారు, రాస్తున్నారు.
‘మా ర్యాగడి భూములన్నీ గుంజుకున్నవ్/ మాకు నీళ్ల పారకమే తక్కువ; ఉన్నకాడికి నీవే గొంగడి జాపినవ్..’ అంటాడు ‘తొవ్వ’ కవితలో అన్నవరం దేవేందర్.
వాన రాగానే తెలంగాణ కవికి ఊరి చెరువు, దాని అందం జ్ఞాపకం వస్తాయి.
‘ఆనంక మా చెరువు చూడాలా సిక్కంగా కలిపి/ ఉట్టి మీదుంచిన గట్క కుండోలె వుంటది…’అని యెన్నం ఉపేందర్ అంటాడు.
ముదిగంటి ,సుజాతారెడ్డి
99634 31606