మహాకవి సి.నారాయణరెడ్డి స్వగ్రామం హనుమాజీపేటలో, సినారె పుట్టి పెరిగిన ఇంట్లో నెలకొల్పిన స్ఫూర్తికేంద్రం ‘కవితా కర్పూర క్షేత్రం’. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దక్షిణకాశి వేములవాడకు 8 కిలో మీటర్ల దూరంలో ఉన్నదీ గ్రామం. ఈ క్షేత్రం దర్శనీయ కేంద్రంగా వర్ధిల్లుతున్నది. మూలవాగు, నక్క వాగులతో పాటు నాంపల్లి నరసింహ క్షేత్రం, సిరిసిల్ల బతుకమ్మ చీరలు, ఎగువ, దిగువ మానేరు నదుల హొయలు, కన్నడ ఆదికవి పంపకవి, జినవల్లభుని యాది, మామిడిపల్లి సాంబకవి స్మరణ.. గూడూరి సీతారాం, మిద్దె రాములు… హనుమాజీపేట కవులు.. రచయితలు ఈ యాత్రకు అదనపు ఆకర్షణలు.
‘నారాయణరెడ్డి తెలుగు/ ఆరామంలో సుమించు ఆమని కాదే / లేరతనికి పోలిక / కర్పూరకళికగా వెలుంగు పున్నమిగాదే’ అంటారు డాక్టర్ ఎన్.గోపి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి గురించి చెప్తూ.. సినారె అనగానే ‘పంచెకట్టులోన ప్రపంచాన మొనగాడు’ అయిన ఒక ‘నిర్మలోజ్వల వసంతారామ కవితా సౌందర్యమూర్తి’ దర్శనమిస్తుంది. ఎనభై ఆరేండ్ల నిండు జీవితం గడిపిన అరుదైన వ్యక్తి. సమున్నత వ్యక్తిత్వంతో ‘కవి’ అన్న పదానికి ‘ఐకాన్’గా, నిర్వచనంగా నిలిచిన మనీషి.
బహుశా సినారె అనే ఒక ‘ఫెనామినా’ అక్కడ పుట్టి ఉండకపోతే, నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా లోని హనుమాజీపేట తెలంగాణలోని వేలాది పల్లెల్లో ఒకటిగా ఉండేది. తన పుట్టుక ద్వారా హనమాజీపేటకే కాక, రాజన్న కొలువున్న ఎములాడకు, ‘మానేరు మా కళ్ళకు ముత్యాల పేరు’ అంటు చెప్పిన సిరిసిల్లకు, ఉద్యమ క్షేత్రం కరీంనగర్ జిల్లాకు, తేజోభూమి తెలంగాణకు ఖ్యాతిని సంపాదించి పెట్టిన ‘ముద్దుబిడ్డ’, సిరిసిల్ల సిరివెలుగు సినారె.
తెలంగాణలో ఒక సామెత ఉన్నది, ‘ఎలా బతికాడో కాదు.. ఎలా మరణించాడో చూడు’ అని. సినారె మరణానంతరం వారి అంత్యక్రియలు చూసినట్టయితే ఆ విష యం తెలుస్తుంది. ప్రాంతాలకతీతంగా తెలుగువారంతా వారిని గుండెల్లో నిలుపుకొన్నారు. ముఖ్యమంత్రుల నుంచి దేశాధినేతల దాకా ఆయనను సమున్నతంగా గౌరవించారు. అన్ని గౌరవ సత్కారాలు పొందారు. వారి అంత్యక్రియల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు, ఈ సందర్భంగా చూపించిన గౌ రవం బహుశా దేశంలో మరే కవికి… సాహితీవేత్తకు దక్కలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అంతిమయాత్రలో ముందునడవడం, ఒక మహాకవికి ప్రభుత్వం ఇచ్చిన గొప్ప గౌరవమే.
మహాకవి సినారె హైదరాబాద్లో నివాసముంటున్నా తన ఊరితో, అక్కడి మనుషులతో అనుబంధాన్ని వదులుకోలేదు. అదే ఆయనను ఎనభైయేండ్ల వయస్సులోనూ నిత్య నూతనంగా నిలిపింది. ‘అమ్మగా సింగిరెడ్డి బుచ్చమ్మగా నను కనిపెంచిన హనుమాజీ పేట’ అంటూ తనకు జన్మనిచ్చిన హనుమాజీపేట గురించి, ‘అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు’ అంటూ తల్లికి వెలకట్టలేని స్థా నాన్ని రచనల్లో, నిజ జీవితంలో ఇచ్చిన సినారె ఏటా జనవరి 9, 10 తేదీల్లో తన స్వగ్రామానికి వెళ్లటం తనకు తానుగా ఏర్పరుచుకున్న నియమం. కన్నుమూసే వరకు దానిని పాటించారాయన. ఆ రోజున తన తల్లితండ్రులు సింగిరెడ్డి బుచ్చవ్వ-మల్లారెడ్డిలతో పాటు సతీమణి సుశీలమ్మల సమాధులను దర్శించి వారి యాదిలో గడిపేవారాయన. జనవరి 10 సుశీలమ్మ పుణ్య తిథి. ప్రపంచంలో ఎక్కడున్నా ఆరోజు హనుమాజీపేటలో ఉండాల్సిందే. వారితో ఎందరో సన్నిహితులు కూడా హనుమాజీపేటలో గడిపారు. నావంటి శిష్యులతో ఆ ఇల్లు కోలాహలంగా ఉండేది. ఆ రెండు రోజులు మానేరు తీరానికి, హనుమాజీపేటకు సద్దుల పండుగ.. ఎములాడ జాతర.
సినారె పుట్టి పెరిగిన ఇల్లు, పొలం హనుమాజీపేటలో ఉన్నాయి. వారి మరణానంతరం ఆ మహాకవి స్మృతి రాబోయే తరాలకు చైతన్యస్ఫూర్తిగా ఉండాలని కుటుంబ సభ్యులు సినారె పుట్టి పెరిగిన స్థలంలో అద్భుతమైన స్మృతి కేంద్రాన్ని నెలకొల్పారు. ఆ స్మృతి కేంద్రమే ‘కవితా కర్పూర క్షేత్రం.’
ఈ స్మృతి కేంద్రంలో విశాలమైన వేదికపై అతిపెద్ద పెన్నును, దానికి ముందు వేదికపై ఇత్తడితో చేసిన ఎనభై రెండు కిలోల పుస్తకం, తెరిచిన ఆ పుస్తకం పుటలో ‘పరుల కోసం పాటుపడని ఈ నరుని బతుకు దేనికని’ అన్న సినారె గజల్ చరణం ఉన్నాయి. ఈ పుస్తకం వెనుక ఎనభై రెండు కిలోల సినారె ఇత్తడి ఫొటో కనిపిస్తుంది.
రాజమండ్రిలోని కందుకూరి గృహం, విజయనగరంలోని గురజాడ గృహం, విజయవాడలో విశ్వనాథ ఇల్లును దర్శనీయ స్థలాలుగా, పుణ్యస్థలాలుగా భావించి దర్శిస్తున్నాం. తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాల్లో వ్యాపింపజేసిన సినారె కవన భూమి కూడా స్ఫూర్తి కేంద్రమే. వారాంతాల్లో వివిధ ప్రాంతాలను దర్శించాలనుకునే వారికి హనుమాజీపేట యాత్ర ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.
హైదరాబాద్ నుంచి ప్రారంభమైతే దారిలో వర్గల్ సరస్వతి అమ్మవారి దర్శనం, కొండపోచమ్మసాగర్ అందాలు, వేములవాడ రాజన్నను దర్శించుకొని అక్కడే బస చేయవచ్చు. అక్కడినుంచి 15 నిమిషాలు ప్రయాణించి హనుమాజీపేటలోని ‘కవితా కర్పూర క్షేత్రం’ చేరుకోవచ్చు. తిరుగు ప్రయాణంలో నాంపల్లి క్షేత్రంతో పాటు గిరిజన మ్యూజియం చూడొచ్చు. తెలుగువారి కవనభూమి ’కవితా కర్పూర క్షేత్రం’ పిలుస్తోంది….! రండి…!
– పత్తిపాక మోహన్ 99662 29548