మన పండుగలలో బతుకమ్మ పండుగకు ఒక విశిష్టత ఉన్నది. ఆశ్వయుజ మాసం ముందు అమావాస్య నాడు పెత్ర అమావాస్య నుంచి మొదలుపెట్టి 9 రోజులు రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ఘనంగా జరుగుతుంది. బతుకమ్మ పండుగ దసరా నవరాత్రుల పండుగకు ముందు నుంచే మొదలవుతుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే, మొత్తం తొమ్మిది రోజులు, తొమ్మిది పేర్లతో బతుకమ్మ పూజలందుకుంటుంది.
అయితే తెలంగాణ వ్యాప్తంగా జరుపుకొనే ఈ బతుకమ్మ పండుగను ఒక అన్యాయమైన, దగాపడిన అబలను చల్లగా బతుకమ్మా అంటూ దీవి స్తూ, ఒక స్త్రీమూర్తి గురించి స్త్రీలందరూ కలిసి చేసుకునే పండుగ. ఈ స్త్రీమూర్తి బతుకమ్మను రకరకాల పూల తో అలంకరించి పూజిస్తారు. రంగురంగుల పూలను తీసుకొచ్చి అందమైన ఆకారంలో ఒక గోపురంలా పేర్చి దానిమీద పసుపు గౌరమ్మను పెట్టి పూజించడం, రోజుకొక్క నైవేద్యం సమర్పించడం ఈ పండుగ విశిష్టత. దీన్ని పూల పండుగ అని కూడా అంటారు. స్త్రీలు, యువతులు అందమైన వస్ర్తాలు ధరించి బతుకమ్మ చుట్టూ చప్పట్లు చరుస్తూ పాటలు పాడుతారు. ఈ బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో, బతుకమ్మ పండుగ వచ్చి భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని తెలియచేసే పండుగ. స్త్రీలు బొడ్డెమ్మను మట్టితో చేసి, దుర్గాదేవి బొమ్మను బతుకమ్మతో పాటు చేసి నిమజ్జనం చేస్తారు.
బొడ్డెమ్మతో మొదలుపెట్టి ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకూ ఇలా దేని ప్రత్యేకత దానిదే. తొమ్మిది రోజులపాటు కొనసాగే ఈ పండుగలో, గౌరమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ మహిళలు తమ కష్టసుఖాలు, చరిత్ర, పురాణాలు మేళవిస్తూ రకరకాల పాటలతో పాడే బతుకమ్మ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.
బంతి, చేమంతి, తంగేడు, రుద్రా క్ష, కుంబడి వీరా, మందారం, గడ్డిపూ లు మొదలైన పూలతో బతుకమ్మను త్రికోణంగా పేర్చి, దానిపైన పసుపు ముద్దను ఉంచి, దీనినే బతుకమ్మ దేవ త గౌరమ్మగా భక్తితో కొలుస్తారు. తొమ్మిదవ రోజు అంటే పండగ చివరి రోజు ఎంతో కన్నుల పండుగగా ఉం టుంది. రకరకాల పూలతో బతుకమ్మ ను పెద్దగా పేరుస్తారు. ఈరోజు ఆడవాళ్లు చాలా ఉత్సాహంగా ఆటపాటలతో సంబురాలు చేసుకుం టూ గౌరమ్మను పూజిస్తారు. అలాగే పెద్ద బతుకమ్మ పక్కన చిన్న గౌరమ్మను కూడా పెట్టి పూజించడం విశేషం. ఈ రోజు ఆఖరిరోజు కాబట్టి చీకటి పడే వరకు ఆటపాటలతో గడుపుతారు.
పెద్ద బతుకమ్మ రోజు అందరూ ఆనందంతో బతుకమ్మను కీర్తిస్తూ, ఆడి ఎంతో భక్తి శ్రద్ధలతో చెరువులో నిమజ్జనం చేస్తారు. తొమ్మిది రోజులపాటు ప్రతిరోజూ ఒక్కోరకమైన నైవేద్యం సమర్పిస్తారు మొదటి ఎనిమిది రోజులు నైవేద్యం తయారీలో ఆడ, మగ అంద రూ పాల్గొంటారు. సద్దుల బతుకమ్మ రోజు నైవేద్యం మహిళలు తయారుచేస్తారు.
ముఖ్యంగా ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయం, ఇతరులకు జరుగకూడదని, స్త్రీ ఔన్నత్యాన్ని చాటి చెబుతూ, చల్లగా బతుకమ్మా అని దీవిస్తూ జరుపుకొనే పండుగ ఇది. అందుకే ఈ బతుకమ్మ పండుగ, పండుగలన్నింటిలో, విభిన్నమైనది, విశిష్టమైనది.
(అక్షరయాన్ సౌజన్యంతో)
-డా. రాజ్యశ్రీ కేతవరపు