ఈ ఏడాది నోబెల్ బహుమతుల ప్రకటన – మానవులను పీడిస్తున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై దృష్టి సారించేలా, ఆలోచనాత్మకంగా ఉన్నది. ఉదాహరణకు ‘సోషల్ మీడియా’పై మరింత చర్చను ముందుకు తెచ్చింది. చుట్టమై వచ్చి దయ్యమై పట్టుకున్నడని సామెత! సోషల్ మీడియా మొదట భావవ్యక్తీకరణ స్వేచ్ఛను జనబాహుళ్యానికి అందుబాటులోకి తెచ్చిన తీరు ప్రశంసనీయమైనది. ఇప్పటికీ ఆ పార్శాన్ని గుర్తించవలసిందే. కానీ ఇప్పుడది నకిలీ వార్తలతో, అబద్ధాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలలో ఒకరైన మేరియా రీసా నకిలీ వార్తలను ప్రసారం చేయడంలో ఫేస్బుక్ బాధ్యతా రాహిత్యాన్ని ఏకిపారేసిన తీరు గమనార్హమైనది. రీసాతో పాటు రష్యాకు చెందిన పాత్రికేయ దిగ్గజం దిమిత్రీ మురటోవ్కు కూడా శాంతి బహుమతి లభించింది. అయితే రష్యా, ఫిలిప్పైన్స్లోని ప్రభుత్వ వ్యతిరేక పాత్రికేయులకే ఈ శాంతి బహుమతి దక్కడం వల్ల నోబెల్ కమిటీ తాటస్థ్యం ప్రశ్నార్థకమవుతున్నది.
ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన డేవిడ్ కార్డ్ కూలీల వేతనాలకు సంబంధించి చేసిన పరిశోధన కూడా సమాజంలో స్థిరపడిన అపోహలను తొలగించేదిగా ఉన్నది. కనీస వేతనాలు పెంచడం వల్ల కార్మికుల సంఖ్య తగ్గదని ఆయన పరిశోధనల్లో వెల్లడైంది. కొత్తగా వలస వచ్చిన కార్మికుల వల్ల అంతకు ముందు వచ్చిన వారికే ఇబ్బంది కలుగుతుంది తప్ప, స్థానికుల ఆదాయాలకు ముప్పు వాటిల్లదని కూడా ఆయన పరిశోధన ద్వారా తెలిసింది. కార్డ్తో పాటు నోబెల్ బహుమతిని పంచుకున్న ఆంగ్రిష్ట్, ఇంబెన్స్ కొత్త పరిశోధనా విధానాలకు బాట వేయడం కూడా ప్రశంసనీయం. జాంజిబార్ నుంచి చిన్ననాడే ఇంగ్లండ్కు వలసపోయిన నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నాహ్కు నోబెల్ సాహిత్య బహుమతి ఇవ్వటం వల్ల వలస జీవుల పరిస్థితిని ప్రపంచం దృష్టికి తీసుకువచ్చినట్టయింది.
భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి మొదటిసారిగా వాతావరణ పరిశోధకులకు లభించడం విశేషం. ఈ బహుమతి దక్కిన ముగ్గురిలో మనాబీ, హాసెల్మాన్ సాగించిన పరిశోధన భూగోళం వేడెక్కడానికి సంబంధించినది. కాగా గియర్గియో పరీసి పరిశోధన భౌతిక వ్యవస్థలలోని అవ్యవస్థ, హెచ్చుతగ్గులకు సంబంధించినది. శరీరధర్మ శాస్త్రం లేదా ఔషధ రంగంలో – డేవిడ్ జూలియస్, షాన్ ఫ్రాన్సిస్కో, ఆర్డెమ్ పటాపోషియం కృషి వల్ల బాధానివారణ చికిత్సలో పురోగతి సాధించవచ్చు. రసాయన శాస్త్రంలో బెంజమిన్ లిస్ట్, డేవిడ్ మెక్మిలన్ పరిశోధన మూలంగా పర్యావరణహిత ఉత్ప్రేరకాలను సులభంగా రూపొందించడం వీలవుతున్నది. నోబెల్ బహుమతుల సంగతెలా ఉన్నా, మానవాళిని చుట్టుముట్టిన అనేక సమస్యలు స్వయంగా సృష్టించుకున్నవే అనేది గ్రహించాలి. మానవులు తమ నడవడికను మార్చుకుంటే చాలా వరకు సమస్యలు పరిష్కారమవుతాయనే చర్చ సాగించవలసిన సందర్భమిది.