రైలెక్కగానే.. సీటు వెతుక్కోవడం.. పక్కసీట్లోకి ఎవరొస్తారో తెలుసుకోవడం.. సాటి ప్రయాణికులతో కబుర్లాడటం.. చిరుతిళ్లు లాగించడం.. నిద్దురోవడం.. ఇదే! ఆసోంలోని సిల్చార్-లామ్డింగ్ రూట్లో రైలెక్కితే మాత్రం ఇవేమీ చేయలేరు! కిటికీకి కళ్లప్పగించేస్తారు.. కునుకు పాట్లకు మంగళం పాడతారు.. నసగాళ్లు తగిలితే వదిలించుకుంటారు.. అడుగడుగునా పరవశింపజేసే ప్రకృతిని ఆస్వాదిస్తారు.. ఊరూరుకీ దర్శనమిచ్చే అద్భుతాన్ని జ్ఞాపకంగా గుండెల్లో పదిలపరుచుకుంటారు. అసోంలో ప్రకృతికి ఎవరైనా దాసోహం అయిపోతారు. అక్కడి కొండల్లో, లోయల్లో దాగి ఉన్న అందాలను ఆస్వాదించాలంటే సిల్చార్ నుంచి లామ్డింగ్ వరకు రైల్లో ప్రయాణించాల్సిందే! 199 కిలోమీటర్ల రైలు మార్గంలో అడుగడుగునా విశేషాలే!! ఓ చోట జలపాతం పలకరిస్తుంది.
అది దాటామో లేదో.. పిల్లకాల్వ తననూ చూడమంటూ పరిగెత్తతూ దర్శనమిస్తుంది. ఇంతలోనే మేమున్నామంటూ సొరంగాలు దూసుకువస్తాయి. రైలంతా చీకట్లను కమ్మేస్తాయి. చెవుల్లో వింత శబ్దాలను తోసేస్తాయి. సొరంగం దాటిన కాసేపటికే.. భారీ వంతెన రైలు చుక్చుక్లకు దడేల్ దడేల్ మంటూ వంతపాడుతుంది. 21 టన్నెళ్లు, 79 భారీ వంతనెలు, 300 వరకు చిన్న బ్రిడ్జీలు దాటుకుంటూ రైలు వెళ్తుంటుంది. ఒకచోట దాదాపు 3.25 కిలోమీటర్ల పొడవైన సొరంగం ఉంటుంది. మరోచోట రైలు మొదటి భాగం ఒక సొరంగంలో ఉంటే రెండో భాగం మరో సొరంగంలో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ ప్రయాణంలో అసోం పల్లెలు కోకొల్లలుగా కనిపిస్తాయి. వెదురుతో నిర్మించిన ఆవాసాలు వారి జీవనశైలిని ప్రతిబింబిస్తాయి. ఇన్ని వింతల మధ్య సాగే సిల్చార్-లామింగ్ ప్రయాణం గమ్యానికి చేరుకునే సరికి జీవితానికి సరిపడా అనుభూతులను ఇస్తుంది.