కుక్కపిల్లలంటే ఇష్టమైతే ఏం చేస్తాం? తెచ్చి పెంచుకుంటాం. లేదంటే, చుట్టుపక్కల ఎక్కడైనా కనిపిస్తే ఆహారం అందిస్తాం. కానీ, ఆ ముగ్గురు స్నేహితులు మాత్రం వాటి దత్తతకోసం ‘పాగా’ అనే సంస్థను ప్రారంభించారు. వీధి కుక్కలు, పిల్లులతో కలిసి జంతు ప్రేమికులు యోగా చేసేలా ఓ వినూత్న విధానాన్ని రూపొందించారు.
కుక్కను ప్రేమగా నిమిరిన ప్రతిసారీ మనలోని మానసిక ఆందోళన ఎంతోకొంత తగ్గుతుంది. పిల్లి సమక్షంలో ఒత్తిడి దూరం అవుతుంది. అసలే, ఆధునిక జీవితంలో ఒత్తిడి బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతున్నది. కొవిడ్ సమయంలో అయితే, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు తయారైంది పరిస్థితి. ఆ బాధితుల జాబితాలో తానూ ఉండేదాన్నని చెబుతుంది ‘పాగా’ వ్యవస్థాపకుల్లో ఒకరైన శుభశ్రీ మాధవన్. ఆ ఒత్తిడిని చిత్తు చేయగల శక్తి మూగజీవాలకు ఉందని ఆమె నమ్మింది. స్నేహితులతో తన అనుభవాలు పంచుకుంది.
అలా పుట్టుకొచ్చిన సంస్థే.. పాగా. వీధి కుక్కపిల్లలు, పిల్లులతోపాటుగా యోగా తరగతులు నిర్వహించడం ఈ సంస్థ ప్రత్యేకత. స్వాతి రేణుగోపాల్, సింధుజ కృష్ణకుమార్తో కలిసి శుభశ్రీ మాధవన్ ‘పాగా’ను స్థాపించారు. ఈ ముగ్గురూ చెన్నైలో ఉంటారు. విదేశాల్లో ఇప్పటికే మేకలతో కలిసి యోగా చేసే పద్ధతి ప్రాచుర్యం పొందింది. కుక్కలూ పిల్లుల అరికాలిని ఆంగ్లంలో ‘పా’ అని పిలుస్తారు. వాటితో కలిసి యోగా చేస్తారు కాబట్టి ‘పాగా’ అని సంస్థకు నామకరణం చేశారు. యోగాకు వచ్చిన ప్రతి వ్యక్తికి కనీసం ఒక కుక్కపిల్లను ఇస్తారు.
వాటిని ఒక పద్ధతిలో పట్టుకుని ఆసనాలు వేయాలి. ‘ఇది మనసుకు సాంత్వన కలిగించే ప్రక్రియ’ అంటారు వ్యవస్థాపకులు. ఈ తరగతులను ‘పాగా’ ఇన్స్టా పేజీలో లైవ్గా చూడొచ్చు. కార్యక్రమం పూర్తయ్యాక.. అవసరమైన దరఖాస్తులు నింపి, నచ్చిన కుక్కపిల్లను ఇంటికి తీసుకుపోవచ్చు. ఇలా, ఇప్పటి వరకూ 50కి పైగా కుక్క పిల్లలు దత్తతకు వెళ్లాయి. యోగా తరగతుల టికెట్లో కొంతసొమ్ము, అప్పటివరకూ ఆ కుక్కపిల్లలకు నీడనిచ్చిన షెల్టర్లకు వెళ్తుంది.
అక్కడినుంచే…
శుభశ్రీ, సింధు, స్వాతి… ముగ్గురూ ఇంటర్ అయిపోగానే బీబీఏలో చేరారు. స్వాతికి కుక్కపిల్లలంటే ఇష్టం. కానీ, ఇంట్లో పెంచుకోవడానికి అమ్మానాన్న ఒప్పుకోలేదు. కావాలంటే ఏదైనా షెల్టర్కి వెళ్లి వాటితో ఆడుకోమని చెప్పేవారు. అంతదూరమూ వెళ్లి.. వాటికి స్నానం చేయించేది, పరిసరాల్ని శుభ్రం చేసేది, ఆహారం అందించేది. తనతో పాటు నెమ్మదిగా స్నేహితురాళ్లనూ తీసుకెళ్లడం ప్రారంభించింది. ఉద్యోగాల్లో చేరాక కూడా ముగ్గురూ ఈ వ్యాపకాన్ని కొనసాగించారు. కొవిడ్ సమయానికి ఆ నేస్తాలు ఉద్యోగాల్లో ఉన్నారు. కానీ, కరోనా ప్రభావంతో కెరీర్ ఇబ్బందిలో పడింది. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడిని అనుభవించారు.
మూగ జీవాల సమక్షంలో ఉన్నప్పుడు గుండె తేలికపడేది. దీంతో, తమలానే ఒత్తిడికి గురవుతున్నవారి కోసం పాగా సంస్థను ప్రారంభించారు. తొలిదశలో జంతు ప్రేమికులైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సాయం తీసుకున్నారు. వాళ్ల కోసం యానిమల్ షెల్టర్లోనే యోగా తరగతులు నిర్వహించి, సామాజిక మాధ్యమాల్లో వీడియోలు అప్లోడ్ చేశారు. అనూహ్య స్పందన వచ్చింది. అలా తొలుత చెన్నైలో వారాంతాల్లో తరగతులు జరిపేవారు. ఎవరైనా అడిగితే ఆ కుక్కపిల్లలను దత్తత ఇచ్చేవారు. పిల్లులతోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. చెన్నైతో పాటు బెంగళూరు, ముంబై, కోయంబత్తూర్లలో ఇప్పటికే సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్, త్రివేండ్రంలలోనూ ప్రారంభించారు.
‘అడాప్ట్… డోంట్ షాప్ (కొనకండి. దత్తత తీసుకోండి)’ అనేది పాగా నినాదం. చాలా మంది కుక్కలు, పిల్లుల పట్ల ఇష్టంతో బోలెడు డబ్బు పెట్టి విదేశీ జాతులు కొంటున్నారు. దానికి బదులు ఏదైనా దేశీ కుక్కపిల్లను దత్తత తీసుకుంటే.. ఆ డబ్బుతో దీనికి జీవితాంతం అన్నం పెట్టొచ్చంటారు శుభశ్రీ. ప్రస్తుతం బ్లూక్రాస్తో పాటు వివిధ నగరాల్లోని యానిమల్ షెల్టర్లతో కలిసి పనిచేస్తున్నది పాగా. నానాటికీ తీవ్రం అవుతున్న వీధికుక్కల సమస్యకు ప్రేమపూర్వక పరిష్కారం.. పాగా.
…? లక్ష్మీహరిత ఇంద్రగంటి
చిన్న యాదగిరి గౌడ్