Tribali | గిరిజనులు నగరీకరణకే కాదు, ప్రభుత్వ వ్యవస్థలకు కూడా దూరంగా ఉంటారు. చట్టాల పట్ల అవగాహన కూడా తక్కువే. ఫలితంగా అనేక రకాల మోసాలకు గురవుతారు. ఎంతో పీడనకు లోనవుతారు. మారుమూల గిరిజనులు తమ రోజువారీ జీవితంలో కనీసం ఆరు రకాలైన ప్రాథమిక హక్కులను కోల్పోతుంటారని చెబుతారు నీహారిక నాయర్. తన వయసు పట్టుమని పదిహేడేండ్లు కూడా ఉండదు. సొంతూరు బెంగళూరు.
చదువుతున్నది పదకొండో తరగతే. అయితేనేం! ‘ట్రైబలి’ కార్యక్రమంతో కేరళ, కర్ణాటక రాష్ర్టాల గిరిజనులకు అండగా నిలుస్తున్నారు. ఎనిమిదో తరగతి నుంచే నీహారిక గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్నారు. ఐక్యరాజ్య సమితి వేదిక మీద సైతం గళం వినిపించారు. గిరిజనులకు ప్రభుత్వ పథకాలు అందేలా చేయడం, వారి హక్కుల గురించి అవగాహన కల్పించడం, ఆర్థిక సాయం అవసరమైన వారి కోసం విరాళాలు సేకరించడం, పోషకాహారం వండుకునేందుకు వీలుగా సోలార్ కుక్కర్స్ పంచడం… ఇలాంటి కార్యక్రమాలెన్నో ట్రైబలి తరఫున జరుగుతున్నాయి.
మరోవైపు వారి ప్రాచీన విజ్ఞానం, నైపుణ్యం ఆధునిక సమాజానికి అందించే ప్రయత్నమూ చేస్తున్నారు. ఇందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. గిరిజనుల ఆచార వ్యవహారాలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు వీలుగా వర్చువల్గానూ ఓ ప్రాజెక్టు రూపొందించాలన్నది తన ఆశయం. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాల పైనా దృష్టి సారించారు నీహారిక.