Sircilla | ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు కుబేరుల పిల్లలే చేయాలా? లేదు. నిఫ్ట్ను తలపించే సంస్థలు రాజధానిలోనే ఉండాలా? కానే కాదు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని ఫైన్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు తమదైన కళా ప్రతిభతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. అంతర్జాతీయ పత్రికలకు ముఖచిత్రాలు ఇస్తున్నారు. జాతీయ వేదికల మీద సత్తా చాటుతున్నారు.
సంప్రదాయ చదువులు విద్యార్థులను పరాధీనులను చేస్తున్నాయి. గుమస్తా కొలువులకు మాత్రమే పనికొచ్చేలా తీర్చిదిద్దుతున్నాయి. కాబట్టే, తెలంగాణ సర్కారు.. సృజనాత్మక విద్యకు పెద్దపీట వేస్తున్నది. అందుకు నిలువెత్తు సాక్ష్యం.. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని.. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటైన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ. ఇక్కడ 150 మంది విద్యార్థినులు తమకు ఆసక్తి, అభిరుచి ఉన్న రంగంలో శిక్షణ పొందుతున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్,ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, ఇంటీరియర్ డెకరేషన్, ఫొటోగ్రఫీ, డిజిటల్ ఇమేజింగ్.. దేనికదే ప్రత్యేకం. ఒక్కో విద్యార్థి మీదా రూ.15 లక్షలు నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు చేస్తున్నది సర్కారు. అత్యా ధునిక ల్యాబొరేటరీ సిద్ధం చేశారు. ఎగ్జిబిషన్లు, పోటీలకు వెళ్లాలనుకునేవారికి సకల వసతులూ కల్పిస్తారు. ఆ సృజనాలయం సానబట్టిన ఆణిముత్యమే గుగులోతు మమత.
సిరిసిల్ల ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫొటోగ్రఫీ కోర్సు చేస్తున్న మమతకు ఈ మధ్యే అంతర్జాతీయ గుర్తింపు లభించింది. తను తీసిన ఓ గిరిజన మహిళ ఫొటోను ఫ్యాషన్ మ్యాగజైన్ ‘వోగ్ ఇటాలియా’ ముఖచిత్రంగా ప్రచురించింది. మంత్రి కేటీఆర్ ఆ కవర్ పేజీని ట్విట్టర్లో పోస్ట్ చేసి మరీ ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేకంగా అభినందించి జ్ఞాపికను అందించారు. కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండలం, బంజెపల్లి మమత సొంతూరు. తనకు బాల్యం నుంచీ ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో చేరతానంటే.. మొదట అమ్మ బుజ్జి వద్దన్నది. నాన్న కీమ నాయక్ మాత్రం ప్రోత్సహించారు. దీంతో తల్లి కూడా కాదనలేకపోయింది. చదువులో భాగంగా ఫొటోగ్రఫీ అధ్యాపకుడు రఘు థామస్ ఓ అసైన్మెంట్ ఇచ్చారు. సొంతూరి ఆత్మను ఆవిష్కరించే ఛాయాచిత్రాలు తీసుకురమ్మని సూచించారు.
ఆ ప్రాజెక్ట్లో భాగంగా తన నాయనమ్మ ఫొటోలనూ తీసింది మమత. ఫొటో కోసం ఎంచుకున్న కోణం, చీకటి వెలుగులు, నేపథ్యం.. రఘు థామస్కు ఎంతో నచ్చాయి. తనే చొరవ తీసుకుని అంతర్జాతీయ ఫ్యాషన్ మ్యాగజైన్కు పంపారు. వెంటనే అది ప్రచురితం కావడంతో మమత ఆనందానికి అవధులు లేకుండా పోయింది. “నేను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జ్ఞాపికను అందుకుంటున్నప్పుడు.. నాన్న కళ్లలో ఆనందం చూశాను. నన్ను ఎగతాళి చేసినవారికి చెంప ఛెళ్లు మనిపించే సమాధానం ఇవ్వగలిగాను. భవిష్యత్తులో ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్గా పేరు తెచ్చుకోవాలని నా కోరిక. పోర్ట్రెయిట్ ఫొటోగ్రఫీ మీదా ఆసక్తి ఉంది. తల్లిదండ్రులు, గురువు రఘుథామస్, ప్రిన్సిపల్ రజని, ఇతర అధ్యాపకులకు కృతజ్ఞతలు” అంటున్నది మమత.
ఈ ఆవరణలో క్లిక్ క్లిక్ పాఠాలు నేర్చుకున్న సిద్దం మౌనిక అరకులో జరిగిన జాతీయస్థాయి ఫొటోగ్రఫీ వర్క్షాప్లో పాల్గొన్నది. ల్యాండ్ స్కేప్ విభాగంలో బంగారు పతకం సాధించింది. ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూర్ మండలం, కన్నాపూర్ తన స్వగ్రామం. ఇక్కడి విద్యార్థులు అనిత, శ్రుతి ముంబైలో జరిగిన జాతీయ స్థాయి ఇంటీరియర్ డెకరేషన్ సదస్సులో పాల్గొన్నారు. ఇద్దరి స్కెచింగ్లకూ ప్రశంసలు వచ్చాయి. అకాడమీ విద్యార్థుల ప్రతిభను గుర్తించిన కలెక్టర్ వేములవాడలో ఏర్పాటు చేస్తున్న గ్రంథాలయం ఇంటీరియర్ డెకరేషన్ బాధ్యతలు అప్పగించారు. ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులైతే.. తమ డ్రెస్లు తామే డిజైన్ చేసుకుని.. హ్యామ్స్టెక్ విశ్వవిద్యాలయంలో క్యాట్వాక్ చేశారు. రేపటి ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలేది వీళ్లే. ఫొటోగ్రఫీ ముఖచిత్రాన్ని మార్చేది వీళ్లే. పికాసోలకు సవాలు విసిరేదీ వీళ్లే.
ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్.. అన్నిటిలోనూ మా విద్యార్థులు ఆణిముత్యాలే. ఏ వర్క్షాప్కు వెళ్లినా తమదైన ముద్ర వేస్తున్నారు. ఏ పోటీలో పాల్గొన్నా ఏదో ఒక బహుమతితో తిరిగొస్తున్నారు. ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తున్నది.
– రజని, ప్రిన్సిపల్