ఆధునిక సాంకేతికత మరో సరికొత్త ఆరోగ్య సమస్యను మన నెత్తిమీదికి తీసుకొచ్చింది. ఇప్పటికే చాలామందిని ఇబ్బంది పెడుతున్న ఈ మాయదారి రోగం.. ‘టెక్ట్స్ నెక్’ పేరుతో ఇప్పుడిప్పుడే వైరల్ అవుతున్నది. ఫోన్, ట్యాబ్, కంప్యూటర్ లాంటి పరికరాలను ఎక్కువగా ఉపయోగించేవారిని ఈ వ్యాధి వేధిస్తున్నది. ముఖ్యంగా గంటలకు గంటలు తలను కిందికి వంచి ఫోన్ చూడటం.. కంప్యూటర్ స్క్రీన్కే కళ్లను అప్పగించే వారిలో ఈ ‘టెక్ట్స్ నెక్’ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నది.
ప్రస్తుత జనాభాలో 18 – 44 ఏండ్ల వయసు వారిలో 79 శాతం మంది రోజంతా ఫోన్ను తమతోనే ఉంచుకుంటున్నారట. నిద్రపోయే సమయాన్ని మినహాయిస్తే.. కేవలం రెండు గంటలు మాత్రమే ఫోన్కు దూరంగా ఉంటున్నారని అనేక సర్వేలు చెబుతున్నాయి కూడా! ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో అయినా రోజంతా ఫోన్ స్క్రీన్లోనే తలదూర్చి.. గంటలు గంటలు గడిపేస్తున్నారు. దీంతో, వారి మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి.. మెడ, భుజాలపై తీవ్రమైన భారం పడుతున్నది.
ఎందుకంటే.. మెడను ఎంత ఎక్కువగా వంచుతారో.. దానిపై అంత బరువు పడుతుంది. దాంతో దీర్ఘకాలంలో నొప్పితోపాటు మెడలు, భుజాల కండరాలు బిగుసుకు పోయి.. ‘టెక్ట్స్ నెక్’కు దారి తీస్తున్నది. ఈ సమస్య ఉన్నవారిలో భుజాల మీదుగా బిగుతుగా అనిపించడం, మెడలో నొప్పితోపాటు దీర్ఘకాలిక తలనొప్పి కూడా వేధిస్తుంది. సమస్య అలాగే కొనసాగితే.. నరాలలో వాపు, వెన్నెముక వంగిపోవడం, ఆర్థరైటిక్ సమస్యలూ చుట్టుముడతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.