అదొక పిల్లల లైబ్రరీ. ‘సైలెన్స్.. సైలెన్స్..’ అని హెచ్చరించడానికి లైబ్రేరియన్ ఉండరు. కానీ నిశ్శబ్ద వాతావరణమే కనిపిస్తుంది. మూడు గదులలో ఎటు చూసినా పుస్తకాల అరలే. అక్కడి పుస్తకాలు చదివి రచయితలుగా మారిపోతున్న పిల్లలూ ఉన్నారు. ‘ద బుక్షెల్ఫ్’ ద్వారా పిల్లల అభిరుచులు, ఆలోచనల్లో సానుకూలమైన మార్పు సాధిస్తున్నారు బత్తుల హరిప్రియ.
టు : కజు కిబుషి.
విషయం : మీరు రాసిన ‘ఆమ్యులెట్’ నవల కొత్త సిరీస్ గురించి.
‘సర్! దిసీజ్ హరిప్రియ ఫ్రమ్ హైదరాబాద్. మా లైబ్రరీ పిల్లలు మీ ఆమ్యులెట్ నవల 8వ సిరీస్ కూడా చదివేశారు. కొత్త సిరీస్ ఎప్పుడొస్తుంది? అని అడుగుతున్నారు. నా దగ్గర సమాధానం లేదు. మీరు కనుక కొత్త సిరీస్ను ప్రింట్ చేయిస్తే.. మాకు ఒక కాపీ పంపండి. మా పిల్లలు మీతో మాట్లాడేందుకు ఉవ్వి ళ్లూరుతున్నారు. వీలునుబట్టి సమయం కేటాయించండి.
ధన్యవాదాలు’.. అంటూ మెయిల్ చేసింది హరిప్రియ. మరుసటి రోజే ఆ అమె రికన్ పిల్లల రచయిత నుంచి సమాధానం.. ‘రేపు ఉదయం 10.30కి పిల్లలను జూమ్లో కలుస్తాను’ అంటూ. కేవలం గంట సమయం ఇచ్చారు. ఆ గంట కాస్తా.. గంటలైంది. పిల్లలు ఆ సిరీస్ వింతలు, విశేషాలను రచయితతో పంచుకున్నారు. ‘ద బుక్షెల్ఫ్ లైబ్రరీ’ ద్వారా హరిప్రియ చేస్తున్న సేవ గురించి తెలుసుకున్న కిబుషి.. ఆమెను అభినందించారు.
అలా మొదలైంది..
హైదరాబాద్కు చెందిన హరిప్రియకు చిన్నప్పటి నుంచీ పుస్తకాలంటే ఇష్టం. తను కోల్కతా యూనివర్సిటీ నుంచి ఎంటెక్ పట్టా అందుకుంది. సింగపూర్ వెళ్లి మాస్టర్స్ చేసింది. అక్కడే కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. మళ్లీ హైదరాబాద్ వచ్చేసింది. తనకు పుస్తకాలంటే ప్రాణం. తన మేనల్లుడు సహా.. చుట్టుపక్కల పిల్లలంతా ఫోన్లలో బిజీ అయ్యారని గ్రహించి.. వారిలో కొందరికైనా పుస్తకాలను పరిచయం చేయాలని భావించింది. అమ్మా నాన్నలను ఒప్పించి సొంతంగా లైబ్రరీ ప్రారంభించింది.
అంబర్పేట, డీడీ కాలనీలో 1500 పుస్తకాలతో మొదలైన ‘ద బుక్షెల్ఫ్’ ఇప్పుడు పదివేల గ్రంథాలకు విస్తరించింది. అందులో సైన్స్, ఫిక్షన్, డ్రామా, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ తదితర విభాగాల పుస్తకాలు ఉన్నాయి. భారత్, చైనా, జపాన్, రష్యా, ఉక్రెయిన్.. తదితర దేశాల జానపద కథలూ లభిస్తాయి. ఇవన్నీ కూడా తను సొంత డబ్బుతో కొనుగోలు చేశారు. అప్పుడప్పుడు హరిప్రియ అక్కలు, తమ్ముడు పుస్తకాలు కొని విరాళంగా ఇస్తుంటారు.
బడి నుంచి నేరుగా..
ద బుక్ షెల్ఫ్ లైబ్రరీ పిల్లల్ని అపారంగా ప్రభావితం చేసింది. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఏకాగ్రత అధికమైంది. పదకోశం విస్తరించింది. పరీక్షల్లో మంచి మార్కులు వస్తున్నాయి. ప్రవర్తనలో మార్పు కనిపిస్తున్నది. టీవీలు, ఫోన్లు ఎదురుగా ఉన్నా కన్నెత్తి చూడటం లేదు. సాయంత్రం ఇంటి గంట కొట్టగానే.. నేరుగా ఇక్కడికొచ్చి పుస్తకాలు చదువుకుంటారు. ఇష్టమైన రచనలు ఇంటికి తీసుకెళ్తారు. ఆదివారమైతే లైబ్రరీ మరింత కోలాహలంగా ఉంటుంది. చదువుతో పాటు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సరికొత్త జీవనశైలిని నేటి తరానికి పరిచయం చేస్తున్నది హరిప్రియ. ఆ ఆవరణలో ‘సైలెన్స్ ప్లీజ్’ అనే బోర్డు ఎక్కడా కనిపించదు.
పిల్లలపై ఎలాంటి ఆంక్షలూ ఉండవు. అది వాళ్ల రాజ్యం! నలుమూలల నుంచి.. “నేను నిర్వహించే ‘ద బుక్షెల్ఫ్’ లైబ్రరీకి హైదరాబాద్ నలుమూలల నుంచీ పిల్లలు వస్తారు. సభ్యత్వం తీసుకుంటారు. కావల్సినంత సేపు చదువుకొని.. నచ్చిన పుస్తకాలను ఇంటికి తీసుకెళ్తారు. పిల్లల ఇష్టానికే నేను ప్రాధాన్యం ఇస్తాను. ఉదయం ఓ స్కూల్లో ఉద్యోగం చేస్తాను. సాయంత్రం పిల్లలతో గడిచిపోతుంది. లైబ్రరీ, పిల్లలు.. ఈ రెండూ లేకపోతే జీవితమే లేదనిపిస్తుంది. అంతలా మమేకమయ్యాను. చిన్నారుల ఆప్యాయత నన్ను కట్టిపడేస్తుంది. వీళ్లందర్నీ నా బిడ్డలుగానే భావిస్తాను. ముందు ముందు లైబ్రరీని ఉన్నతంగా తీర్చిదిద్దాలని నా ఆశ” అని భవిష్యత్ ప్రణాళికను వివరిస్తారు బత్తుల హరిప్రియ.
అవార్డు రాకతో..
కరోనా సమయంలో దాదాపు 9 నెలల పాటు ద బుక్షెల్ఫ్ లైబ్రరీని మూసేశారు. ఆ సమయంలో కూడా తన దగ్గరున్న పుస్తకాలను శానిటైజ్ చేసి, పిల్లలకు పంపేది హరిప్రియ. పిల్లలు ఇచ్చిన పుస్తకాలను మళ్లీ శానిటైజ్ చేసి, రెండ్రోజులు ఎండబెట్టి వేరే పిల్లలకు చేరవేసేది. కరోనా దెబ్బకు లైబ్రరీని మూసేద్దామని అనుకున్న తరుణంలో టాటా ట్రస్ట్కు చెందిన ‘పరాగ్ రీడ్స్’ సంస్థ నుంచి తొలి అవార్డు వచ్చింది. దీంతో హరిప్రియ మనసు మార్చుకున్నది. లైబ్రరీని కొన
సాగించాలని నిర్ణయించుకున్నది.
…? రవికుమార్ తోటపల్లి