ఎండకాలంలో పెరిగిన ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు శరీరం మనం తాగిన నీటిని చెమట రూపంలో బయటికి పంపిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా చేయకుంటే డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలకు అంటుకడుతుంది. మగత, తలతిప్పడం, తలనొప్పి, ఒక్కోసారి మెదడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులూ తలెత్తుతాయి. డీహైడ్రేషన్ సమస్య ఏ కొంచెం ఉన్నాకూడా మెదడు పనితీరుమీద ప్రభావం చూపుతుందని పరిశోధనల్లో తేలింది. మరి మండే ఎండల్లో శరీరానికి శక్తినిచ్చే ద్రవపదార్థం ఏదైనా ఉందా… అంటే సమాధానం కొబ్బరినీళ్లు. ఇవి శరీరం నుంచి చెమటరూపంలో ఆవిరైన ఎలక్ట్రోలైట్లను తిరిగి తెస్తాయి. అలా శారీరకంగా, మానసికంగా సత్వర ఉపశమనాన్ని ఇస్తాయి.
మనది ఉష్ణమండలం దేశం. డీహైడ్రేషన్ కారణంగా వేసవిలో పనిలో ఉత్పాదకత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి, ఈ కాలంలో పురుషులైతే రోజుకు మూడు లీటర్లు, స్త్రీలైతే సుమారు రెండున్నర లీటర్ల (2,200 ఎంఎల్) నీళ్లు తాగాలి.
ఎండల్లో హైడ్రేటెడ్గా ఉండటానికి శరీరంలో తగినంత నీరు ఉండేలా చూసుకోవాలి. దీనికోసం లస్సీ, కొబ్బరినీళ్లు, పండ్లరసాలు లాంటి సంప్రదాయ భారతీయ పానీయాలను ఎంచుకోవాలి. వీటితో రుచి మాత్రమే కాకుండా శరీరంలో తగినన్ని నీళ్లు కూడా సమకూరుతాయి.
సంప్రదాయ పానీయాల్లో కొబ్బరినీళ్లు సహజసిద్ధంగా దొరికే పానీయం. వీటిలో శరీరానికి అత్యవసరమైన పొటాషియం, సోడియం లాంటి మినరల్స్ ఉంటాయి. ఇవి ఎండ ధాటికి శరీరం నుంచి ఆవిరైపోయే ఎలక్ట్రోలైట్స్ను తిరిగి అందిస్తాయి. అలా సత్వరమే శక్తిని ప్రసాదిస్తాయి. కొబ్బరినీళ్లు… శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులను అదుపులో ఉంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయులను తగ్గిస్తాయి. చర్మానికి, జుట్టుకు మేలుచేస్తాయి. పైగా చక్కెరలు ఎక్కువగా ఉండే శీతల పానీయాలకు సహజ సిద్ధమైన ప్రత్యామ్నాయం కూడా.
కొబ్బరినీళ్లను రోజులో ఏ సమయంలోనైనా తాగొచ్చు. అయితే పొద్దున లేదంటే బయటికి వెళ్తున్నప్పుడు తాగడం మంచిది. పిల్లలు సహా అన్ని వయసుల వారూ ఎంచక్కా తీసుకోవచ్చు. కాకపోతే పొటాషియం స్థాయులు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం కొబ్బరినీళ్లు అతిగా తాగకూడదు. ఇకపోతే అన్నివేళలా కొబ్బరిబొండాలు అందుబాటులో లేకపోవచ్చు. ఇలాంటప్పుడు మార్కెట్లో డబ్బాల్లో కూడా కొబ్బరినీళ్లు దొరుకుతున్నాయి. యాడెడ్ షుగర్, కృత్రిమ ఫ్లేవర్లు కలపనివైతే వీటిని నిరభ్యంతరంగా తాగొచ్చు.
శరీరం, మెదడు సరిగ్గా పనిచేయాలంటే తగినంత హైడ్రేషన్ అవసరం. ఎండకాలంలో అయితే ఇంకా ఇంకా అవసరం. సమతులాహారంతోపాటు కొబ్బరినీళ్లను తీసుకోవడం వల్ల మండే ఎండల్లో కూడా రోజంతా శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవచ్చు. వేసవి తాపాన్ని జయించవచ్చు.