‘పాటిల్ కాకి’ ఫుడ్ స్టార్టప్ విజయ గాథ ఆనంద్ మహీంద్రా లాంటి దిగ్గజాలకూ నచ్చింది. కారణం, ఆ వ్యాపారంలో బిజినెస్ మేనేజ్మెంట్ కంటే.. అమ్మతనమే ఎక్కువ. మార్కెటింగ్ వ్యూహాలతో పోలిస్తే ఆత్మీయ సేవలే అధికం. కాబట్టే, ముంబైకి చెందిన గీతా గోవింద్ పాటిల్ ఏటా కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నారు. ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నారు.
ఆమె పేరు గీతా గోవింద్ పాటిల్. నడి వయసు తర్వాత ‘పాటిల్ కాకి’ పేరుతో ఫుడ్ స్టార్టప్ ప్రారంభించారు. ‘అమ్మచేతి వంట’ ఆ సంస్థ ట్యాగ్ లైన్. సరిగ్గా ఏడేండ్ల క్రితం.. అనుకోని పరిస్థితుల్లో ఆ అమ్మ ఫుడ్ ప్రెన్యూర్గా మారారు. ఇంటి నుంచే మహారాష్ట్ర సంప్రదాయ చిరుతిళ్లు, మిఠాయిలు తయారు చేసి అమ్మడం ప్రారంభించారు.
ఆ తీయతీయని రుచులు ఓ చేదు అనుభవంలోంచి పుట్టుకొచ్చాయి. గీత భర్త గోవింద్ ఉద్యోగం పోవడంతో ఆ కుటుంబానికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. మరో కొలువు దొరకడం అసాధ్యమైంది. ఆ సంక్షోభ సమయంలో గీతా పాటిల్.. ఇంటి బాధ్యతలు తీసుకున్నారు. వంటను ఉపాధిగా ఎంచుకున్నారు.
గీతమ్మ చేతి రుచి అమృతమే. అతిథి సేవల్లో ఆమెకు తిరుగులేదు. చెదరని చిరునవ్వు తన ప్రత్యేకత. ఐదువేల రూపాయల పెట్టుబడితో 2016లో చిన్నపాటి స్వగృహ ఫుడ్స్ ప్రారంభించారు గీత. మోదక్, పూరంపోలి (బొబ్బట్లు), చక్లీ, పోహె (అటుకులు), చివ్డా మొదలైనవి తయారు చేసి అమ్మసాగారు. జనానికి ఆ రుచి నచ్చేసింది. నిజానికి, ముంబై జీవితం అంటేనే.. గడియారం వెనకాలే పరుగులు తీయడం.
ఆ ఉరుకులో పడిపోయి సంప్రదాయ రుచుల్ని మరిచిపోయారు మహానగర వాసులు. ఆ కమ్మదనాన్ని మళ్లీ జిహ్వకు పరిచయం చేశారు గీత. ఇక తిరుగేముంది? ‘పాటిల్ కాకి’ వ్యాపారం రూ.3.5 కోట్ల వార్షిక టర్నోవర్ను అధిగమించింది. ప్రస్తుతం, దాదాపు వందమంది మహిళలు ఆమె దగ్గర పనిచేస్తున్నారు. ఈ మధ్యే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా గీతా పాటిల్ వీడియోను షేర్ చేశారు. ఆమె పట్టుదలను ప్రశంసించారు.
అమ్మ చేతి వంట
గీత ముంబైలో పుట్టి పెరిగారు. తండ్రి ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసేవారు. పెళ్లి కూడా ముంబైవాసితోనే జరిగింది. గీత వంటకాలు అమ్మతనాన్ని గుర్తు చేస్తాయి. నిజానికి, ఆ పాకశాస్త్ర నైపుణ్యాన్ని తల్లి నుంచే వారసత్వంగా అందుకున్నారామె. గీత వాళ్లమ్మ రోజూ ఇరవై మందికి టిఫిన్లు, భోజనాలు వండి క్యారేజీలో సర్ది పంపేవారు.
‘ఆ పనిలో అమ్మకు సాయం చేసేదాన్ని. దినుసుల్ని ఎలా నూరుకోవాలి, ఉప్పూకారం ఎంత వేయాలి.. అనేది అమ్మ ద్వారానే తెలుసుకున్నాను’ అంటూ బాల్యాన్ని గుర్తుచేసుకుంటారామె. ప్రస్తుతం, గీతా పాటిల్ సంస్థకు పాతికవేలకు పైగా కస్టమర్లు ఉన్నారు. పుణె, థానే, నవీ ముంబై, ముంబై ప్రాంతాల్లో రోజూ వేలమంది ‘పాటిల్ కాకి’ చిరుతిళ్లు రుచి చూస్తున్నారు.
‘క్షణం కూడా తీరిక ఉండటం లేదు. సమయం దొరికితే బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తాను’ అంటూ నవ్వేస్తారామె. లాక్డౌన్ సమయంలో ఆమె కుమారుడు వినీత్, అతని స్నేహితుడు దర్శిల్ రంగంలో దిగారు. సంప్రదాయ వ్యాపారానికి కార్పొరేట్ హంగులు తెచ్చారు. లాక్ డౌన్ సమయంలో రూ. 12 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వ్యాపారాన్ని తాజాగా రూ. 3.4 కోట్లకు తీసుకొచ్చారు. ‘ఏ వంట అయినా రుచిగా, శుచిగా చేస్తాను.
ప్యాకింగ్లో పదార్థాలు చితికిపోకుండా అందించడమే మా విజయ రహస్యం’ అంటారు గీత. కాబట్టే జనం వాటిని ఇష్టంగా కొంటున్నారు. మరింత ఇష్టంగా తింటున్నారు. ఇప్పుడు గీతా పాటిల్కు ఖరీదైన శాంతా క్రజ్ ప్రాంతంలో సొంత జాగా ఉంది. అక్కడ అత్యాధునిక హంగులతో ఓ కిచెన్ ఏర్పాటు చేయాలని ఆలోచన. ఆ పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయి.
నేను పెద్దగా చదువుకోలేదు. లోకజ్ఞానమూ తక్కువే. కానీ కష్టాన్ని నమ్ముకున్నాను. అదే నన్ను నిలబెట్టింది. బాబు ఎదిగిరావడంతో వ్యాపారాన్ని విస్తరించగలిగాను. తోటి మహిళలకు నా సలహా ఒక్కటే.. ఆర్థిక స్వాతంత్య్రం సాధించండి. మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. సమాజంలో మీకంటూ ఓ స్థానం సంపాదించుకోండి. డబ్బు దానంతట అదే వస్తుంది.
– గీతా గోవింద్ పాటిల్
…? పాసికంటి శంకర్