కర్నాటక హైకోర్టులో ఏప్రిల్ 8న ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. బధిరురాలైన సారా సన్నీ అనే న్యాయవాది సంజ్ఞల (సైన్ లాంగ్వేజ్) ద్వారా తన వాదనలు వినిపించింది. సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ సాయంతో సారా తన వాదనలు అద్భుతంగా వినిపించిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న ప్రశంసలు కురిపించారు. అంతేకాదు సంభాషణ, వినికిడి లోపం ఉన్న న్యాయవాది వాదనలు చోటుచేసుకున్న న్యాయస్థానంగా కర్నాటక హైకోర్టు కూడా చరిత్రలో నిలిచిపోయింది.
నిజానికి భారతదేశంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న తొలి బధిర న్యాయవాది సారా కావడం గమనార్హం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కూడా భారతీయ న్యాయవ్యవస్థలో వివిధ నేపథ్యాలు ఉన్న మహిళల ప్రాతినిధ్యం పెరగాలని పదేపదే పేర్కొన్నారు. ఈ క్రమంలో శారీరక అవకరాలు ఉన్న భారతీయులు తమ ఆటంకాలను దాటుకొని ఏ రంగంలోనైనా రాణించవచ్చనడానికి సారా ఉదాహరణగా నిలిచిపోయింది. కేరళలోని కొట్టాయంకు చెందిన సారా బెంగళూరు సెయింట్ జోసెఫ్స్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదువుకున్నది. న్యాయవాద వృత్తిని చేపట్టాలనేది ఆమె కల.
అంతేకాకుండా తనలా వినికిడి లోపం ఉన్నవాళ్లను ఈ రంగం దిశగా ప్రోత్సహించడానికి ఈ వృత్తిలోకి ప్రవేశించడం వెనక ప్రధాన ఉద్దేశం అంటారామె. ఇప్పుడామె నేషనల్ అసోసియేషన్ ఆఫ్ డఫ్ అండ్ ద హ్యూమన్ రైట్స్ లా నెట్వర్క్లో క్రియాశీలక సభ్యురాలిగా కూడా సేవలందిస్తున్నారు. 2023 సెప్టెంబర్లో సుప్రీంకోర్టులో సారా తన వాదనలు అద్భుతంగా వినిపించింది. అలా సర్వోన్నత న్యాయస్థానంలో వాదించిన తొలి బధిర న్యాయవాదిగా కూడా చరిత్ర సృష్టించింది. ఈ కేసును భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ వర్చువల్గా వినడం విశేషం. “జస్టిస్ చంద్రచూడ్ విశాల హృదయం తనలాంటి ఎంతోమందికి న్యాయవ్యవస్థలో ప్రవేశించడానికి ద్వారాలు తెరిచింది” అని సారా సంతోషం వ్యక్తం చేస్తున్నది.