తెలంగాణ ఆడబిడ్డ సాధికారతకు దిక్సూచిగా నిలబడింది. మహిళా సంఘాలు ఎలా పని చేయాలి, నాలుగు చేతులూ కలిపి పేదరికాన్ని ఎలా తరిమేయాలి.. అనేది దేశానికంతా నేర్పిస్తున్నది. తన అనుభవాలనే పాఠాలుగా బోధిస్తున్నది. అందులోనూ ఓరుగల్లు మహిళా సమాఖ్య అన్ని రాష్ర్టాలూ పర్యటించి స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయిస్తున్నది. ఈ మధ్యే లఢక్ వరకూ వెళ్లి తెలంగాణ తడాఖా చాటి చెప్పింది.
దాదాపు ఒకటిన్నర దశాబ్దం క్రితం.
ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్ మండలంలో సహకార భావనకు బీజం పడింది. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన పది ఉత్తమ మండల సమాఖ్యల సమూహంగా.. ఓరుగల్లు పరస్పర సహాయ సహకార మహా సమాఖ్య ఏర్పడింది. గీసుగొండ, నెక్కొండ, వర్ధన్నపేట, నర్సంపేట, ధర్మసాగర్, వేలేరు, ఐనవోలు, తొర్రూరు, లింగాల గణపూర్, రఘునాథపల్లి మండల సమాఖ్యలు దీనిలో ఉన్నాయి. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల మహిళలూ సభ్యులుగా చేరారు.
మొత్తం 426 గ్రామాల్లోని 10,494 మహిళా స్వయం సహాయక సంఘాలు ఓరుగల్లు మహా సమాఖ్యలో భాగం అయ్యాయి. జీవనోపాధి, పేదరిక నిర్మూలన, ఆర్థికాభివృద్ధి.. ఈ వేదిక ఆశయం. పిల్లల స్కూలు ఫీజులు, పుస్తకాల ఖర్చులు, కుటుంబ వ్యవసాయ పెట్టుబడులకు పైసలు లేక ఇబ్బంది పడే పరిస్థితిని తొలగించే లక్ష్యంతోనే ఈ సంఘాలన్నీ సంఘటితం అయ్యాయి. మండలంలోని ప్రతి మహిళా స్వయం సహాయక సంఘంలోనూ ప్రతివారం కచ్చితంగా సమావేశం జరిగేలా నిబంధన రూపొందించారు.
ఆదిలో అవరోధాలు ఎదురైనా.. త్వరలోనే బండి గాడిన పడింది. ఆ వారంలో సభ్యుల నుంచి వసూలైన డబ్బును ఎవరో ఒకరికి అప్పుగా ఇవ్వడం ప్రారంభించారు. పూచీకత్తు, తిరిగి చెల్లించే విషయంలో కచ్చితంగా వ్యవహరించారు. క్రమంగా ధర్మ సాగర్ మండలంలోని అన్ని సంఘాలూ ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి. ఇదే స్ఫూర్తితో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని మండలాల్లో ‘ప్రతివారం మీటింగ్’ నియమాన్ని అమలు చేశారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రణాళికతో ముందుకు సాగారు. ధర్మసాగర్లోని మహిళా సంఘాల సభ్యులు పల్లెపల్లెకూ వెళ్లి.. ప్రతివారం సమావేశం నిర్వహించేలా శిక్షణ ఇచ్చారు. ఆ అనుభవంతోనే ఇప్పుడు దేశ వ్యాప్తంగా శిక్షణ ఇస్తున్నారు.
దేశానికే దిశానిర్దేశం
మన మహిళా సంఘాల పనితీరు పొరుగు రాష్ర్టాల్లోనూ ఆసక్తిని పెంచింది. దీంతో, తెలంగాణ సంఘాల దగ్గర శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఓరుగల్లు మహా సమాఖ్యతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇప్పటికే ఈ సమాఖ్య ఇరవై ఒక్క రాష్ర్టాల మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరాఖండ్, అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లి పాఠాలు చెప్పారు మనవాళ్లు. వెనిజులా, ఘనా దేశాల్లోనూ తమ గొంతు వినిపించారు. ముస్సోరి అకాడమీలో కాబోయే కలెక్టర్లలోనూ సహకార స్ఫూర్తిని నింపారు. తాజాగా, ఓ ముప్పైమంది ఓరుగల్లు సమాఖ్య మహిళలు దాదాపు 60 రోజులు లఢక్లో పర్యటించారు. అక్కడి స్త్రీలకు సంఘాలు స్థాపించడం నేర్పించారు. సమష్టి విజయాన్ని పరిచయం చేశారు. అక్కడితో ఆగకుండా కార్గిల్ వరకూ ప్రయాణించారు.
తెలంగాణ మహిళలు హిందీలోనూ మాట్లాడగలరు. ఇది కూడా కలిసొచ్చిన విషయమే. మిగతా భాషల విషయంలో గ్రామీణాభివృద్ధి శాఖ శిక్షణ ఇస్తున్నది. లఢక్లోని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వసతులు కల్పించింది. బీమా భరోసా ఇచ్చింది. తమ అనుభవాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు ఇక్కడి మహిళలు. ఇప్పటి వరకు రూ.23 కోట్ల 92 లక్షల మొత్తం పారితోషికంగా వచ్చింది. ఈ సమాఖ్యకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ రిసోర్స్ ఆర్గనైజేషన్ (ఎన్ఆర్వో)గా గుర్తింపు ఇచ్చింది.
గెలుపు పాఠాలు
‘మహిళా సంఘాల నిర్వహణలో ప్రతివారం మీటింగ్ నిర్వహించడం ఎంత అవసరమో అందరికీ తెలియజేస్తున్నాం. మన మహిళలు దేశానికి మాడల్గా మారడం గొప్ప అనుభూతి’ అంటారు డీఆర్డీఏ-డీపీఎం పసునూరి నీలవేణి. ‘లఢక్లో మహిళా సంఘాలు లేవు. మహిళలు పొదుపు చేసుకునేదీ లేదు. బ్యాంకులు చాలా దూరంలో ఉంటాయి. ఎలా పొదుపు చేయాలి, పొదుపు చేసిన డబ్బును ఎలా వినియోగించాలి అనేది తెలియజేశాం. మన పథకాల గురించి చెబితే వాళ్లు తొలుత నమ్మలేదు’ అని వివరిస్తారు సిరిమల్లె గీత.
అమీనాకు ఈ ప్రయాణం సరికొత్త అనుభవం. ఇదే తొలి విమాన ప్రయాణం కూడా. చదివింది ఎనిమిదో తరగతే అయినా.. ఎంబీయే పట్టభద్రులకు సైతం మహిళా సంఘాల నిర్వహణలో పాఠాలు నేర్పగల నైపుణ్యం ఆమె సొంతం. ప్రతి యాత్ర లోనూ బోధించడమే కాదు.. ఎంతోకొంత నేర్చుకునీ వస్తున్నారు మహిళలు. ఆ అనుభవాన్ని సంఘాల నిర్వహణకు అన్వయిస్తున్నారు. కొత్త విజయాలు సాధిస్తున్నారు.
సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.
…? పిన్నింటి గోపాల్
గొట్టె వెంకన్న