తెలంగాణ సర్కారు.. ఆరోగ్య మహిళ
రక్త పరీక్ష నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ వరకు.. మొత్తం ఎనిమిది వ్యాధి నిర్ధారణ పరీక్షలు. తొలి దశలో వంద ఆరోగ్య కేంద్రాలలో ప్రారంభించి పన్నెండు వందల కేంద్రాలకు విస్తరించనుంది తెలంగాణ సర్కారు. మహిళ ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యం. కుటుంబ ఆరోగ్యమే రాష్ట్ర, దేశ, ప్రపంచ ఆరోగ్యం! పసుపు, కుంకుమ, కాటుక, చీర, రవిక, గాజులు, పువ్వులు,పండ్లు.. మొత్తం ఎనిమిది వస్తువులతో ఆడబిడ్డకు ఒడిబియ్యం పోసినట్టు.. ఎనిమిది పరీక్షలతో మహిళల పట్ల తన ప్రేమను చాటుతున్నారు ముఖ్యమంత్రి. ‘ఆరోగ్య మహిళ’తోనే ఇంటికి కళ! ఇది కేసీఆర్ కల!
ఆరోగ్య మహిళ
పిల్లలను పరీక్షల్లో పాస్ చేయిస్తుంది. ఫలహారం నుంచి పెన్ను వరకు సకలం సకాలంలో సమకూర్చిపెట్టి ర్యాంకు సాధించేందుకు సాయపడుతుంది.
భర్తను బతుకు పరీక్షలో పాస్ చేయిస్తుంది. మంగళసూత్రం అమ్మి అయినా సరే, మొగుడి అప్పులు తీరుస్తుంది.అవసరమైతే, కుట్టుమిషన్తో కనికట్టు చేసి..వేన్నీళ్లకు చన్నీళ్లు అవుతుంది.
సలహాలు సూచనలతో, సాయాలూ సహకారాలతో, ధైర్య వచనాలూ హితోక్తులతో బంధుమిత్రులను, పుట్టింటివారిని, అత్తింటివారిని.. అనేకానేక విషమ పరీక్షల నుంచి ఒడ్డునపడేస్తుంది.
తన బతుకు మాత్రం నిత్యం ఓ పెద్ద పరీక్షే. వివక్షలు, అవమానాలు, వేధింపులు, ఒత్తిళ్లు, బాధలు, అభద్రతలు.. కాలం పెట్టే అన్ని పరీక్షలనూ ఓర్పుతో నేర్పుతో అధిగమిస్తుంది. భర్త బాగోగులు, పిల్లల క్షేమం, అత్తమామల ఆరోగ్యం, బంధువుల సేవలు.. బతుకంతా బాధ్యతల బందిఖానలోనే చిక్కుకుపోతుంది. కళ్లు తిరిగితే అలసట అనుకుంటుంది. ఒళ్లు పెరిగిపోతే వయసు ప్రభావం అని భ్రమపడుతుంది. చూపు మందగిస్తే చత్వారమనో, వినికిడి లోపిస్తే మేనత్త పోలికలనో హాస్యం చేస్తుంది. వైద్య పరీక్షలు చేయించుకోవాలనే ఆలోచనే రాదు. అత్తమామలకు వేళకు మందులు ఇస్తుంది.భర్తకు సమయానికి భోజనం వడ్డిస్తుంది.పిల్లలను అలారమ్ మోగకముందే నిద్ర లేపుతుంది.కానీ, ‘తల్లీ ఆరోగ్యం జాగ్రత్త’, ‘చెల్లీ దవాఖానకు వెళ్లిరా’, ‘అక్కా వైద్య పరీక్షలు చేయించుకో?’ అంటూ తనకు గుర్తు చేసేవారెవరు? ఆ బాధ్యత తెలంగాణ సర్కారు తీసుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నారు.
ఓ అన్న కానుక.
ఓ కొడుకు అండ.
ఓ తండ్రి భరోసా.
ఓ తాత కట్నం.
ఓ మేనమామ నజరానా.
1. మూడు శత్రువులపై యుద్ధం
మధుమేహం, అధిక రక్తపోటు, రక్తహీనత పరీక్షలు
..ఈ మూడూ మహిళల ప్రధాన శత్రువులు. అందులోనూ బీపీ, ఎనీమియా ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. రక్తంలో తగినన్ని ఎర్ర రక్తకణాలు లేని పరిస్థితే.. రక్తహీనత. ఎనీమియా వల్ల కళ్లు, నరాల సమస్యలు తలెత్తుతాయి. డయాబెటిస్ రోగుల్లో కిడ్నీ, గుండె, ధమనుల వ్యాధులు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే శరీరంలో తగినన్ని ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి అవుతాయి. ఎందుకంటే రక్త హీనత, కిడ్నీల పనితీరు ఒకదానినొకటి ప్రభావితం చేస్తాయి. మెదడు, ఇతర అవయవాలకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం, అలసట, బలహీనత, శ్వాస ఆడకపోవడం, తలతిరగడం, తలనొప్పి, చర్మం పాలిపోవడం, ఛాతీలో నొప్పి, చేతులు, కాళ్లు చల్లబడటం, శరీర ఉష్ణోగ్రత తగ్గడం, గుండె వేగం పెరగడం మొదలైనవి.. ఎనీమియా లక్షణాలు. అవసరాన్ని బట్టి చక్కెర స్థాయులు, రక్తపోటు, ఐరన్ కొరత, కిడ్నీల వైఫల్యం, విటమిన్ల లోపం, ఎముక మూలుగ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి వివిధ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. బీన్స్, కాయధాన్యాలు, ఆకుపచ్చని కూరగాయలు, చేపలు, ఎండు ఫలాలు, రక్తహీనతను నివారించడంలో సాయపడతాయి.
2. మహమ్మారికి అడ్డుకట్ట
క్యాన్సర్ పరీక్షలు
మనిషిని కుంగదీసి, కుటుంబాన్ని బాధపెట్టి.. ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీసే రాకాసి వ్యాధి.. క్యాన్సర్. భారతీయ మహిళలు ఎక్కువగా రొమ్ము, ఊపిరితిత్తులు, గర్భాశయ ముఖద్వారం, నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారు. పొగాకు, మద్యం దురలవాటు, అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి లోపాలు, ఆరోగ్య చైతన్యం లేకపోవడం.. తదితర కారణాల వల్ల మహిళలు ఇట్టే క్యాన్సర్ కోరలకు చిక్కుకుంటున్నారు. సకాలంలో రోగ నిర్ధారణ జరిగితే, ఉత్తమ వైద్యం అందితే క్యాన్సర్ రోగుల ప్రాణాలు కాపాడవచ్చు. ఎమ్ఆర్ఐ, సీటీ స్కాన్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, మామోగ్రామ్.. తదితర పరీక్షల ద్వారా క్యాన్సర్ను గుర్తిస్తారు. రోగి పరిస్థితిని బట్టి నాణ్యమైన చికిత్స అందిస్తారు.
3. ‘బల’ పరీక్షలు
థైరాయిడ్ పరీక్షలు, సూక్ష్మపోషకాల గుర్తింపు, అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపం, విటమిన్-బి12, డి పరీక్షలు.
థైరాయిడ్
థైరాయిడ్.. సీతాకోకచిలుక ఆకారంలో గొంతు దగ్గర ఉండే గ్రంథి. పురుషులతో పోలిస్తే థైరాయిడ్ సమస్యలు స్త్రీలలోనే ఎక్కువ. అయోడిన్ లోపం, ఇతర నాడులకు సంబంధించిన రుగ్మతల (ఆటోఇమ్యూన్ డిసీజెస్) వల్ల ఇవి తలెత్తుతాయి. దీంతో నెలసరి ఇబ్బందులు మొదలవుతాయి. ఒత్తిడిని తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం, శరీరం- మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడం.. థైరాయిడ్ను భద్రంగా ఉంచుకునే మార్గాలు. థైరాయిడ్ ఫంక్షనింగ్ టెస్ట్ ద్వారా ఈ వ్యవస్థ పనితీరును అంచనా వేస్తారు. తగిన చికిత్స చేసి, అవసరమైన మందులు అందిస్తారు.
విటమిన్లు
పోషకాహార లోపంతో విటమిన్లకు సంబంధించిన లోపాలు తలెత్తుతున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో రోగాల బారినపడాల్సి వస్తుంది.
ఐరన్
ఎర్ర రక్తకణాల్లో కీలకమైన మూలకం ఐరన్. రక్తంలోని హిమోగ్లోబిన్తో కలిసి శరీర కణాలకు ఆక్సిజన్ సరఫరా చేయడంలో ఐరన్దే కీలకపాత్ర. నెలసరి వల్ల మహిళల్లో ఐరన్ లోపం తలెత్తుతుంది. దీంతో రక్త హీనత, మగత, రోగ నిరోధక శక్తి బలహీనపడటం, తలతిప్పడం, తలనొప్పి, మెదడులో అసౌకర్యం మొదలైన ఇబ్బందులు తలెత్తుతాయి.
విటమిన్-డి
దీనినే సూర్యరశ్మి విటమిన్ అనీ అంటారు. వెంట్రుకలు, ఎముకల ఆరోగ్యంలో, హార్మోన్ల సమతౌల్యంలో, సంతాన సాఫల్యంలో విటమిన్-డి పాత్ర కీలకం. కండరాల బలహీనత, ఎముకల క్షయం విటమిన్-డి లోపానికి సంకేతాలు. ఫలితంగా క్యాల్షియం లోపించి ఎముకల్లో పగుళ్లు వస్తాయి. చేపలు, గుడ్ల పచ్చసొన, ఉదయపు ఎండ విటమిన్-డి లోపాన్ని నివారిస్తాయి.
విటమిన్-బి12
నాడీ వ్యవస్థ సక్రమంగా పని చేయాలన్నా, ఎర్ర రక్త కణాలు సమృద్ధిగా ఉండాలన్నా విటమిన్-బి12 అవసరం. జంతువుల ఉత్పత్తులలో ఇది సహజంగా లభ్యమవుతుంది. శాకాహారులు విటమిన్-బి12 సప్లిమెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా సమస్య తీవ్రతను గ్రహించవచ్చు.
ప్రొటీన్లు
ప్రొటీన్లు కండరాల నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. శరీరం పనితీరు సాఫీగా జరగడానికి తగిన మోతాదులో ప్రొటీన్లు అవసరం. కంప్లీట్ బ్లడ్ టెస్ట్ ద్వారా హిమోగ్లోబిన్ స్థాయిని, రక్తంలో ఐరన్ శాతాన్ని తెలుసుకోవచ్చు.
4. జాగ్రత్త.. జాగ్రత్త
మూత్రకోశ ఇన్ఫెక్షన్లు- పీఐడీ వ్యాధుల పరీక్ష
పురుషులతో పోలిస్తే స్త్రీలలోనే మూత్రనాళ ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. మూత్ర విసర్జక వ్యవస్థతో ముడిపడిన కిడ్నీలు, మూత్రనాళాలు, మూత్రాశయానికి ఇన్ఫెక్షన్లు సోకుతాయి. ఆ ఇన్ఫెక్షన్ మూత్రాశయానికి పరిమితమైతే నొప్పి అక్కడివరకే పరిమితం. కిడ్నీలకు విస్తరిస్తే మాత్రం తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ సమస్యకు వైద్యులు సాధారణంగా యాంటీబయోటిక్స్తో చికిత్స చేస్తారు. ఇన్ఫెక్షన్ల నివారణకు నీళ్లు, పండ్లరసాలు ఎక్కువగా తీసుకోవాలి. దాంతోపాటు, జననావయవాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇక, స్త్రీల జననాంగాలకు సోకే ఇన్ఫెక్షన్లలో ప్రధానమైనది.. పెల్విక్ ఇన్ఫ్ల మేటరీ డిసీజ్ (పీఐడీ). లైంగికంగా సంక్రమించిన బ్యాక్టీరియా.. గర్భాశయం, ఫాలోపియన్ ట్యూబులు, అండాశయాలకు విస్తరించడం వల్ల సోకుతుంది. జననాంగాల దగ్గర నొప్పి, దుర్వాసనతో కూడిన డిశ్చార్జ్, రక్తస్రావం, జ్వరం, మూత్ర విసర్జనలో ఇబ్బందులు పీఐడీ లక్షణాలు. ఎలాంటి ఆలస్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలి. సాధారణంగా పైలోగ్రామ్, సిస్టోగ్రఫీ, సీటీ స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా మూత్ర విసర్జక వ్యవస్థ పనితీరును అంచనా వేస్తారు. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ విషయంలో వజీనా, సెర్విక్స్ నుంచి తీసిన నమూనాలను పరీక్షించి వ్యాధిని నిర్ధారిస్తారు.
5. నడివయసు సంక్షోభం
మెనోపాజ్ పరీక్షలు, అవగాహన, చికిత్స
మెనోపాజ్ నడివయసు మహిళలను ఉక్కిరి బిక్కిరి చేసే సంక్షోభం. 45-55 ఏండ్లలో మొదలై రుతుచక్రం ఆగిపోవడంతో ముగిసిపోతుంది. దాంతోపాటే అండాశయంలో అండాల ఉత్పత్తి నిలిచిపోతుంది. స్త్రీలలో నెలసరికి కారణమయ్యే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు కూడా తక్కువ మొత్తంలో విడుదలవుతాయి. నెలసరి క్రమం తప్పడం, రాత్రిపూట చెమటలు, ఉద్వేగాలలో మార్పులు, నిద్రలో సమస్యలు, జననాంగ, మూత్రాశయ రుగ్మతలు, మగత, చర్మం పొడిబారడం, కీళ్లనొప్పులు, జుట్టు పలుచ బడటం, మతిమరుపు, లైంగిక ఆసక్తిలో మార్పులు.. మెనోపాజ్ లక్షణాలు. ఈ దశలో సమతులాహారం, వ్యాయామం ముఖ్యం. క్యాల్షియం, విటమిన్-డి శరీరానికి తగినంత లభించేలా చూసుకోవాలి. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, కౌన్సెలింగ్ తదితర మార్గాల్లో ఈ నడివయసు అలజడిని నివారిస్తారు. కౌన్సెలింగ్తో అవగాహన కల్పిస్తారు.
6. మాతృత్వానికి శత్రువులు
నెలసరి రుగ్మతలు-సంతానలేమి పరీక్షలు
సురక్షితమైన, ఆరోగ్యకరమైన నెలసరి మహిళ ప్రాథమిక హక్కు. ఈ సమయంలో ఆమెకు పరిశుభ్రమైన నీరు, సౌకర్యవంతమైన ప్యాడ్స్ అందుబాటులో ఉండాలి. పేదరికం, పౌష్టికాహారలోపం వల్ల చాలామంది నెలసరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మానసిక సమస్యలు కూడా ప్రధాన శత్రువులే. పెల్విక్ అల్ట్రాసౌండ్, ఎండోమెట్రికల్ బయాప్సీ.. తదితర పరీక్షలతో నెలసరి సమస్యలను నిర్ధారించవచ్చు. సంతానలేమి మరో తీవ్ర సంక్షోభం. భారతీయ దంపతుల్లో 15 శాతం మంది వంధ్యత్వాన్ని ఎదుర్కొంటున్నారని అంచనా. ఆధునిక జీవనశైలిలోని ఒత్తిడి, ఊబకాయం, ఆలస్య వివాహాల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. అండాల సంఖ్య తక్కువగా ఉండటం, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్, ఫాలోపియన్ ట్యూబుల్లో అవరోధాలు, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియల్ పాలిప్స్ మొదలైనవి సంతాన సఫలతకు ప్రధాన అవరోధాలు. సమస్య మూలాల్ని తెలుసుకోవడానికి అవసరమైతే అల్ట్రాసౌండ్ టెస్టులు చేస్తారు.
7. దాంపత్య దీపం
లైంగిక ఆరోగ్యంపై అవగాహన
మహిళకు లైంగిక వ్యాధులపై అవగాహన తక్కువ. ఏవైనా ఇబ్బందులు ఎదురైనా మనసులోనే కుమిలిపోతుందే తప్పించి జీవిత భాగస్వామితోనో, వైద్యులతోనో చర్చించదు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాలన్నది ప్రభుత్వ ఆశయం. హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ), హెపటైటిస్ -ఎ, హైపటైటిస్-బి (హెచ్బీవీ), హైచ్ఐవీ తదితర రోగాల పట్ల కూడా అవగాహన కలిగించాలన్నది సర్కారు నిర్ణయం.
8. ఆరోగ్య యోగం
వ్యాయామం- యోగా-వెయిట్లాస్పై అవగాహన
సంపూర్ణ ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో మేలుచేస్తుంది. బరువు, ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అధిక రక్తపోటు, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ముప్పునకు కారణం అధిక బరువే. వీటిని నివారించుకోవాలంటే ఆహారం విషయంలో శ్రద్ధగా ఉండాలి. క్రమంతప్పని వ్యాయామం బరువును తగ్గించడమే కాదు, భావోద్వేగాలనూ అదుపు చేస్తుంది. ఎముకలను బలోపేతం చేస్తుంది. ఎన్నో రోగాల నుంచి కాపాడుతుంది. యోగా, ధ్యానం కూడా ఆ ప్రయత్నంలో ఉపకరిస్తాయి. శిశు ఆసనం, మాలాసనం, వికాసాసనం, ఉత్కటకోణాసనం, నావాసనం, కపోతాసనం మొదలైనవి మహిళలకు ఎంతో ఉపకరిస్తాయని యోగాచార్యులు చెబుతారు. మొత్తంగా యోగా, వ్యాయామం, ఊబకాయ నియంత్రణ గురించి మహిళల్లో చైతన్యం కలిగించాలన్నది సర్కారు ఆలోచన. ఆ దిశగా ఇది తొలి అడుగు.