Snehwan | జల్నా, బీడ్, పర్భణి, వాశిమ్.. మహారాష్ట్రలోని కరువు పీడిత జిల్లాలు. ఇక్కడి పతాక శీర్షికల వార్తలు.. రైతుల ఆత్మహత్యలే. అలా పెద్దదిక్కును కోల్పోయే కుటుంబాల్లో పిల్లల భవిత అగమ్యగోచరం! బడికి పంపడం కూడా తలకు మించిన భారమే. కాబట్టే, పిల్లలు బడిలో కంటే పొలాల్లోనే ఎక్కువగా కనిపిస్తారు. అలా చదువుకు దూరమై, సమాజానికి భారమైన బాలలకు అశోక్ దేశ్మణే ‘స్నేహవాన్’ రూపంలో సాంత్వన చేకూరుస్తున్నాడు.
ఆ రెండెకరాల ఆవరణలో అన్ని వయసుల పిల్లలూ పసుపు పచ్చ అంగీ, నీలంరంగు ప్యాంట్తో పొద్దుతిరుగుడు పువ్వుల్లా అనిపిస్తారు. ఆడుకుంటూనో, చెట్లకింద పుస్తకాలతో కుస్తీ పడుతూనో కనిపిస్తారు. అప్పులతో, వరుస నష్టాలతో కష్టాన్ని ఎదిరించలేక.. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల పిల్లలే ఆ అరవై మందీ. ఆ బాలల బాధ్యత 32 ఏండ్ల అశోక్ దేశ్మణే తీసుకున్నాడు. పెద్ద దిక్కును కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న చిన్నారులను ఆదుకోవాలనే లక్ష్యంతోనే.. 2015లో ‘స్నేహవాన్’ను స్థాపించాడు అశోక్. ఇందుకోసం లక్షణమైన ఐటీ ఉద్యోగాన్నీ వదులుకున్నాడు. అతను కూడా ఓ రైతు బిడ్డే. జానెడు భూమితో ఇంటిల్లిపాది కడుపు నింపలేక తన తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎంత నరకం అనుభవించాడో తనకు తెలుసు. ఆ బాధ మరొకరికి తెలియకూడదనే.. ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలో.. పుణె జిల్లా ఖేడ్ తాలూకా చకన్లో స్నేహవాన్ ఆవరణకు ప్రాణం పోశాడు. అప్పట్లో అతని స్వగ్రామంలోనూ ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచాడు అశోక్. అలాంటి కుటుంబాలు, ఇలాంటి బాల్యాలు వీధి వీధినా కనిపించేవి. ఆ జీవితాల్ని బాగు చేసేందుకు ఏదైనా పరిష్కారం చూపమంటూ ప్రముఖ సామాజిక సేవకుడు ప్రకాశ్ ఆమ్టేను కలిశాడు అశోక్. ఆయన ప్రభావంతో ఉద్యోగం వదిలిపెట్టి స్నేహవాన్ ప్రారంభించాడు. రెండు అద్దె గదుల్లో 15 మందితో ప్రారంభమైన స్నేహవాన్లో మొదట్లో అబ్బాయిలకే వసతి ఉండేది. గతేడాది అమ్మాయిలకు కూడా ద్వారాలు తెరిచారు.
ఒప్పించడం సవాలే
మొదట్లో.. తల్లినో తండ్రినో, లేదంటే ఇద్దరినో కోల్పోయిన పిల్లలను స్నేహవాన్కు పంపడానికి రక్త సంబంధీకులు అంగీకరించేవారు కాదు. ఊళ్లోనే ఉంటే పొలం పనులకు సాయపడతారనే ఆలోచన అందుకు ఓ కారణం. అయినా, కాళ్లావేళ్లా పడి ఒప్పించేవాడు అశోక్. ఇప్పుడు, ఆ సమస్య లేదు. అశోక్కు ఆయన భార్య అర్చన అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. “నా జీవిత భాగస్వామి ద్వారా.. ఇక్కడి పిల్లలకు అమ్మ ప్రేమ పంచాలనుకున్నాను. కానీ నన్ను పెండ్లాడటానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరికి మా దగ్గరి బంధువు అర్చన నాతో వివాహానికి ఒప్పుకొంది” అని గుర్తుచేసుకుంటాడు అశోక్.
జీవన నైపుణ్యాలు
స్నేహవాన్ విద్యార్థుల దినచర్య పొద్దున్నే మొదలవుతుంది. ఆరున్నరకు ప్రార్థన.. ఆ తర్వాత అల్పాహారం ఆరగించి బడికి వెళ్లిపోతారు. నాలుగో తరగతి వరకు ఆ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తారు. ఆ తర్వాత పదో తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో. ఇంటర్ కూడా ప్రైవేట్ కాలేజీలో చేర్పిస్తారు. ఇక్కడే పెరిగి పెద్దయిన విశాల్ శిందే ఇప్పుడు హైదరాబాద్లోని వ్యవసాయ విశ్వ విద్యాలయంలో ఆర్గానిక్ అగ్రికల్చర్లో ఎమ్మెస్సీ చదువుతున్నాడు. అశోక్ దేశ్మణే స్వతహాగా మంచి చదువరి. దీంతో స్నేహవాన్ ప్రాంగణంలో ప్రతి గదిలోనూ పిల్లలకు పుస్తకాలను అందుబాటులో ఉంచాడు. ఓ షిప్పింగ్ కంటెయినర్లో 2,000 ఇంగ్లిష్ పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశాడు. విద్యార్థులకు ఇంగ్లిష్తోపాటు జీవన నైపుణ్యాలను పెంపొందించడం కోసం ఓ ఎన్జీవోతో ఒప్పందం చేసుకున్నాడు. విదేశీ స్వచ్ఛంద సేవకులు కూడా స్నేహవాన్లో సేవలు అందిస్తారు. ప్రతి పిల్లవాడు వారానికి ఒక్క పుస్తకమైనా చదవాలన్నది నియమం. అలా చదివినవారికే, ఆదివారం ఆవరణలో ప్రదర్శించే సినిమా చూడటానికి అవకాశం ఇస్తారు. పుస్తకం చదవలేదంటే సినిమా బంద్.
స్నేహవాన్లో చదువుతోపాటు వ్యాపార మెలకువలు నేర్పుతారు. అలా చిన్నతనంలోనే వ్యాపార నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తున్నారు. ఉద్యోగాలపై మాత్రమే ఆధారపడకుండా, స్వశక్తితో పదిమందికి జీవనోపాధి కల్పించే సామర్థ్యాన్నీ సమకూరుస్తున్నారు. ఇక్కడి వివేకానందుడి చిత్రపటం కింద రాసిన వాక్యాలు అశోక్ను ఉద్దేశించినట్టే అనిపిస్తాయి.. “ఇతరుల కోసం బతికే వారే జీవించి ఉంటారు. మిగిలిన వారు ఉన్నా లేనట్టే”.
పిల్లల రోజువారీ అవసరాల కోసం స్నేహవాన్ ప్రాంగణంలో ఓ గోశాల నిర్వహిస్తున్నారు. వంటావార్పునకు బయోగ్యాస్ వాడుతారు. సౌరశక్తి ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేసుకుంటున్నారు.