అసాధ్యం అనుకునే విజయాన్ని సాధించడంలో గొప్ప సంతృప్తి ఉంది. ‘ఇక ఈ జీవితానికి ఇది చాలు’
అనిపిస్తుంది. కానీ అక్కడితో ఆగిపోని కథ ఇది. అరుంధతి భట్టాచార్య పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి మహిళా చైర్పర్సన్గా సంచలనం సృష్టించారు. ఆ బ్యాంక్కు అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారు. పదవీ విరమణ తర్వాత ఆమె శకం ముగిసింది అనుకున్నారంతా! కానీ ఆ అంచనాలను తలకిందులు చేశారు. అరవై నాలుగేండ్ల వయసులో ప్రముఖ అమెరికన్ కంపెనీ సేల్స్ఫోర్స్ భారతీయ విభాగానికి సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. బ్యాంకింగ్ నుంచి సాంకేతిక రంగానికి మారడం అంత తేలిక కాదు. ఎన్నో నేర్చుకోవాలి. అయినా తన పాత్రను విజయవంతంగా నిర్వహించారు.
సేల్స్ఫోర్స్ను సమర్థంగా ముందుకు నడిపారు. కుటుంబం, ఆరోగ్యం, క్రమశిక్షణ ప్రధానంగా సాగే జీవనశైలే తనకు బలమని చెబుతారు అరుంధతి. ‘ఏ వ్యాపారవేత్త అయినా సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిందే. లేకపోతే వెనుకబడి పోతారు. క్రమంగా కనుమరుగు అవుతారు’ అని సలహా ఇస్తారామె. వ్యాపార పత్రిక
‘బిజినెస్ టుడే’ అరుంధతి భట్టాచార్యను ‘ఉమెన్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపిక చేసింది.