Educate Girls | చదువు జీవితాల్ని మార్చగలదు. మూర్ఖపు సమాజాన్ని ఎదిరించే శక్తిని ఇవ్వగలదు. కాబట్టే, ‘మీ చదువే మీ భవిత’ అంటూ గ్రామీణ బాలికల్లో అక్షరాల పట్ల ఆసక్తిని పెంచుతారు ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ వ్యవస్థాపకురాలు సఫీనా హుస్సేన్. కృత్రిమ మేధ సాయంతో అక్షర సేవ చేస్తున్న సఫీనాను ఇటీవల వరల్డ్ ఇన్నొవేషన్ సమ్మిట్ ఫర్ఎడ్యుకేషన్ (వైజ్) పురస్కారం వరించింది. ఆ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారతీయురాలు ఆమె.
కృత్రిమ మేధను కార్పొరేట్ వైద్యంలో వాడుతున్నారు. వాణిజ్య ప్రకటనల తయారీలో జొప్పిస్తున్నారు. మీడియా రంగంలోనూ ఉపయోగిస్తున్నారు. వీటివల్ల అంతిమంగా సంపన్నులు బాగుపడతారు. మరింత సంపన్నులు అవుతారు. కానీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను గ్రామీణ బాలికల కోసమూ ఉపయోగించవచ్చనీ, ఆ చిట్టితల్లులను బడిబాట పట్టించవచ్చనీ బలంగా విశ్వసించారు సఫీనా హుస్సేన్. ఆమె ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు.
జనాభా లెక్కలు, సామాజిక కార్యకర్తల సర్వేలు, స్వచ్ఛంద సంస్థల అధ్యయనాలు.. ఇలా రకరకాల మార్గాల్లో మన దగ్గర డేటా పోగవుతున్నది. వాటన్నిటినీ ఓ చోట చేర్చి.. కృత్రిమ మేధ సాయంతో వాస్తవాల్ని వెలికితీయవచ్చు. అక్షరాస్యత అతి తక్కువగా ఉన్న గ్రామాలెన్ని? బడి అంటే తెలియని బాలికల సంఖ్య ఎంత?’ అన్నది నిగ్గుదేల్చవచ్చు. ఆ వివరాల ఆధారంగా కార్యకర్తలను ఆయా గ్రామాలకు పంపవచ్చు. కన్నవారిని ఒప్పించవచ్చు. అంతిమంగా పిల్లల్ని బడిబాట పట్టించవచ్చు. నిజమే, తిరుగులేని ఐడియా. ఓ గొప్ప మార్పు తీసుకురాగల ఆలోచన. ఆ ప్రభావమూ అపారమే.
దాదాపు ఇరవై ఒక్క వేలమంది వలంటీర్లు ఆ గణాంకాల ఆసరాతో గడపగడపకూ వెళ్తున్నారు. ఇప్పటికే, పద్నాలుగు లక్షలమంది అక్షరాలు దిద్దుకోని బడి వయసు పిల్లల్ని గుర్తించారు. తొలిదశలో ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్లోని ఇరవై నాలుగువేల గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మలిదశలో దేశమంతా విస్తరించే ఆలోచన ఉందని చెబుతారు సఫీనా. రానున్న పదేళ్లలో కోటిమంది బాలికలకు భరోసా ఇవ్వాలన్నది సంకల్పం. ‘కృత్రిమ మేధకు తిరుగులేదు. నిజమే. కానీ దానికి మనిషి హృదయం తోడైనప్పుడే పరిపూర్ణ ఫలితాలు వస్తాయి. బాల్యం వికసిస్తుంది’ అంటారు సఫీనా. ఆమె నేతృత్వంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ ముంబై కేంద్రంగా పనిచేస్తున్నది.
మురికివాడల నుంచి
సఫీనా సంపన్నుల ఇంట పుట్టలేదు. ఢిల్లీలోని ఓ మురికివాడలో జన్మించారు. ఇరుకిరుకు ఇళ్లు, నాలా ఒడ్డున నివాసాలు ఆమెకు కొత్త కాదు. పేదరికానికి చదువును మించిన పరిష్కారం లేదని నమ్ముతారామె. ఆ విశ్వాసంతోనే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వరకూ వెళ్లారు. ‘జీవితం విలువ తెలియనివారు, ఓ లక్ష్యమంటూ లేనివారు మన చుట్టూ ఉండటాన్ని మించిన శాపం లేదు. నా జీవితంలోనూ అదే జరిగింది. పేదరికం వల్ల చదువు ఆగిపోయింది. పెళ్లి చేసుకోమంటూ పోరుపెట్టారు.
నేను తిరస్కరించాను. ఆరునూరైనా సరే, పెద్ద చదువులు చదువుకుంటానని చెప్పాను. ఆ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్కు లొంగిపోయి ఉంటే.. నా జీవితం అక్కడితో ఆగిపోయేది. ఏ ఆడపిల్లకూ అలాంటి దుస్థితి రాకూడదని నా కోరిక. చదువుతో ఆత్మవిశ్వాసం వస్తుంది. సమస్యల్ని ఎదిరించే ధైర్యం సొంతం అవుతుంది. ప్రతి బాలికా బడికెళ్లాలని నేను పదేపదే కోరేది అందుకే’ అంటూ గతాన్ని నెమరేసుకుంటారు సఫీనా. స్కాలర్షిప్లు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆమె చదువుకున్నారు.
కార్పొరేట్ కెరీర్..
లండన్లో చదువు పూర్తయిన తర్వాత కొంతకాలం సిలికాన్ వ్యాలీలోని ఓ స్టార్టప్లో పనిచేశారు సఫీనా. కానీ, ఆ కొలువు పెద్దగా సంతృప్తిని ఇవ్వలేదు. దీంతో నిరుపేదలకు వైద్య సేవలు అందించే ఓ ఎన్జీవోతో కలిసి పనిచేశారు. అప్పుడు, బడి బాట పట్టని బాలికల కోసం తనవంతుగా ఏమైనా చేయాలనే ఆలోచన వచ్చింది. ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ స్థాపించారు. రాజస్థాన్లోని ఓ పల్లెను బాలికా నిరక్షరాస్యతలేని గ్రామంగా తీర్చిదిద్దారు. ‘ఇప్పటికి చాలా చోట్ల మేకల్ని ఆస్తిగా, ఆడపిల్లల్ని అప్పుగా భావించే మనుషులున్నారు.
ఎంత దురదృష్టకరం?’ అంటారామె ఆవేదనతో. ఆ అపోహను వదలగొట్టడమే తన లక్ష్యమని అంతే స్థిరంగా చెబుతారు. సాంకేతికతను సాధనంగా వాడుకోవడం ఈ అక్షర యోధురాలికి కలిసొచ్చిన విషయం. టెక్నాలజీ పుణ్యమాని కచ్చితమైన డేటా అందుతున్నది. ఆ అంకెలతో నేరుగా నిరక్షరాస్య బాలికల గడప దగ్గరికే వెళ్తున్నారు. కన్నవారి మనసులు మారుస్తున్నారు. చిన్నారుల జీవితాన్ని తీర్చిదిద్దుతున్నారు. ‘ఈ పదహారేండ్ల ప్రయాణంలో ప్రతి రోజూ అమూల్యమైందే. ప్రతి మార్పూ గుర్తుంచుకోదగిందే. ఎంతోమంది డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, సైంటిస్టులుగా, టీచర్లుగా పనిచేస్తున్నారు..’ అని చెబుతున్నప్పుడు ఆమె కళ్లలో ఆనంద బాష్పాలు.
గొంతుకలో తెలియని ఉద్వేగం.
ఆమె పేరు పపిత. రాజస్థాన్లోని
ఓ గ్రామానికి సర్పంచ్. పంచాయతీ నిధులలో సగానికిపైగా విద్యా రంగానికే కేటాయిస్తారు. ప్రతి బాలికా బడికి వెళ్లాల్సిందేనంటూ ఏటా జూన్లో చాటింపు వేయిస్తారు. ఎవరికైనా ఆడపిల్లల పోషణ కష్టంగా ఉంటే తాను దత్తత తీసుకుంటానని మాటిస్తారు. ఇప్పటికే పదిమందిని తీసుకున్నారు కూడా. పూరి గుడిసెల్లో ఏకాగ్రతతో చదువుకునే అవకాశం ఉండదు కాబట్టి, ఇంటిగంట కొట్టగానే పంచాయతీ ఆఫీసుకు వచ్చేయమని సలహా ఇస్తారు. అక్కడే పాలు, ఫలహారం అందిస్తారు. పెద్ద చదువులకు సాయపడతారు. పదిహేనేండ్ల క్రితం.. సఫీనా హుస్సేన్ చొరవతో పపిత బడికెళ్లింది. డిగ్రీ వరకూ చదువుకుంది. రాజకీయాల్లోకి వచ్చింది.