కబ్జాలు, కాలుష్యం, నిర్లక్ష్యం.. చాలా సరస్సులు, చెరువులు మాయం కావడానికి ప్రధాన కారణాలు. మూడేండ్ల క్రితం ఇలాంటి పరిస్థితుల్లో ఉండేది, బెంగళూరులోని సోమనహళ్లి చెరువు. కానీ అరవై మూడేండ్ల రేవతి కామత్ దీని రూపురేఖల్ని మార్చారు. ఆ జలాశయానికి తిరిగి జీవం పోశారు. ఈ జల విజయం వెనక ఉన్న అలుపెరగని కృషి గురించి..
బెంగళూరు నగరంలోని బన్నేరుఘట్టలో నివసించే రేవతి ప్రకృతి ప్రేమికురాలు. పరిసరాలను అందంగా తీర్చిదిద్దే ల్యాండ్ స్కేపింగ్ కళ అంటే ఇష్టం. అందుకే దాన్నే వృత్తిగా ఎంచుకున్నారు. ఎన్నో ప్రాజెక్టులు చేశారు. అందులో భాగంగానే, ఒకసారి సోమనహళ్లి ప్రాంతంలో మొక్కలు నాటిస్తున్నారు. ఆ ఊరిలో 28 ఎకరాల చెరువు ఉన్నట్టు అక్కడి వారి ద్వారా తెలిసింది. ఆ చెరువుకట్టను ముచ్చటగా తీర్చిదిద్దాలని అనుకున్నారు. తీరా వెళ్తే.. అస్తవ్యస్తంగా ఉంది. కొన ఊపిరితో కనిపించింది. ఎలాగైనా ఆ జలాశయాన్ని బాగుచేయాలనుకున్నారు.
డ్రోన్ సాయంతో సర్వే జరిపించి, పరిస్థితిని అంచనా వేశారు. ఆ చెరువుకట్టమీద కనీసం ఐదువేల మొక్కలు నాటవచ్చని అంచనా వేశారు. అప్పటికే జనం కొంత మేర బహిర్భూమిగా వాడుతున్నారు. మరికొంత ఆక్రమణకు గురైంది. ఆ ఊరి సర్పంచ్, యువతీయువకుల సాయంతో మొత్తం చోటును స్వాధీనం చేసుకున్నారు. కట్టంతా బాగుచేశారు. రావి, అల్లనేరేడు, పనస, బాదం, మద్ది మొక్కలు నాటించారు. అంతే.. పిట్టలు, చిలుకలు అక్కడ చేరిపోయాయి.
గత రెండేండ్లలో ఎంత మారిందంటే.. కావేరీ ఉపనది సువర్ణముఖి పాయ వరకూ విస్తరించింది. చెరువు కళకళలాడుతూ ఉండటంతో చుట్టుపక్కల ఉన్న బోర్లు, బావుల్లో నీటి ఊట పెరిగింది. ఈ ప్రయత్నం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందనీ, ప్రకృతి మీద ప్రేమ ఉన్న ఎవరైనా.. ఇలాంటి మంచి పనులకు పూనుకోవచ్చని చెబుతారు రేవతి.