మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు జ్ఞాపక శక్తిని పెంచడంలో ఆహారం కీలకపాత్ర పోషిస్తుందని పరిశోధకులు అంటున్నారు. ‘మైండ్ డైట్’ పాటించేవారిలో మెదడు వృద్ధాప్యం నెమ్మదిస్తుందని చెబుతున్నారు. చైనాలోని జెజియాంగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల ఓ అధ్యయనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహారం-మెదడుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మైండ్ డైట్ను ఫాలో అయ్యేవారిలో మెదడు ఆరోగ్యం బాగుండటంతోపాటు మతిమరుపు, అల్జీమర్స్ లాంటి సమస్యలు తగ్గినట్లు గుర్తించామని చెప్పుకొచ్చారు. మెదడులో బీటా-అమిలాయిడ్ ప్రొటీన్స్ అనే హానికరమైన పదార్థాలు పేరుకుపోవడం వల్ల అల్జీమర్స్ వస్తుందట. మైండ్ డైట్ పాటించడం వల్ల.. ఈ ప్రొటీన్లు మెదడులో పేరుకుపోకుండా ఉంటాయనీ, మైండ్ డైట్ను కచ్చితంగా పాటించే వారిలో అల్జీమర్స్ వచ్చే అవకాశం 53% తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా మైండ్డైట్కు సంబంధించిన వివరాలనూ పంచుకున్నారు. ముడి బియ్యం (బ్రౌన్ రైస్), ఓట్స్, జొన్నలు వంటివి రోజూవారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. రోజుకు కనీసం ఒక్క కూరగాయనైనా తినాలి. వారానికి ఆరుసార్లు పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు తీసుకోవాలి. ఈ ముదురు రంగు ఆకుకూరలు.. మెదడు వయసును తగ్గించడంలో సాయపడతాయి. ఇక పప్పులు, బీన్స్ లాంటివి వారానికి మూడుసార్లు తింటే మంచిది. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని యాంటి ఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కాబట్టి, వీటిని వారానికి కనీసం రెండుసార్లయినా తీసుకోవాలి.
ఇక వారానికి ఒకసారి చేపలు తింటే.. మెదడు చురుగ్గా ఉంటుంది. బాదం, వాల్నట్స్ వంటివి వారానికి ఐదు సార్లు తీసుకోవడం మంచిది. వంటల్లో ప్రధానంగా ఆలివ్ ఆయిల్ ఉండేలా చూసుకోవాలి. వీటితోపాటు రెడ్ మీట్ను తగ్గించాలి. వారానికి మూడు సార్ల కంటే ఎక్కువగా తీసుకోవద్దు. వెన్న, నెయ్యి వంటివి రోజుకు ఒక చెంచా కంటే తక్కువగానే వాడుకోవాలి. చీజ్, వేయించిన ఆహారాలు వారానికి ఒకసారి తీసుకుంటే ఫర్వాలేదు. అంతకుమించి తీసుకుంటే.. మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఇక స్వీట్లు, జంక్ ఫుడ్ వీలైనంత వరకు తగ్గించాలి. ఈ ఆహార నియమాలతోపాటు ప్రతిరోజూ వ్యాయామం, ధ్యానం చేస్తూ ఉంటే.. మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరడగంతోపాటు వయసురీత్యా వచ్చే మెదడు సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది.