Parenting | ఇది పిల్లలకు పరీక్షల కాలం. ఏడాదంతా చదువుకున్నదంతా రెండున్నర గంటల వ్యవధిలో పేపర్ మీద పెట్టేయాలి. పరీక్షలప్పుడు పిల్లలు నిద్ర లేచింది మొదలు చదువుకొమ్మని సూచిస్తుంటారు తల్లిదండ్రులు. తమకన్నీ వచ్చని పిల్లల సమాధానం. ఇదీ తంతు! తీరిక దొరికిందే తడవుగా గ్యాడ్జెట్లకు అతుక్కుపోయే ఈ తరం చిన్నారుల దృష్టిని చదువుపైకి మళ్లించడం అంటే మాటలు కాదు. అలాగని ఒత్తిడి చేయడమూ సరికాదు. మరి మధ్యే మార్గం ఏంటి!?
పిల్లల తెలివితేటలకు పరీక్షల ఫలితాలే గీటురాయి అని చాలామంది తల్లిదండ్రులు భావిస్తుంటారు. కానీ, మార్కులు, ర్యాంకుల పోటీ పిల్లలను ఒత్తిడికి గురి చేస్తుంది. మార్కులు తక్కువ వచ్చినా ఫర్వాలేదని చెప్పమని కాదు, ఒకవేళ తక్కువగా స్కోర్ చేస్తే మందలించడం, దండించడం లాంటివి చేయకండి.
పరీక్షలు దగ్గరపడే కొద్దీ పిల్లలను అన్ని సరదాలకూ దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తుంటారు. తెల్లవారుజామున అలారం పెట్టి నిద్ర లేపుతుంటారు. పక్కన కూర్చొని మరీ చదివించే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ విపరీత చర్యలే! ఏడాదంతా చూసీ చూడనట్టుగా వ్యవహరించి.. పరీక్షలకు వారం ముందు బెత్తం పట్టుకొని సాధిస్తామంటే కుదరదు. వాళ్లేం చదువుతున్నారో.. మొదటినుంచీ గమనిస్తే, పరీక్షలప్పుడు కటువుగా వ్యవహరించే పరిస్థితి ఉండదు.
మరికొందరు తల్లిదండ్రులు పరీక్షల వేళ.. పిల్లలను అస్సలు పట్టించుకోరు. వివాహాలు, విందులని తిరుగుతుంటారు. ఈ వైఖరి ముమ్మాటికీ సరికాదు! పరీక్షలప్పుడే ఉగాది, శ్రీరామనవమి పండుగలు, చైత్ర మాసం కావడంతో చుట్టాల పెండ్లి పిలుపులు అందుతూనే ఉంటాయి. వీటి మోజులో పడి పిల్లలను నిర్లక్ష్యం చేయకండి.
ప్రతి పరీక్షా కాలంలో తగుదునమ్మా అని ఐపీఎల్ సీజన్ కొనసాగుతుంటుంది. రెండో తరగతి పిల్లాడి నుంచి డిగ్రీ చదివే యువత వరకు అందరూ ఐపీఎల్ అభిమానులే! పైగా స్మార్ట్ఫోన్లో లైవ్ మ్యాచ్ చూసే వెసులుబాటు ఉండటంతో.. ఆట నుంచి దృష్టిని మళ్లించడం కష్టమే! ఒక్క మ్యాచూ చూడొద్దని ఆంక్షలు విధించే బదులు.. నచ్చిన జట్ల మ్యాచ్లు చూడనిస్తే సరి! అప్పుడు మిగతా మ్యాచ్ల గురించి ఆలోచించకుండా బుద్ధిగా చదువుకునే అవకాశం ఉంది. అన్నీ చూడాల్సిందే అని పట్టుబడితే దానికీ పరిష్కారం ఉంది. మ్యాచ్ ముగిశాక హైలైట్స్ చూడటానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి.